Heart Surgery | మా అక్కకు పాప పుట్టింది. బిడ్డ నీలం రంగులో ఉందనిపించి డాక్టర్లు పరీక్షలు చేయించారు. గుండె స్కాన్.. టూడీ ఎకోలో ప్రధాన రక్తనాళాలు అటూ ఇటూ ఉన్నాయని నిర్ధారించారు. వెంటనే గుండె ఆపరేషన్ చేయాలంటున్నారు. పసిబిడ్డకు శస్త్రచికిత్స అవసరమా? ఈ సమస్య జీవితాంతం ఉంటుందా?
– ఓ పాఠకురాలు
మీరిచ్చిన వివరాల ప్రకారం.. పసిబిడ్డకు ట్రాన్స్పొజిషన్ ఆఫ్ గ్రేట్ ఆర్టరీస్ అనే సమస్య ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రధానంగా గుండెలో నాలుగు గదులు ఉంటాయి. గుండె కుడి వైపునకు చెడు రక్తం వచ్చి.. అటు నుంచి పెద్ద రక్తనాళం ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్లి.. అక్కడ శుద్ధి జరిగి.. ఎడమ వైపు గుండెకు చేరి మహాధమని ద్వారా అన్ని భాగాలకూ అందుతుంది. ప్రధాన రక్త నాళాలు అటూ ఇటుగా ఉంటే.. ఈ రక్త ప్రసరణ ప్రక్రియ కూడా అపసవ్య దిశలో సాగుతుంది.
తల్లి పొట్టలో ఉన్నంత కాలం ఇది బిడ్డను ప్రభావితం చేయదు. తల్లి నుంచే నేరుగా బిడ్డకు రక్తం, ఆక్సిజన్ అందుతాయి కాబట్టి సమస్యే లేదు. కానీ, బిడ్డ పుట్టాక ఆపరేషన్ తప్పదు. ‘ఆర్టీరియర్ స్విచ్ ఆపరేషన్’గా దీన్ని వ్యవహరిస్తారు. హైదరాబాద్లాంటి చోట్ల నిష్ణాతులు ఉన్నారు. దీనివల్ల భవిష్యత్తులోనూ బిడ్డకు ఇబ్బంది ఉండదు. సర్జరీ ఆలస్యం అయ్యేకొద్దీ దుష్ప్రభావం అధికం అవుతుంది. పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, పీడియాట్రిక్ హార్ట్ సర్జన్ల నేతృత్వంలోనే ఇదంతా జరగాలి.