Cool Drinks | చిన్నప్పటి నుంచి పిల్లలు తాగే పానీయాలు వారి భవిష్యత్తు ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావం చూపుతాయని తాజా పరిశోధన వెల్లడించింది. ముఖ్యంగా చక్కెర ఎక్కువగా ఉండే శీతల పానీయాలు, స్పోర్ట్స్ డ్రింక్స్, ప్యాకెట్ ఫ్రూట్ జ్యూస్లను తరచూ తాగే పిల్లల్లో పెద్దయ్యాక అధిక రక్తపోటు (హైపర్టెన్షన్) వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. చిన్న వయసులోనే ఆరోగ్యకరమైన పానీయాల అలవాట్లు పెంపొందించడం గుండె ఆరోగ్యానికి ఎంతో కీలకమని వారు సూచిస్తున్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ సర్క్యులేషన్లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో 25 వేల మందికి పైగా వ్యక్తుల ఆరోగ్య సమాచారాన్ని సుమారు 25 సంవత్సరాల పాటు పరిశీలించారు. చిన్ననాటి నుంచి యుక్తవయస్సు వరకు వారు తీసుకున్న చక్కెర పానీయాలు, ఫ్రూట్ జ్యూస్, తాజా పండ్ల వినియోగాన్ని విశ్లేషించి, పెద్దయ్యాక వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.
రోజుకు రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు చక్కెర కలిగిన పానీయాలు తాగిన పిల్లకు, వారానికి మూడు సార్ల కంటే తక్కువగా తాగిన వారితో పోలిస్తే భవిష్యత్తులో రక్తపోటు వచ్చే ప్రమాదం 52 శాతం ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. రోజుకు ఒక్కసారి శీతల పానీయం తాగిన వారిలో కూడా ఈ ప్రమాదం 23 శాతం పెరిగింది. అలాగే స్పోర్ట్స్ డ్రింక్స్ను తరచూ తీసుకున్న వారిలో ఈ ప్రమాదం 36 శాతం అధికంగా నమోదైంది. చాలా మంది తల్లిదండ్రులు ఫ్రూట్ జ్యూస్లను శీతల పానీయాలకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా భావిస్తుంటారు. అయితే రోజుకు ఒకటిన్నర సర్వింగ్ లేదా అంతకంటే ఎక్కువ ఫ్రూట్ జ్యూస్ తాగిన పిల్లల్లో కూడా భవిష్యత్తులో రక్తపోటు వచ్చే ప్రమాదం 35 శాతం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. వంద శాతం పండ్ల రసంలో విటమిన్లు, ఖనిజాలు ఉన్నప్పటికీ, అందులో పీచు పదార్థం ఉండదు. పీచు లేకపోవడంతో చక్కెర వేగంగా రక్తంలో కలసి రక్తనాళాల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుందని వారు వివరించారు.
చక్కెర పానీయాల్లో ముఖ్యంగా ఫ్రక్టోజ్ వంటి చక్కెరలు అధికంగా ఉంటాయి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల బరువు పెరగడం, ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత, శరీరంలో వాపు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ గుండె, రక్తనాళాలపై అదనపు ఒత్తిడిని పెంచి అధిక రక్తపోటుకు దారితీసే అవకాశాన్ని పెంచుతాయి. అయితే మొత్తం ఫ్రక్టోజ్ పరిమాణం కంటే అది ఏ ఆహారం ద్వారా శరీరంలోకి వెళ్తుందనేదే ముఖ్యమని అధ్యయనం సూచించింది. పండ్లలో ఉండే ఫ్రక్టోజ్ మాత్రం అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచలేదని పరిశోధకులు గుర్తించారు. దీనికి కారణం పండ్లలో ఉండే పీచు, యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు రక్షణాత్మక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
పిల్లలు ప్రతిరోజూ తాగే ఒక చక్కెర పానీయాన్ని తాజా పండ్లతో భర్తీ చేస్తే భవిష్యత్తులో రక్తపోటు వచ్చే ప్రమాదం 22 శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుందని అధ్యయనం తెలిపింది. అలాగే చక్కెర పానీయాల స్థానంలో నీరు లేదా పాలు తీసుకోవడం కూడా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. రక్తపోటును సైలెంట్ కిల్లర్గా పిలుస్తారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఇది ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండానే అభివృద్ధి చెందుతుంది. నియంత్రించకపోతే గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. చిన్ననాటి నుంచి ఏర్పడే ఆహారపు అలవాట్లు జీవితాంతం కొనసాగుతాయని, అందుకే పిల్లల్లో ఆరోగ్యకరమైన ఆహారం, పానీయాల అలవాట్లను చిన్న వయసులోనే పెంపొందించడం అత్యంత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.