అనాదిగా.. పండ్లు, పూలు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలకు స్త్రీల సౌందర్య పోషణతో ప్రత్యేక అనుబంధం ఉంది. కాలక్రమంలో వీటి స్థానాన్ని రసాయన కాస్మటిక్స్ ఆక్రమించాయి. నిజానికి, రసాయనాల కంటే ప్రకృతి సిద్ధంగా లభించే పదార్థాలే మంచివి. పండ్లు తినడానికి మాత్రమే కాదు.. చర్మం, కేశాల ఆరోగ్యానికీ గొప్పగా దోహదపడతాయి. గుజ్జు, తోలు, చెక్కు, రసం ఇలా వివిధ రూపాల్లో పండ్లను చర్మ పోషణకు ఉపయోగించుకోవచ్చు.
పొడి చర్మం
పాలిపోయిన, పొలుసులు పొలుసుల చర్మానికి అవకాడో మంచి పరిష్కారం. అవకాడో గుజ్జు, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, ఒక నిమ్మకాయ రసంతో ఫేస్ ప్యాక్ సిద్ధం చేసుకోవాలి. దాదాపు 20 నిమిషాల తర్వాత మొదట చల్లటి పాలతో, ఆ తర్వాత నీళ్లతో కడుక్కోవాలి.
జిడ్డు చర్మం
స్ట్రాబెర్రీలో ఔషధ గుణాలు అనేకం. తీవ్ర చర్మ సమస్యలకు కూడా స్ట్రాబెర్రీ జ్యూస్ ఉపయోగించవచ్చు. ఆమ్ల గుణం కలిగిన స్ట్రాబెర్రీ ఫలాలు చర్మం మీద సమర్థంగా పనిచేస్తాయి. రెండు టేబుల్ స్పూన్ల ఫుల్లర్స్ ఎర్త్ (చవుడు)లో ఒక నిమ్మకాయ రసం కలుపుకోవాలి. ఈ మిశ్రమానికి స్ట్రాబెర్రీ గుజ్జు చేర్చుకోవాలి. దీనిని చర్మం మృతకణాల మీద పూతగా, ఫేస్ మాస్క్గా వాడుకోవచ్చు. ఇలా క్రమం తప్పకుండా చేస్తే.. కాంతిమంతమైన, జిడ్డులేని చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.
కమిలిన చర్మం
అతి నీలలోహిత కిరణాలు, తీవ్రమైన ఎండ బారినపడితే చర్మం కమిలిపోతుంది. పొడిబారుతుంది కూడా. ఈ సమస్య నివారణకు అంగూరు పండ్ల గుజ్జును ఐదు మెదిపిన ఐస్ క్యూబ్లతో కలుపుకోవాలి. దానితో ముఖానికి మర్దన చేసుకోవాలి. అంగూరు పండ్లలోని ఆమ్ల గుణం చర్మాన్ని శుభ్రం చేస్తుంది.
మొటిమల చర్మం
కాస్మటిక్స్లో ప్లమ్ పండ్లను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే, తాజా పండ్ల స్థానాన్ని కృత్రిమ క్రీములు ఏమాత్రం భర్తీ చేయలేవు. ఆరు ఉడికించిన ప్లమ్ పండ్ల లోపలి భాగాన్ని గుజ్జుగా చేసుకోవాలి. దానిని 10 నిమిషాలపాటు చర్మం మీద మర్దన చేయాలి. ఆ తర్వాత ఐస్ నీళ్లతో కడిగేసుకోవాలి. మొటిమలు, జిడ్డు చర్మానికి ఈ విధానం మేలైనది.
ముడతల చర్మం
ముడతల చర్మంతో బాధపడుతున్న వాళ్లకు అప్రికాట్ పండ్లు ఉపశమనకారులు. ఆరు అప్రికాట్ పండ్ల గుజ్జు తీసుకుని, దానిని రెండు టేబుల్ స్పూన్ల ఆల్మండ్ ఆయిల్తో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మంలో ఇంకిపోయేలా ముఖాకి మర్దన చేయాలి. అరగంట తర్వాత కడుక్కోవాలి. విటమిన్ -ఎ, పాలి అన్శాచురేటెడ్ ఆయిల్కు అప్రికాట్లు గనులు. ఇవి చర్మానికి పోషణ ఇస్తాయి.
మిశ్రమ చర్మం
ఆపిల్ ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ పండ్లు అన్నిరకాల చర్మానికూ మంచివి. వీటిలోని పెక్టిన్ చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది. ఒక ఆపిల్ పండును తురుముకుని సగం నిమ్మకాయ రసం లేదా 2 టేబుల్ స్పూన్ల వెనిగర్, ఒక గుడ్డు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్లా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడుక్కోవాలి.
మచ్చల చర్మం
పొప్పడి పండు చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఈ పండులోని ఎంజైములు చర్మాన్ని లోలోతుల నుంచి శుద్ధి చేస్తాయి. మృత కణాలను తొలగిస్తాయి. 2 టేబుల్ స్పూన్ల పొప్పడి కాయ గుజ్జు తీసుకుని ముఖం మీద పూసుకోవాలి. కాసేపటికి వేడినీళ్లతో కడుక్కోవాలి. దీనివల్ల చర్మం స్వభావంలో మెరుగుదల కనిపిస్తుంది.