న్యూఢిల్లీ : హృద్రోగాలు, పక్షవాతం వంటి తీవ్ర అనారోగ్యాలకు దారి తీసే అధిక రక్తపోటు పట్ల అప్రమత్తంగా ఉండాలి. సైలెంట్ కిల్లర్గా పేరొందిన హై బీపీపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. తీవ్ర లక్షణాలు బయటపడే వరకూ తమకు హై బీపీ ఉందనే విషయం చాలా మందికి తెలియకపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది.
హై బీపీతో బాధపడేవారిలో ధమనులు రక్త నాళాల గోడలను దెబ్బతీసేలా తీవ్రమైన ఒత్తిడిని అనుభవిస్తాయి ఫలితంగా అది బ్లాకేజ్కు దారితీస్తుంది. ఈ బ్లాక్లు గుండెకు ఆక్సిజన్, రక్త సరఫరాలను అడ్డుకోవడంతో గుండె పోటు ముప్పు పెరుగుతుంది. బీపీని అదుపులో ఉంచుకోవడం ద్వారానే ఈ ముప్పుల నుంచి బయటపడే అవకాశం ఉందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ స్పష్టం చేసింది.
సాధారణ బీపీ లెవెల్స్ 120\80 మించకుండా చూసుకోవాలి. రక్తపోటు పెరిగితే కొన్ని లక్షణాల ద్వారా దాన్ని గుర్తించవచ్చు. తీవ్రమైన తలనొప్పి, కండ్లు మసకబారడం, శ్వాస సమస్యలు, తీవ్ర అలసట వంటివి తరచూ బాధిస్తుంటే వైద్యుడిని సంప్రదించాలి. ఇక బీపీతో బాధపడేవారు ఉప్పు తగ్గించడం, మద్యానికి దూరంగా ఉండటం, ఒత్తిడి తగ్గించుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం వంటివి పాటించాలని నిపుణులు చెబుతున్నారు.