నోటి ఆరోగ్యంపై మధుమేహం ప్రభావం
ఏ సమస్య వచ్చినా వైద్యులు ముందుగా నోటినే పరిశీలిస్తారు. నోటి ఆరోగ్యంలో దంతాలదే కీలకపాత్ర. దంతాలు అనారోగ్యానికి గురైతే, శరీరంలోని ఇతర భాగాలూ దెబ్బతింటాయి. అందులోనూ, దంతాలపై మధుమేహం తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు మధుమేహానికి, దంతాలకు ఉన్న సంబంధం ఏమిటి? డయాబెటిస్ వల్ల ఎలాంటి దంత సమస్యలు వస్తాయి? ఈ విషయంలో మధుమేహ రోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? .. తదితర అంశాలపై దంతవైద్య నిపుణుల అభిప్రాయాలు తెలుసుకుందాం.
మధుమేహానికి, దంతాల ఆరోగ్యానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. మధుమేహం అంటే రోగి రక్తంలో చక్కెర స్థాయులు అధికంగా ఉండటం. ఇది రెండు రకాలు. మొదటిది.. టైప్-1 డయాబెటిస్. రెండోది.. టైప్-2 డయాబెటిస్. ఎక్కువమందిలో కనిపించేది రెండో రకమే. గర్భిణులలోనూ కొన్నిసార్లు హార్మోన్ మార్పుల వల్ల చక్కెర నిల్వలు పెరిగే అవకాశం ఉంది. కానీ కొద్దిరోజులకే నియంత్రణలోకి వస్తుంది.
టైప్-1
ఈ తరహా మధుమేహ రోగుల్లో జన్యుపరంగానే ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. డయాబెటిస్తో బాధపడే బాలల్లో అయితే.. 20 ఏండ్ల లోపే దంతాలు ఊడిపోవడం మొదలవుతుంది. కనీసం నాలుగు మూల దంతాలు ఊడిపోతే.. దాన్ని టైప్-1 డయాబెటిస్గా పరిగణిస్తారు వైద్యులు.
టైప్-2
ఈ రోగుల్లో ఇన్సులిన్ ఉత్పత్తి జరిగినా, షుగర్ను నియంత్రించేంత స్థాయిలో ఉండదు. టైప్-1, టైప్-2.. రెండు మధుమేహం రకాలూ దంతాలపై ఒకేలా ప్రభావం చూపుతాయి. ఒకేరకమైన ఇబ్బందిని కలిగిస్తాయి.
జెస్టేషనల్ డయాబెటిస్
గర్భిణులలో హార్మోన్ మార్పుల వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం లేకపోలేదు. అయితే, ప్రసవం తరువాత 90 శాతం మందిలో షుగర్ మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుంది. మధుమేహం తీవ్రంగా ఉన్న సమయంలో సాధారణ రోగుల్లో కనిపించే చిగుళ్లు, దంతాల సమస్యలే.. గర్భిణులనూ ఇబ్బంది
పెడతాయి. కాబోయే తల్లి తల్లడిల్లి పోయేలా చేస్తాయి.
తీయని శత్రువు
మధుమేహ పీడితులలో రోగ నిరోధక శక్తి గణనీయంగా పడిపోతుంది. హానికర బ్యాక్టీరియాతో పోరాడే సత్తువ సన్నగిల్లుతుంది. ఫలితంగా ఆ బ్యాక్టీరియా నోటిపై ప్రభావం చూపుతుంది. గాయాలు ఓ పట్టాన మానిపోవు. అక్కడితో ఆగకుండా, ఆ బ్యాక్టీరియా కక్షగట్టినట్టు షుగర్ స్థాయులను పెంచుతుంది. దీనివల్ల నోటి ఇన్ఫెక్షన్లు అధికమవుతాయి. అంటే.. నోటిలో ఇన్ఫెక్షన్లు పెరిగితే మధుమేహ తీవ్రత పెరుగుతుంది. మధుమేహ తీవ్రత పెరిగితే నోటిలో ఇన్ఫెక్షన్లు కూడా పెరుగుతాయి. ఈ బంధానికి అడ్డుకట్ట వేయాలి.
దంతాల అంతుచూస్తూ..
డయాబెటిస్ రోగులను ప్రధానంగా ఆరురకాల దంత సమస్యలు వేధిస్తాయి. 1. పిప్పిపళ్లు, 2. చిగుళ్ల సమస్య, 3. పెరియో డాంటైటిస్, 4. క్రష్, 5. డ్రై మౌత్, 6. నోటి దుర్వాసన.
1. పిప్పిపళ్లు
మనం తీసుకునే ఆహారంలో ఉన్న చక్కెర, పిండిపదార్థాలకు నోటిలోని బ్యాక్టీరియా వేగంగా స్పందిస్తుంది. దీనివల్ల దంతాలపై సన్నని గార ఏర్పడుతుంది. దీనిలోని రసాయనాలు పంటి పైభాగంలోని ఎనామిల్ను, డెంటిన్ను దెబ్బతిస్తాయి. దీనివల్ల పిప్పిపళ్లు పుట్టుకొస్తాయి. బ్లడ్ షుగర్ ఎంత పెరిగితే అంత ఎక్కువగా గార పేరుకుపోతుంది. రసాయనాల దాడి అధికమవుతుంది. నోరంతా పిప్పి విస్తరించవచ్చు.
2. చిగుళ్ల వ్యాధులు
వ్యాధి నిరోధక శక్తి తగ్గడంతో హానికర బ్యాక్టీరియా ప్రాబల్యం పెరుగుతుంది. దీనివల్ల గార మరింత గట్టిపడుతుంది. క్రిమి కీటకాలకు చిరునామాగా మారుతుంది. అంతేకాకుండా.. చిగుళ్లనూ దెబ్బతీస్తుంది. దీంతో చిగుళ్లు ఉబ్బడం, రక్తం కారడం తదితర ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ సమస్యను ‘జింజివైటిస్’ అంటారు. దీన్ని చిగుళ్ల వ్యాధికి మొదటి దశగా పరిగణిస్తారు.
3. పెరియోడాంటైటిస్
జింజివైటిస్కు సకాలంలో చికిత్స చేయకపోతే.. పంటికింది
ఎముకను క్రమంగా తినేయడం మొదలుపెడుతుంది. దీంతో పన్ను వదులైపోతుంది. ఓ దశలో ఊడిపోతుంది. దీన్నే వైద్య పరిభాషలో ‘పెరియోడాంటైటిస్’ అంటారు. ఈ సమస్య సాధారణ వ్యక్తులలో కంటే డయాబెటిక్ రోగుల్లో మూడురెట్లు అధికం. డయాబెటిక్ రోగుల్లో ఇట్టే దంతాలు కదులుతాయి. అంతే కాకుండా చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి చీము రావడం తదితర ఇబ్బందులూ వెంటాడతాయి.
4. క్రష్ : నాలుకపై ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడాన్నే ‘క్రష్’ అంటారు. ఈ ప్రభావంతో నాలుకపై తెలుపు లేదా ఎరుపు రంగు మచ్చలాంటిది ఏర్పడుతుంది. ఇది కొంతమేర నొప్పిని కలిగిస్తుంది. డయాబెటిస్ రోగుల్లో ఈ సమస్య మరీ అధికం.
5. డ్రై మౌత్ : నోట్లో లాలాజలం తగ్గినప్పుడు నోరు పొడిబారుతుంది. దీన్నే ‘డ్రై మౌత్’ అంటారు. లాలాజలం ఎప్పటికప్పుడు నోటిని శుభ్రపరుస్తుంది. రసాయనాలు మరీ పెరిగిపోకుండా, మరీ తగ్గిపోకుండా సమతౌల్యం చేస్తుంది. లాలాజలం తగ్గడం వల్ల రసాయన స్థాయులు అధికమై నోరు అపరిశుభ్రంగా మారుతుంది. దీంతో పిప్పిపళ్లు తదితర సమస్యలు వెంటాడుతాయి.
నోటి దుర్వాసన వేధిస్తుంది. కాబట్టి మధుమేహం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో, దంత సమస్యల విషయం లోనూ అన్ని వైద్యపరమైన చర్యలు తీసుకోవాలి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
1. మధుమేహం నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి.
2. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలి (ఉదయం లేవగానే, రాత్రి పడుకునే ముందు). రాత్రి బ్రష్ చేసిన తరువాత ఎలాంటి ఆహారమూ తీసుకోరాదు.
3. సున్నితంగా ఉండే బ్రష్లనే ఎంచుకోవాలి.
4. మరీ బలంగా రుద్దినట్టు కాకుండా, ఒక పద్ధతి ప్రకారం తోముకోవాలి.
5. కనీసం రెండు నిమిషాలపాటు బ్రష్ చేయాలి.
6. మూడు నెలలకు ఒకసారి బ్రష్ మార్చాలి.
7. అవసరమైతే, రోజు ఫ్లాసింగ్ చేయాలి (పళ్ల మధ్య దారంతో శుభ్రం చేసుకునే పద్ధతి).
8. ప్రతి ఆరు నెలలకు ఒకసారి దంత పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
9. సాధారణ ఆరోగ్యవంతులు ఏడాదికోసారి నిపుణులతో దంతాలను శుభ్రం చేయించుకోవాలి.
10. డయాబెటిస్ ఉన్నవారు ఆ విషయాన్ని దంత వైద్యులకు తప్పక చెప్పాలి.
11. నోటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, వెంటనే వైద్యులను సంప్రదించాలి.
12. ధూమపానం కూడా దంతాల ఆరోగ్యాన్ని దెబ్బ
తీస్తుంది. కాబట్టి, ఆ అలవాటును వదిలించుకోవాలి.
13. తీసి పెట్టుకునే పళ్ల సెట్స్ వాడకాన్ని తగ్గించుకోవాలి.
మౌత్వాష్ మంచిదే
ఏదైనా తిన్న తర్వాత మంచినీళ్లతో పుక్కిలించి ఉమ్మడం మంచి అలవాటు. దీనికితోడు.. ముడి ఉప్పును గోరువెచ్చని నీటిలో కలిపి రోజూ నోటిని శుభ్రపర్చు కోవాలి. దీనివల్ల ఇన్ఫెక్షన్లు కొంతమేర నియంత్రణలో ఉంటాయి. వైద్యుల సలహాతో మార్కెట్లో లభించే నాణ్యమైన మౌత్వాష్లనూ వాడవచ్చు. రసాయనాల ప్రభావం లేనివైతే మరీ మంచిది. దీనివల్ల సగానికి సగం హానికర బ్యాక్టీరియాను తొలిదశలోనే వదిలించుకోవచ్చు.
దంతాలపై మాస్క్ ప్రభావం
కరోనా మహమ్మారి దంతాలనూ వదలడం లేదు. ముఖానికి మాస్క్ పెట్టుకోవడం వల్ల ముక్కుతో శ్వాస తీసుకోవడం పూర్తిగా సాధ్యం కాదు. మనకు తెలియకుండానే నోటి ద్వారా కూడా తీసుకుంటాం. కొవిడ్ భయంతో.. రోజంతా మాస్కులు వేసుకోవడం వల్ల నోటితోనే ఎక్కువగా గాలి పీల్చుకోవాల్సి వస్తుంది. దీనివల్ల నోరు పొడిబారుతుంది. ఫలితంగా నోటి ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ఈ సమస్య డయాబెటిస్ రోగుల్లో మూడు రెట్లు అధికంగా ఉంటుంది. అంతే కాకుండా, కరోనా వచ్చినవారిలో స్టిరాయిడ్స్ వాడకం వల్ల ‘మ్యుకార్మైకోసిస్’ అనే బ్లాక్ ఫంగస్ వస్తుంది. దీనివల్ల దవడ దెబ్బతింటుంది. మధుమేహ బాధితుల్లో ఈ సమస్య మరింత ఎక్కువ. పరిస్థితిని బట్టి జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాలకే మాస్క్లు పరిమితం చేయడం మేలు.
…?మహేశ్వర్రావు బండారి