Curd And Buttermilk | వేసవికాలంలో జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆకలి తగ్గడం, ఆమ్లత్వం పెరగడం, ఆహారం ఆలస్యంగా జీర్ణం కావడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో పెరుగు, మజ్జిగ వంటి సంప్రదాయ ఆహారాలు మళ్లీ ప్రాధాన్యం పొందుతున్నాయి. వేసవి కాలంలో చాలా మంది వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇవి రెండూ శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా పేగు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే వేసవిలో పొట్టకు ఏది తేలికగా ఉంటుందనే విషయంలో చాలామందికి సందేహం ఉంటుంది. వేసవిలో అధిక వేడి కారణంగా శరీరంలోని మెటబాలిజం మందగిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియకు అవసరమైన గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్ పనితీరు తగ్గడంతో ఆహారం సరిగా జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. శరీరంలో నీటి కొరత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెంచే ఫెర్మెంటెడ్ ఆహారాలను వేసవిలో ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
పెరుగును పాలలో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా కలిపి తయారు చేస్తారు. ఈ ప్రక్రియ వల్ల ప్రోబయోటిక్స్ ఏర్పడి పేగు మైక్రోబయోమ్ను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. పరిశోధనల ప్రకారం పెరుగు వంటి ఫెర్మెంటెడ్ పాల పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో, లాక్టోస్ జీర్ణం కావడంలో ఉపయోగపడతాయి. పెరుగులో ప్రోటీన్, కాల్షియం కూడా అధికంగా ఉండటంతో ఇది శరీరానికి పోషకాహారాన్ని అందిస్తుంది. అయితే పెరుగు మందంగా ఉండటంతో కొందరికి వేసవిలో పొట్ట భారంగా అనిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆమ్లత్వం లేదా నెమ్మదైన జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారికి ఇది కొంత ఇబ్బంది కలిగిస్తుంది.
ఇక పెరుగును నీటితో పలుచగా చేసి మజ్జిగను తయారు చేస్తారు. ఇందులో జీలకర్ర, అల్లం, పుదీనా వంటి జీర్ణక్రియకు సహాయపడే పదార్థాలను కూడా కలుపుతారు. నీరు ఎక్కువగా ఉండటం వల్ల మజ్జిగ తేలికగా జీర్ణమవుతుంది. అలాగే పెరుగుతో పోలిస్తే కొవ్వు మోతాదు తక్కువగా ఉండటం కూడా దీనికి మరో ప్రయోజనం. ఆయుర్వేదంలో మజ్జిగను సహజ జీర్ణ టానిక్గా చెబుతారు. ఇది కడుపు ఉబ్బరం, అసౌకర్యం తగ్గించడంలో సహాయపడుతుంది. భోజనం తర్వాత మజ్జిగను తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడటంతోపాటు శరీరానికి తేమను అందించడంలో కూడా ఉపయోగపడుతుంది.
పెరుగు, మజ్జిగ రెండింటిలోనూ ప్రోబయోటిక్స్ ఉండటంతో పేగు ఆరోగ్యానికి మేలు జరుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే వేసవిలో శరీర వేడి అధికంగా ఉన్నప్పుడు తేలికపాటి ఫెర్మెంటెడ్ పానీయాలు పొట్టపై తక్కువ ఒత్తిడి కలిగిస్తాయి. అందుకే మధ్యాహ్న భోజనం తర్వాత మజ్జిగ తీసుకోవాలి. పోషకాహార నిపుణులు తెలిపిన ప్రకారం బలమైన జీర్ణక్రియ ఉన్నవారు పెరుగును మితంగా తీసుకోవచ్చు. ఇది శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అయితే రోజువారీ హైడ్రేషన్, పొట్టకు తేలికైన జీర్ణక్రియ కోసం మజ్జిగ మంచి ఎంపికగా చెప్పవచ్చు. ముఖ్యంగా కారంగా లేదా భారంగా ఉన్న భోజనం తర్వాత మజ్జిగ తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
అయితే పెరుగు లేదా మజ్జిగ చాలా పుల్లగా మారకుండా తాజాగా తీసుకోవడం ముఖ్యం. అధికంగా పులిసిన పెరుగు, మజ్జిగ వేసవిలో ఆమ్లత్వాన్ని పెంచే అవకాశం ఉంటుంది. ఇంట్లో తాజాగా తయారు చేసిన వాటిని తీసుకుంటే ఆరోగ్యానికి మరింత మేలు జరుగుతుంది. వేసవిలో పొట్టకు తేలికగా జీర్ణమయ్యే ఎంపికగా మజ్జిగను చెప్పవచ్చు. అయినప్పటికీ పెరుగు కూడా సరైన మోతాదులో, సరైన సమయంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఉపయోగకరమేనని నిపుణులు చెబుతున్నారు.