మన శరీరంలోని విష పదార్థాలను వడపోసి, మూత్రం ద్వారా బయటికి పంపడంతోపాటు హార్మోన్లు, ఎంజైములను విడుదల చేయడంలో మూత్రపిండాలు కీలకపాత్ర పోషిస్తాయి. చిక్కుడుగింజ ఆకారంలో ఉండే మూత్రపిండాలలో ఎడమ వైపున ఉండే మూత్రపిండం పెద్దగాను, కుడివైపున ఉండే మూత్రపిండం కొంత చిన్న పరిమాణంలో ఉంటుంది. మూత్రపిండాలు సుమారు 150 గ్రాముల బరువు, 11-14సెం.మీల పొడవు, 6సెం.మీల వెడల్పు, 4సెం.మీల మందంతో ఉంటాయి. రక్తంలోని వ్యర్థాలను తొలగించడంతోపాటు ఇవి రక్తపోటును కూడా నియంత్రిస్తాయి. అందుకే బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీ పరీక్షలు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. రక్తపోటు, మధుమేహం అతిగా ఉన్నప్పుడు కిడ్నీలు ఫెయిల్ అయ్యే ప్రమాదం అధికం. అందుకని ఈ సమస్యలు ఉన్నవారు ఎప్పటికప్పుడు కిడ్నీ ఫంక్షనింగ్ టెస్టులు చేయించుకోవడం తప్పనిసరి.
1. కిడ్నీ ఇన్ఫెక్షన్ 2. కిడ్నీలో రాళ్లు 3. కిడ్నీ ట్యూమర్లు, క్యాన్సర్లు 4. కిడ్నీ ఫెయిల్యూర్.
కిడ్నీలలో ట్యూమర్లు :
సాధారణంగా కిడ్నీలలో మూడు కారణాల వల్ల ట్యూమర్లు (కణుతులు) ఏర్పడతాయి. అందులో ఒకటి పుట్టుకతో, రెండోది ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు, మూడోది జీన్ మ్యుటేషన్ వల్ల ఏర్పడే అవకాశాలున్నాయి. ప్రధానంగా కిడ్నీ ట్యూమర్లు రెండు రకాలు.
1. నెఫ్రోబ్లాస్టోమా 2. రీనల్సెల్ కార్సినోమా(ఆర్సీసీ)
నెఫ్రోబ్లాస్టోమా : మూత్రపిండాలలో పుట్టుకతో వచ్చే కణుతులను నెఫ్రోబ్లాస్టోమా ట్యూమర్లు అంటారు. ఇవి పిల్లలకు స్నానం చేయించేటప్పుడు లేదా వైద్యపరీక్షల సమయంలో బయటపడే అవకాశం ఉంటుంది. ఇవి 4 నుంచి 5 ఏండ్ల వయసులో బయటపడతాయి. అబ్బాయిలలో కంటే అమ్మాయిలలోనే ఈ ట్యూమర్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి.
రీనల్సెల్ కార్సినోమా : ఈ ట్యూమర్లు పెద్దవయసు వారిలో కనిపిస్తుంటాయి. కిడ్నీల నుంచి ఊపిరితిత్తులు, ఇతరభాగాలకు వ్యాపిస్తాయి. కొన్నిసార్లు ఈ కణుతులు రెండు మూత్రపిండాల్లోనూ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ వీటి పరిమాణం కూడా పెరుగుతుంది. ఎక్కువగా ధూమపానం చేసేవారిలో ఈ కణుతులు కనిపిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ఈ కేసులు నమోదవుతున్నాయి. ధూమపానం, మద్యపానం, అధిక బరువు, జీన్ మ్యుటేషన్ తదితరాలు ఈ రకం కణుతులు ఏర్పడటానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
లాప్రోస్కోపిక్ పద్ధతిలో కిడ్నీలో ఏర్పడిన కణితిని తొలగించవచ్చు. క్యాన్సర్ రకం, వ్యాధి దశ ఆధారంగా కిడ్నీ మొత్తాన్ని తొలగించడం, అవసరమైతే కీమో, రేడియో థెరపీలను ఇవ్వాల్సి రావచ్చు. కిడ్నీలో ఎక్కువగా కణుతులు ఉన్నా లేక పెద్ద పరిమాణంలో ఉన్నా ఆ కిడ్నీని తొలగించాల్సి ఉంటుంది. సాధారణంగా మూడు పద్ధతుల్లో శస్త్రచికిత్సలు చేస్తారు. అందులో 1. రాడికల్ నెఫ్రోక్టమి 2. సింపుల్ నెఫ్రోక్టమి 3. పార్షియల్ నెఫ్రోక్టమి
1. రాడికల్ నెఫ్రోక్టమి : మూత్రపిండాల్లో ఏర్పడిన కణితి పరిమాణం పెద్దగా ఉన్నప్పుడు ఈ పద్ధతిలో శస్త్రచికిత్స చేస్తారు. రాడికల్ నెఫ్రోక్టమి పద్ధతిలో మూత్రపిండాలతోపాటు అడ్రినల్ గ్లాండ్స్, లింఫ్ నాళాలను, టిష్యూలను పూర్తిగా తొలగిస్తారు.
2. సింపుల్ నెఫ్రోక్టమి : ఈ పద్ధతిలో కణితి ఏర్పడిన మూత్రపిండాన్ని మాత్రమే తొలగిస్తారు. మూత్రపిండంలో ఏర్పడిన కణితి పరిమాణం ఆధారంగా శస్త్రచికిత్స చేస్తారు. తొలిదశలో వ్యాధిని గుర్తించి, కేవలం ఒకే మూత్రపిండాన్ని తొలగిస్తే రోగి సాధారణ జీవితాన్ని గడిపే అవకాశాలు ఎక్కువ. రెండు మూత్రపిండాలు తొలగించినప్పుడు లేదా ఒకటి తొలగించి, రెండోది సరిగ్గా పనిచేయనప్పుడు బాధితులకు డయాలసిస్ చేస్తూ, వీలైనంత త్వరగా కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉంటుంది.
3. పార్షియల్ నెఫ్రోక్టమి : ఈ పద్ధతిలో మూత్రపిండాలను తొలగించకుండా చికిత్స చేస్తారు. పుట్టుకతో ఒకే ఒక్క మూత్రపిండం ఉండి, అందులో కణితి ఏర్పడినప్పుడు, కణితి ఉన్న ప్రాంతాన్ని మాత్రమే తొలగిస్తారు. రెండు మూత్రపిండాల్లో కణుతులు ఏర్పడిన సందర్భాల్లోనూ ట్యూమర్ ఉన్న ప్రదేశాన్ని మాత్రమే తొలగిస్తారు.
– డాక్టర్ మోహనవంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ 98490 22121