Water | వరదలు, తుఫాన్లు మొదలైన ప్రకృతి విపత్తులకు సంబంధించి హెచ్చరికలు వెలువడగానే.. కాయగూరలు, బియ్యం సిద్ధం చేసుకుంటాం. ఫ్రిజ్లో నాలుగైదు పాల ప్యాకెట్లు నిల్వ చేసుకుంటాం. రోజూవాడే ఔషధాలు ముందే కొని తెచ్చుకుంటాం. కానీ, నీటి విషయంలో మాత్రం ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోం. ఈ నిర్లక్ష్యమే కొంప ముంచుతుంది. విష జ్వరాలకు కారణం అవుతుంది. కాబట్టి, తగినన్ని మంచినీళ్లు అందుబాటులో ఉంచుకోండి. అవసరమైతే సాధారణమైన నీటిని సురక్షిత జలాలుగా ఎలా మార్చుకోవాలన్నదీ తెలుసుకోండి. ఇది అత్యవసర జీవన నైపుణ్యం.
తుఫాన్లు, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎక్కడెక్కడి నుంచో కొట్టుకువచ్చిన వ్యర్థాలు నీటి వనరులను కలుషితం చేస్తాయి. ఆ నీటిని నేరుగా తాగడం వల్ల టైఫాయిడ్, కలరా, అతిసారం వంటి తీవ్ర అనారోగ్యాలు ఎదురవుతాయి. పట్టణాలతో పోలిస్తే ఈ సమస్య గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో మరీ ఎక్కువ. నీటి వనరుల పట్ల అవగాహన, నీటితో వచ్చే రుగ్మతల గురించి ఎంతోకొంత పరిజ్ఞానం, విపత్కర పరిస్థితుల్లో సురక్షితమైన నీటిని తయారు చేసుకునే విధానం పట్ల అవగాహన.. ప్రతి ఒక్కరికీ ఉండాలి. నీరు ప్రాణాధారమే. కానీ, తేడా వస్తే మాత్రం ప్రాణాలను హరిస్తుంది. బైక్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకుంటాం. కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీట్బెల్ట్ ధరిస్తాం. అత్యవసర పరిస్థితుల్లో కడుపునింపుకోడానికి ఏ ఎండు ఫలాలో సిద్ధం చేసుకుంటాం. మరి మంచినీళ్లు?
వరదల్ని ఊహించలేం.
తుఫాన్లను పసిగట్టలేం.
కుండపోత వర్షాలను కలగనలేం.
కనీసం వాతావరణ శాఖ హెచ్చరికల్ని అయినా పట్టించుకోం. ఆ సమాచారాన్ని కూడా తేలిగ్గా తీసుకుంటాం.
‘వచ్చినప్పుడు చూద్దాంలే’ అనే నిర్లిప్తత ఒకటి. రాలేదని, రాబోదని మనం ఊహించే జల విపత్తు రానే వస్తుంది. మనం, మన కుటుంబం జల ప్రళయంలో చిక్కుకుని.. సాయం కోసం ఎదురుచూడాల్సిన దుస్థితీ రావచ్చు. కరెంటు ఉండదు. సెల్ఫోన్ నెట్వర్క్ పని చేయదు. అప్పుడేం చేయాలి? ఆ విపత్కర పరిస్థితుల్లో తొలి ప్రాధాన్యంగా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు పంపిణీ చేసే మంచినీళ్ల బాటిల్ వాడటం సురక్షితం. ఇలాంటి సదుపాయం కనుక లేకపోతే, మనమే సురక్షితమైన నీటిని తయారుచేసుకోవాలి. ముందుగా అందుబాటులో ఉన్న నీటిని పరిశీలించాలి. మసకమసకగా, ధూళికణాలు ఉన్నట్లు కనిపిస్తే శుభ్రమైన వస్త్రంతో ఒక పాత్రలోకి వడపోసుకోవాలి. లేకుంటే, పాత్రలోకి నేరుగా తీసుకున్న నీటిలో ధూళికణాలు అడుగు భాగంలో పేరుకుపోయే వరకు వేచి ఉండాలి. ఆ తర్వాత పైభాగంలో ఉన్న శుభ్రమైన నీటిని మరో పాత్రలోకి మార్చుకోవాలి. ఈ నీటిని రెండుమూడు నిమిషాలపాటు మరిగించి చల్లార్చుకోవాలి. ఆ తర్వాత మరో శుభ్రమైన పాత్రలో నిల్వ ఉంచాలి. సురక్షితమైన నీటిని ఉంచే పాత్రలు కూడా పరిశుభ్రంగా ఉండాలి. రసాయనాలకు ఉపయోగించిన ప్లాస్టిక్ కంటైనర్లు అస్సలు వాడకూడదు.
నీటిని మరిగించటం వీలుకాని పక్షంలో.. సురక్షితమైన నీటి తయారీకి క్లోరిన్ టాబ్లెట్స్ లేదా బ్లీచింగ్ పౌడర్ వాడతారు. రెండూ దాదాపు ఒకే విధంగా పనిచేస్తాయి. క్లోరిన్ టాబ్లెట్స్ను నేరుగా నీటి వనరుకు కలపవచ్చు. ఎంత నీటికి ఎన్ని టాబ్లెట్స్ కలపాలనే వివరాలు ప్యాకెట్ మీద స్పష్టంగా ఉంటాయి. గ్రామాల్లో పారిశుద్ధ్య అవసరాల కోసం బ్లీచింగ్ పౌడర్ ఎక్కువగా వాడతారు. ఇది అతి తక్కువ ధరకు లభించే క్రిమిసంహారిణి. సాధారణంగా, బ్లీచింగ్ పౌడర్ను సరైన కొలత లేకుండానే నేరుగా నీటి వనరులకుకలిపేస్తారు. దీనివల్ల మృదుజలం కాస్తా కఠినజలంగా మారిపోతుంది. క్లోరిన్ వాయువుతో క్యాల్షియం హైడ్రాక్సైడ్ను చర్య జరిపించి బ్లీచింగ్ పౌడర్ తయారుచేస్తారు. క్యాల్షియం హైడ్రాక్సైడ్ను వాడుక భాషలో.. తడిసున్నంగా వ్యవహరిస్తారు. బ్లీచింగ్ పౌడర్ను నీటి వనరులకు కలిపినప్పుడు మళ్లీ తడిసున్నం ఏర్పడుతుంది. అది నీటి అడుగు భాగానికి చేరుకుంటుంది. బ్లీచింగ్ పౌడర్లో మిగిలిపోయిన క్లోరిన్ నీటిలో కలిసి హైపర్ క్లోరోస్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఈ హైపర్ క్లోరోస్ ఆమ్లం శక్తివంతమైన క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది. నీటి అడుగుభాగంలోని తడిసున్నంలో ఉండే క్యాల్షియం మృదుజలాన్ని కూడా కఠినజలంగా మారుస్తుంది. ఈ విధంగా జరగకూడదంటే తగిన పాళ్లలోనే బ్లీచింగ్ పౌడర్ను కలపాలి. తాజా బ్లీచింగ్ పౌడర్లో 33 శాతం లేదా అంతకంటే ఎక్కువ క్లోరిన్ ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉన్న పౌడర్లో క్లోరిన్ గాఢత తగ్గి పోతుంది. నిజానికి, నీటికి కలపాల్సిన బ్లీచింగ్ పౌడర్ కొలత నీటి పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. ముప్పైశాతం లేదా అంతకన్నా ఎక్కువ క్లోరిన్ గాఢత కలిగిన ఐదు గ్రాముల బ్లీచింగ్ పౌడర్ను వెయ్యి లీటర్ల నీటిలో కలపాల్సి ఉంటుంది. ఈ కొలత ప్రకారమే.. నీరు పెరిగే కొద్దీ బ్లీచింగ్ పరిమాణం పెంచుకుంటూ పోవాలి.
మొదటగా, పైన వివరించిన కొలతల ప్రకారం, ఐదు గ్రాముల బ్లీచింగ్ పౌడర్ను ఒక ప్లాస్టిక్ బకెట్లో తీసుకొని, దానికి కొద్దిగా నీళ్లు కలిపి చిక్కని పేస్టులా తయారు చేసుకోవాలి. బకెట్ను 50 శాతం నుంచి 75 శాతం వరకు నీటితో నింపాలి. బ్లీచింగ్ పౌడర్ పేస్టును కర్రతో నీటిలో బాగా కలియపెట్టాలి. ఈ ద్రావణాన్ని కాసేపు అలా ఉంచాలి. తర్వాత బకెట్ అడుగు భాగంలో సున్నపు తేటను తలపించే ఒక తెల్లని అవక్షేపం ఏర్పడుతుంది. పైభాగంలో ద్రావణం ఉండి పోతుంది. ఈ ద్రావణాన్ని రెండో బకెట్లోకి జాగ్రత్తగా బదిలీ చేయాలి. ఇలా చేసేటప్పుడు మొదటి బకెట్లోని అవక్షేపం ఏ కొద్దిగా కూడా రెండో బకెట్లో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, ఈ పదార్థమే మృదు జలాన్ని కఠినజలంగా మార్చేస్తుంది. రెండో బకెట్లోకి బదిలీ చేసిన ద్రావణాన్ని మనకు కావాల్సిన నీటి వనరుకు కలుపుకోవాలి. నీటి వనరుకు కలిపిన క్రిమిసంహారిణి పనిచేయడానికి సుమారు అరగంట పడుతుంది. ఆ తర్వాత మాత్రమే తాగాలి. ఇలా క్లోరినేషన్ చేసిన తర్వాత.. నీటిలో కొద్దిమొత్తంలో అవశేష క్లోరిన్ ఉండాలి. ఎందుకంటే, అవశేష క్లోరిన్ వల్ల నీటిలో క్రిములు తిరిగి పెరగవు. నీటిని చాలా రోజుల వరకు సురక్షితంగా నిల్వ చేసుకోవచ్చు.
కలుషిత నీటిని శుద్ధి చేసే ప్రక్రియలో.. యూవీ పద్ధతి కూడా ఒకటి. నీటి గుండా అతినీలలోహిత కిరణాలను ప్రసరింప చేస్తే, నీటిలోని క్రిములు నశించిపోతాయి. సురక్షితమైన నీరు తయారవుతుంది. కాకపోతే, ఈ వ్యవస్థ మనకు అందుబాటులో ఉండాలి. సాధారణ వాటర్ ఫిల్టర్స్ బ్యాక్టీరియా, వైరస్ వంటి క్రిములను సమర్థంగా నిర్మూలించలేవు. ఇక రివర్స్ ఆస్మాసిస్ (ఆర్ఓ) ప్రక్రియ బ్యాక్టీరియా, వైరస్ వంటి క్రిములను తొలగించి సురక్షితమైన నీటిని అందిస్తుంది. కానీ, ఈ నీటిలో మినరల్స్ ఉండవు. పైగా రివర్స్ ఆస్మాసిస్ యూనిట్ పనిచేయాలంటే విద్యుత్ అవసరం. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు విద్యుత్ అంతరాయాలూ ఉంటాయి. కాబట్టి, రివర్స్ ఆస్మాసిస్ నీళ్లు లభించడం అసాధ్యం. అన్ని సురక్షిత నీటి తయారీ పద్ధతులలోనూ నీటిని మరిగించి తాగడమే చాలా సులభమైంది. ఉత్తమమైంది కూడా. ఎక్కువ మొత్తంలో సురక్షిత నీటిని తయారుచేసి పంపిణీ చేయాల్సి వస్తే కనుక బ్లీచింగ్ పౌడర్ లేదా క్లోరిన్ టాబ్లెట్స్ వినియోగించటం మంచిది. నీరు సురక్షితంగా ఉంటేనే, మీరూ సురక్షితంగా ఉంటారు. నీరే మీరని గుర్తుంచుకోండి.
నీటిలో అవశేష క్లోరిన్ పరిమాణాన్ని క్లోరోస్కోప్ కిట్స్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఈ కిట్స్ ధర ఆన్లైన్లో రూ. 400 నుంచి రూ. 600 వరకు ఉంటుంది. నీటికి క్రిమిసంహారిణి కలిపిన ఒక గంట తర్వాత కొన్ని చుక్కల నీటిని ఈ కిట్కు కలిపితే.. నీటి రంగు మారుతుంది. మారిన నీటి రంగును కిట్పై ఉన్న చార్ట్ రంగులతో పోల్చాలి. దీంతో నీటిలోని అవశేష క్లోరిన్ పరిమాణం తేలిపోతుంది. సాధారణంగా అవశేష క్లోరిన్ పరిమాణం 1 పీపీయం ఉండాలి. నీటి వనరులు వరద నీటితో బాగా కలుషితమైనప్పుడు మాత్రం అవశేష క్లోరిన్ 1 పీపీఎం కంటే ఎక్కువ ఉండేలా చూసుకోవాలి.
కొబ్బరినీళ్లు
ఒక కొబ్బరి బొండాంలోని నీళ్లలో 247 మి.గ్రా. పొటాషియం, 48 మి.గ్రా. సోడియం, 40 మి.గ్రా క్యాల్షియం, 15 మి.గ్రా. మెగ్నీషియం, 63 మి.గ్రా. భాస్వరం, 79 మి.గ్రా. ఐరన్, 26 మి.గ్రా. కాపర్, 12 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. అయితే కొబ్బరినీళ్లు మితంగానే తీసుకోవాలి. ఎక్కువ మొత్తంలో తాగితే శరీరంలో ఉష్ణం పెరుగుతుందని అంటారు. అందుకే జ్వరంగా ఉన్నప్పుడు కొబ్బరినీళ్లు తాగకూడదని చెబుతారు.
వెన్నెల తీర్థం
వెన్నెలలో ఉంచిన నీటికి ఔషధ గుణాలు తోడవుతాయని ఓ నమ్మకం. పౌర్ణమినాడు ఈ గుణం ద్విగుణీకృతం అవుతుందని విశ్వాసం. ఇక్కడో నియమం ఉంది. వెన్నెలలో ఉంచిన నీళ్లను సూర్యోదయానికి ముందే తాగేయాలి. ఈ నీటిని తాగడం వల్ల రక్త శుద్ధి జరుగుతుందని, మానసిక ఒత్తిడి దూరం అవుతుందని, చర్మరోగాలు నయం అవుతాయని, ముఖ వర్చస్సు పెరుగుతుందని ప్రాచీన గ్రంథాలు చెబుతాయి.
తగినన్ని తాగకపోతే..
మనం తాగిన నీళ్లు చెమట రూపంలో బయటికి వెళ్లిపోతాయి. మూత్రపిండాల ద్వారా రక్తం శుభ్రం అయిన తర్వాత.. మిగిలిన నీళ్లు మూత్రం ద్వారా విసర్జితమవుతాయి. చీమిడి, కన్నీళ్లు, తెమడ, మల విసర్జనలో కొద్దిమొత్తంలో బయటికి వెళ్లి పోతాయి. ఎండకాలంలో తగినన్ని నీళ్లు తాగకపోతే చెమటకాయలు, పాదాలు పగలడం తదితర సమస్యలు ఎదురవుతాయి. కొంతమందికి చర్మం పొడిబారుతుంది.
కిడ్నీల్లో రాళ్లు
మూత్రపిండాల్లో రాళ్లకు కారణం క్యాల్షియం పెరగడమే. ఈ క్యాల్షియం సూక్ష్మ నీటి బిందువులుగా ఉంటుంది. ఇవి మూత్రపిండాల ద్వారా మూత్రంతోపాటే ప్రయాణించి మూత్రాశయం చేరుకుంటాయి. తగిన మోతాదులో నీళ్లు తీసుకోకపోతే క్యాల్షియం బిందువులు ఫిల్టర్ల దగ్గర ఆగిపోతాయి. వీటికి ఫ్లోరైడ్ తోడై చిన్నచిన్న రాళ్లుగా మారతాయి. తగినన్ని నీళ్లుతాగితే కిడ్నీలో రాళ్ల సమస్యను నివారించుకోవచ్చు.
కంటికి రెప్ప.. క్లోరైడ్
ఇది తెల్లగా ఉంటుంది. ఒక లీటరు నీటిలో సుమారు 250 మిల్లీ గ్రాముల క్లోరిన్ ఉంటుంది. మనకు రోజుకు రెండు గ్రాముల క్లోరిన్ అవసరం. నీటిలోని క్లోరిన్ చెడు బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది. ఆహారం త్వరగా జీర్ణం కావడానికి తోడ్పడుతుంది.
ఫ్లోరైడ్కు రుచి ఉండదు. ఫ్లోరిన్.. దంతాలు, ఎముకల నిర్మాణానికి ఉపకరిస్తుంది. లీటర్ నీటిలో 1 మిల్లీ గ్రాము ఫ్లోరిన్ ఉండొచ్చు. అంతకుమించితే అనారోగ్యకరం. ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న నీటిని ట్యాంకుల్లో నింపితే కొంతసేపటికి అడుగున తెల్లని సన్నని మడ్డి పేరుకుంటుంది. ఇదే ఫ్లోరైడ్. ఫ్లోరిన్ నీళ్లు అధికంగా తాగితే రక్తనాళాలు మూసుకుపోతాయి. గుండెరోగాలు, ఎముకల వ్యాధులు వస్తాయి. కాళ్లు, చేతుల వేళ్లు వంకరగా మారతాయి. దీనినే ఫ్లోరోసిస్ అంటారు. ఉమ్మడి నల్లగొండలో ఈ సమస్య తీవ్రంగా ఉండేది. కేసీఆర్ సర్కారు ఆ ఇబ్బందిని తొలగించింది.
మానవ నాగరికత నదీ తీరాల్లో వికసించింది. ఇతర ప్రాంతాలకు విస్తరించింది. మానవ శరీరంలో కూడా 70 శాతం మేర నీళ్లే ఉంటాయి. జల వనరులు ఉంటేనే పంటలు పండుతాయి. అప్పుడే మనకు తిండీతిప్పలు. ఆధునిక యుగం మొదలయ్యాక తాగునీటి వనరులు, సముద్రాలు కలుషితం అయిపోతున్నాయి. దీంతో నీటి ప్రాధాన్యాన్ని గుర్తు చేసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ‘జల దినోత్సవాలు’ జరుపుకొంటున్నాం. ఏటా మార్చి 22ను ప్రపంచ జల దినోత్సవంగా, సెప్టెంబర్ చివరి ఆదివారాన్ని ప్రపంచ నదుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ రూపంలో మానవుడి ప్రగతి ప్రస్థానంలో నీటి ప్రాధాన్యాన్ని వివరిస్తున్నారు.
– డాక్టర్ శ్రీధరాల శ్రీరాములు
ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్,
శ్రీ ఇందు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, హైదరాబాద్, ఫోన్ : 94411 84667
“Hair fall | వానాకాలంలో జుట్టు రాలిపోవద్దంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?”