మనసును అల్లకల్లోల పరుస్తుంది. శరీరాన్ని రుగ్మతలపాలు చేస్తుంది. స్థిమితంగా నిద్రపోనివ్వదు. కుదురుగా ఉద్యోగమో వ్యాపారమో చేసుకోనివ్వదు. ఆధునిక జీవితానికి ఒత్తిడి తొలి శత్రువు. డిప్రెషన్ నుంచి గుండెపోటు వరకు.. సకల రుగ్మతలకూ అదే స్వాగతద్వారం. ఆ తలుపులు మూసేద్దాం. పాజిటివ్ తలపులను స్వాగతిద్దాం.
ప్రధాన కారణాలు
కూతురికి మెడిసిన్లో సీటు వస్తుందో రాదో అని శిరీష భయం. కొత్త కాంట్రాక్టు దక్కుతుందో దక్కదో అని రాహుల్ టెన్షన్. ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అని శ్రీనివాస్ వణుకు. ఇలా చెబుతూపోతే… సమాజంలోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణంతో ఒత్తిడికి గురవుతూనే ఉంటారు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు పలురకాల ఒత్తిళ్లతో సతమతం అవుతుంటారు. ఆ తీవ్రతతో డిప్రెషన్లోకి వెళ్తున్నవారు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారు అనేకం. ఒత్తిడి వల్ల గుండె, ఊపిరితిత్తులు, మెదడు తదితర ప్రధాన అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. 70 శాతం రోగాలు ఒత్తిడి కారణంగానే వస్తున్నట్టు వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఒత్తిడితో నలిగిపోతున్నారు. మనిషిని సంక్షోభంలో నెట్టేస్తున్న ఒత్తిడి మహమ్మారిని ఎలా నివారించాలి? అసలు ఒత్తిడికి కారణాలేమిటి?.. తదితర అంశాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన సమయం ఇది.
ఒత్తిడి అంటే?
ఒత్తిడి అనేది అతి సహజమైన మానసిక, శారీరక ప్రతిచర్య. నిత్య జీవితంలో చిన్నచిన్న ఒత్తిళ్లు సహజం. కానీ, తీవ్ర స్థాయికి చేరుకుని దీర్ఘకాలం పాటు వేధిస్తే.. ఆ ప్రభావం
ఆరోగ్యంపై పడుతుంది. ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలోని హార్మోన్లలో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ పరిణామాల వల్ల గుండెపోటు, మెదడులో నరాలు చిట్లిపోవడం, డిప్రెషన్.. తదితర ప్రభావాలు కనిపిస్తాయి. రక్తపోటు హెచ్చుతగ్గుల వల్ల మూత్ర పిండాలు దెబ్బతింటాయి. కొన్నిరకాల హార్మోన్లు అధికంగా స్రవించడం వల్ల కాలేయంలో జీవక్రియ అసాధారణంగా పెరుగుతుంది. దీంతో మధుమేహం ఇబ్బంది పెడుతుంది. ఊపిరితిత్తులపైనా ప్రభావం పడుతుంది.
ఇవీ లక్షణాలు
ఒత్తిడికి గురైనప్పుడు మూడు రకాల సంకేతాలు కనిపిస్తాయి.
1. భావోద్వేగపరమైన మార్పులు.
2. ప్రవర్తనలో మార్పులు.
3.శారీరక మార్పులు.
పిల్లల్లోనూ..
గతంలో పిల్లలు 50 శాతం సమయాన్ని పాఠ శాలలో గడిపితే, మరో 50 శాతం సమయాన్ని మైదానంలో గడిపేవారు. దీనివల్ల తగినంత వ్యాయామం లభించేది. ప్రస్తుతం, చాలా పాఠశాలలకు ఆట మైదానాలు లేవు. బడికి వెళ్తే చివరి గంట కొట్టేవరకూ నాలుగు గోడల మధ్య గడపాల్సిందే. ఆ ఇరుకిరుకు జీవితం బాల్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. నేటి తల్లి దండ్రులు పిల్లలకు ఏది ఇష్టమో, వాళ్లేం కోరుకుంటున్నారో తెలుసుకోకుండా తమ ఇష్టాలను బలవంతంగా రుద్దుతున్నారు. దీంతో బాల్యం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నది. తల్లిదండ్రుల అంచనాలను అందుకోలేక, తమ లక్ష్యాల విషయంలో రాజీపడలేక.. నరకం అనుభవిస్తున్నారు. ప్రతిక్షణం ఒత్తిడిపాలవుతూ డిప్రెషన్లోకి వెళ్లిపోతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల అభిరుచులను తెలుసుకుని వారికి స్వేచ్ఛనిస్తే ఎంత కష్టపడైనా సరే, లక్ష్యాలను చేరుకుంటారు. దీనికి ఉదాహరణ.. ప్రేమ వివాహం వర్సెస్ పెద్దలు కుదిర్చిన పెండ్లి. ప్రేమించి పెండ్లి చేసుకున్న జంటల నుంచి పెద్దగా ఫిర్యాదులు రావు. అలా అని, సమస్యలే ఉండవని కాదు. ఏవైనా గొడవలు ఉన్నా తామే సర్దుకుంటారు. అదే పెద్దలు కుదిర్చిన పెండ్లి విషయంలో.. చిన్నచిన్న అభి ప్రాయభేదాలు కూడా తీవ్రరూపం ధరిస్తాయి. చీటికిమాటికి పంచాయతీ పెడుతుంటారు.
బయట పడటం ఎలా?
ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని గురించే అతిగా ఆలోచించకుండా.. సమస్య మూలాల్లోకి వెళ్లాలి. లోతుగా విశ్లేషించాలి. సమర్థంగా పరిష్కరించుకోవాలి. కొంతమంది విద్యార్థులు మొదటి నుంచీ చదవకుండా పరీక్షలకు ఒకటిరెండు నెలల ముందు పుస్తకాల దుమ్ముదులుపుతారు. దీంతో సహజంగానే ఫెయిల్ అవుతారు. అలాంటప్పుడు వైఫల్యానికి కారణాలేమిటి అనేదానిపై ఫోకస్ చేయాలి. దీర్ఘకాలిక ప్రణాళిక లేకపోవడమే ఇక్కడ సమస్య. ఆ లోపాన్ని గుర్తించగలిగితే, భవిష్యత్తులో అలా జరగకుండా జాగ్రత్తపడవచ్చు. ఒత్తిడిని అధిగమించవచ్చు.
ఆత్మీయులు మరణించినప్పుడు దుఃఖం
సహజం. అలా అని నిత్యం బాధపడుతూ కూర్చుంటే.. ఒత్తిడి పెరిగిపోయి అనర్థాలకు దారితీస్తుంది. ఆ సమయంలో మరణం అనివార్యమనీ, ఎవరికైనా మృత్యువు తప్పదనే వాస్తవాన్ని గ్రహించాలి. ఆ బాధనుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడాలి.
ఒత్తిడి నుంచి బయటపడే మార్గాలు
ఏదైనా చర్చలో పాల్గొన్నప్పుడు హేతు
బద్ధంగా వాదించాలి. అహంభావాలకు, పంతాలకు వెళ్లకూడదు. దీని వల్ల కూడా ఒత్తిడి తగ్గుతుంది. వాదోపవాదాలు తీవ్రరూపం దాల్చితే.. హార్మోన్లలో మార్పులు కలిగి, బీపీ వంటి సమస్యలు పెరిగిపోతాయి.
పదేపదే ఆలోచించడం వల్ల నిద్ర దూరం అవుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా హార్మోన్లలో అసమతౌల్యం ఏర్పడుతుంది. మనిషి డిప్రెషన్లోకి వెళ్లిపోవచ్చు కూడా.
కారణాన్ని గుర్తించడమే చికిత్స
ఒత్తిడికి ప్రత్యేకమైన ఔషధాలు అంటూ ఏమీ లేవు. నేరుగా సమస్య మూలాల్లోకి వెళ్లిపోవాలి. ఏ కారణం వల్ల ఒత్తిడికి గురవుతున్నామన్నది గుర్తించి, ఆ లోపాన్ని సరిచేసుకోవాలి. ఒత్తిడి ప్రభావంతో వివిధ అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. సమస్య మరింత ముదిరిపోకుండా, తక్షణం మందులు వాడాల్సి ఉంటుంది. ఒత్తిడి వల్ల డిప్రెషన్లోకి వెళ్లినవారికి యాంటీ ఎలివేటర్స్ సిఫారసు చేస్తారు వైద్యులు. బీపీ అసాధారణంగా పెరిగితే, దానిని తగ్గించేందుకూ మందులు ఇస్తారు. కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిన్నవారికి డయాలసిస్ అవసరం కావచ్చు. ఒత్తిడిలో ఉన్నప్పుడు కనిపించే శారీరక, భావోద్వేగ, ప్రవర్తనా పరమైన మార్పులు ఇవి..
బావోద్వేగ మార్పులు
ప్రవర్తనలో మార్పులు
శారీరక మార్పులు
ఒత్తిడిని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. దాన్నో సమస్యగానే భావించరు. రుగ్మతను సకాలంలో గుర్తించకపోవడం అనేది అతిపెద్ద సమస్య. మన స్నేహితులో, బంధువులో, తోటి ఉద్యోగులో ఒత్తిడికి గురైనట్టు అనిపిస్తే.. సకాలంలో మూల కారణాన్ని కనిపెట్టాలి. వైద్యుల సాయం తీసుకోవాలి. దీనివల్ల సమర్థమైన చికిత్స లభిస్తుంది. అప్పుడే ఆ వ్యక్తిని సురక్షితంగా కాపాడుకోగలం.
– మహేశ్వర్రావు బండారి
డాక్టర్ బొల్లినేని ,భాస్కర్రావు సీఎండీ,
కిమ్స్ హాస్పిటల్స్, హైదరాబాద్