న్యూఢిల్లీ : తరచూ కొబ్బరి నీళ్లు తీసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని పరిశోధకులు చెబుతున్నారు. తాజా కొబ్బరినీళ్లు రీహైడ్రేషన్ ఔషధంగా, ఆరోగ్యకరమైన వెల్కం డ్రింక్గా స్పష్టం చేస్తున్నారు. దాహంగా ఉన్నప్పుడు తాజా కొబ్బరి నీళ్లు తీసుకోవాలని, వాటిలో సహజమైన విటమిన్లు, మినరల్స్ దాగున్నాయని ప్రపంచ ప్రఖ్యాత ఆస్పత్రి క్లీవ్ల్యాండ్ క్లినిక్ ప్రజలను కోరుతోంది.
కొబ్బరినీళ్లలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్స్ ఉంటాయని వైద్యులు, పోషకాహార నిపుణులు చెబుతుంటారు. అస్వస్ధతతో బాధపడి కోలుకుంటున్న వారికి తరచూ కొబ్బరి నీళ్లు ఇస్తుంటారని ఇది చాలా మంచిదని పేర్కొన్నారు. వ్యాయామం తర్వాత కొబ్బరి నీళ్లను తాగితే అలసట మాయమై సత్వరమే జవసత్వాలను కూడదీసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. చర్మ సౌందర్యానికీ, ఆరోగ్యానికీ కొబ్బరి నీళ్లు మేలు చేస్తాయి.
ఆక్సిడేటివ్ ఒత్తిడిని అధిగమించడంలో, కాలేయ ఆరోగ్యానికి కొబ్బరి నీళ్లు ఔషధంలా పనిచేస్తాయి. మధుమేహ నియంత్రణకూ కొబ్బరి నీళ్లు మేలని చెబుతున్నారు. బీపీ తగ్గించడంలో కొబ్బరి నీళ్లు మెరుగ్గా పనిచేస్తాయని, ట్రైగ్లిజరైడ్లు, చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలోనూ ఇవి ఉపకరిస్తాయని 2005లో ఓ అధ్యయనం వెల్లడించింది. గుండె జబ్బుల బారినపడకుండా కూడా కొబ్బరి నీళ్లు సాయపడతాయన్నది పరిశోధకుల మాట.