Meals | ఆధునిక జీవనశైలిలో సమయాభావం కారణంగా చాలామంది భోజనాన్ని తొందరగా ముగించే అలవాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు మధ్యాహ్న భోజనాన్ని కేవలం ఐదు నుంచి పది నిమిషాల్లోనే ముగించి తిరిగి పనిలో నిమగ్నమవుతున్నారు. అయితే ఈ అలవాటు చిన్నదిగా కనిపించినప్పటికీ, దీర్ఘకాలంలో జీర్ణవ్యవస్థ నుంచి జీవక్రియల ఆరోగ్యం వరకు అనేక సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ నోటిలోనే ప్రారంభమవుతుంది. ఆహారాన్ని బాగా నమలడం ద్వారా అది చిన్న ముక్కలుగా మారి లాలాజలంతో కలుస్తుంది. లాలాజలంలో ఉండే ఎంజైమ్లు ఆహారాన్ని ప్రాథమిక స్థాయిలో విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి. అయితే వేగంగా తినడం వల్ల ఆహారం సరైన విధంగా ముందస్తుగా చిన్న ముక్కలుగా మారకుండానే కడుపులోకి చేరుతుంది. దీంతో పొట్ట అదనపు శ్రమ చేయాల్సి వస్తుంది.
ఈ పరిస్థితి కారణంగా భోజనం చేసిన తర్వాత కడుపు భారంగా అనిపించడం, ఉబ్బరం, అసిడిటీ, యాసిడ్ రిఫ్లక్స్, ఛాతీలో మంట, పై పొట్ట భాగంలో అసౌకర్యం వంటి సమస్యలు కనిపిస్తాయి. కొందరిలో ఎక్కువసేపు కడుపు నిండిన భావన కూడా కొనసాగుతుంది. వేగంగా తినడం ఆకలి నియంత్రణ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. సాధారణంగా ఆహారం పేగుల్లోకి చేరిన తర్వాత కొన్ని హార్మోన్లు విడుదలై మెదడుకు కడుపు నిండిన సంకేతాలను పంపుతాయి. అయితే ఈ సంకేతాలు మెదడుకు చేరడానికి సుమారు 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. కానీ చాలామంది భోజనాన్ని ఐదు లేదా పది నిమిషాల్లో పూర్తిచేస్తారు. దీంతో కడుపు నిండిందనే సంకేతం అందకముందే అవసరానికి మించి తినే అవకాశం పెరుగుతుంది. అధికంగా తినడం వల్ల బరువు పెరగడం ప్రారంభమవుతుంది. క్రమంగా నడుము చుట్టుకొలత పెరగడం, ఇన్సులిన్ నిరోధకత ఏర్పడడం, ఆల్కహాల్తో సంబంధం లేని ఫ్యాటీ లివర్ వ్యాధి వంటి సమస్యల ప్రమాదం కూడా అధికమవుతుంది.
భోజనం వేగంగా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. దీన్ని నియంత్రించేందుకు శరీరం అధికంగా ఇన్సులిన్ విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియ తరచూ పునరావృతమైతే టైప్-2 మధుమేహం, ఫ్యాటీ లివర్ వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఇప్పటికే జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారిలో ఈ అలవాటు మరింత ఇబ్బందులను కలిగిస్తుంది. ముఖ్యంగా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్), ఫంక్షనల్ డిస్పెప్సియా వంటి సమస్యలు ఉన్నవారిలో లక్షణాలు తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్యకరమైన భోజన అలవాట్లను అలవరుచుకోవడం ద్వారా ఈ సమస్యలను నివారించవచ్చు.
ప్రతి భోజనానికి కనీసం 20 నిమిషాల సమయం కేటాయించడం మంచిది. ఆహారాన్ని బాగా నమిలి మింగడం, ప్రతి ముద్ద మధ్య కొద్దిసేపు విరామం ఇవ్వడం, భోజనం చేసే సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం లేదా కార్యాలయ పనులను దూరంగా ఉంచడం అవసరం. అలాగే భోజనాన్ని కూరగాయలు, సలాడ్లు లేదా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలతో ప్రారంభించడం మంచిది. ఇవి త్వరగా తృప్తి కలిగించి అతిగా తినడాన్ని తగ్గిస్తాయి. కడుపు నిండిపోయే వరకు కాకుండా, సంతృప్తిగా అనిపించిన వెంటనే భోజనం ఆపడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం మనం ఏం తింటున్నామన్నది ఎంత ముఖ్యమో, దాన్ని ఎలా తింటున్నామన్నది కూడా అంతే ముఖ్యం. అందువల్ల భోజనాన్ని నెమ్మదిగా, ప్రశాంతంగా ఆస్వాదిస్తూ తినడం ఆరోగ్యాన్ని కాపాడుకునే సరళమైన, ప్రభావవంతమైన మార్గంగా చెప్పవచ్చు.