న్యూఢిల్లీ : అతిగా తినడం వల్లే అధిక బరువు బాధిస్తోందని భావిస్తుంటారు. అయితే కొన్ని రకాల ఆహార పదార్ధాలతో అధిక బరువు సమస్య వెంటాడుతుందని, అవి ఎక్కువగా తినాలనే కోరికను కలిగిస్తాయని ఆయా ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వీటిని అడపాదడపా తీసుకుంటే తప్పులేదని కానీ తరచూ ఈ ఆహార పదార్ధాలను తింటే అధిక బరువుతో పాటు తీవ్ర అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అనారోగ్యకర ఆహార పదార్ధాల్లో వైట్ పాస్తాను పోషకాహార నిపుణులు ప్రస్తావిస్తున్నారు. వైట్ పాస్తాను తరచూ తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉందని న్యూట్రిషనిస్టులు హెచ్చరిస్తున్నారు. రిఫైన్డ్ ఫ్లోర్, బ్రెడ్లు, పాస్తా వంటి కార్బోహైడ్రేట్లు రక్తంలో వెనువెంటనే కలిసి గ్లూకోజ్ లెవెల్స్ పెంచుతాయని, ప్రాంకియాస్ను ప్రేరేపించి ఇన్సులిన్ను విడుదల చేయడంతో దీర్ఘకాలంలో బరువు పెరుగుతారని చెబుతున్నారు. చాక్లెట్లు, స్వీట్లు, డెజెర్ట్స్ ఇతర రకాల క్యాండీలు, తీపిపదార్ధాలు ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతాయి.
ఇక ఆలు, ఆయిల్, ఉప్పు ఎక్కువ మోతాదులో వాడుతూ తయారుచేసే ఫ్రెంచ్ ఫ్రైస్ ఆరోగ్యానికి హానికరం. ఇవి తినాలనే కోరికను పెంచి కొద్దిసేపటిలోనే బాక్స్ అంతటినీ ఖాళీ చేయిస్తాయని ఇలాంటి ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. చిప్స్ వంటి ఆహార పదార్ధాలు కూడా ఆకర్షణీయ ఫ్లేవర్లతో ఉండటంతో అతిగా తింటారని, శరీరంలో ఎండార్ఫిన్స్ను ఇవి విడుదల చేయడంతో వీటిని అధికంగా తినాలని కోరుకుంటారని ఫలితంగా శరీరం బరువు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.