శ్వాస వ్యవస్థకు ఎదురయ్యే సమస్యల్లో జలుబు ఒకటి. ఇది ముక్కును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కొందరిలో గొంతు, సైనస్ భాగాలకూ వ్యాపిస్తుంది. ఎక్కువగా రైనో వైరస్ వల్ల, కొంతవరకు అడినో, కరోనా వైరస్ల వల్ల వస్తుంది. పిల్లల్లో ఏడాదికి ఆరు నుంచి ఎనిమిదిసార్లు కనిపిస్తుంది. 10-15 శాతం పిల్లలకు మాత్రం పదీపన్నెండుసార్లు కూడా రావచ్చు.
చాలా సందర్భాల్లో తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేస్తూ.. బిడ్డల్ని సంరక్షణ కేంద్రాల్లో వదిలేస్తుంటారు. అలాంటి పిల్లల్లో జలుబు సమస్య తీవ్రంగా ఉంటుంది. దీర్ఘకాలికంగా ఇబ్బందిపెడుతుంది. వర్షకాలంలో, చలికాలంలో మరీ ఎక్కువ.
జలుబు గొంతు దురదతో ప్రారంభం అవుతుంది. రెండు మూడు రోజులకు ముక్కు నుంచి నీరు కారడం మొదలవుతుంది. ముక్కు మూసుకుపోయి బిడ్డ శ్వాస పీల్చడం, పాలు తాగడం కష్టమవుతుంది. ముక్కు కారడం తగ్గాక 30 శాతం పిల్లల్లో దగ్గు వస్తుంది. ఈ లక్షణాలు ఎలర్జీ వ్యాధిలో కనిపించినా.. తుమ్ములు, ముక్కు దురద మరీ ఎక్కువ. వ్యాధి లక్షణాలు రెండు వారాల తర్వాత కూడా వదిలిపెట్టకపోతే.. ఇతర సమస్యలేమైనా ఉన్నాయేమో పరీక్షించాలి. ముక్కు దిబ్బడ తగ్గాక కూడా చెవి లాక్కుంటూ ఉంటారు పిల్లలు. చెవిని ముట్టుకుంటే ఏడుస్తారు. ఇలాంటప్పుడు, చెవిలో చీము చేరే అవకాశం ఉంది. బడి వయసు పిల్లలైతే సైనసైటిస్ ఉందేమో పరీక్షించాలి.
వ్యాధి వ్యాప్తి
తుమ్ములు, దగ్గు, ఉమ్మి ద్వారా లాలాజల బిందువుల నుంచీ ఈ వైరస్ వ్యాపిస్తుంది.
సమస్యలు
ఈ వ్యాధి ఏ సమస్యలకూ దారితీయకపోయినా, 5 నుంచి 30 శాతం పిల్లల్లో జలుబు ముక్కు నుంచి యూస్టేషియన్ గొట్టం ద్వారా చెవిలోకి ప్రవేశించి, అక్కడ చీము ఏర్పడవచ్చు, 5 నుంచి 13 శాతం పిల్లల్లో సైనసైటిస్ వస్తుంది.
వైద్యం
జలుబు వైరస్ వల్ల వస్తుంది కాబట్టి, ప్రత్యేకమైన మందులేవీ లేవు. వ్యాధి లక్షణాల తీవ్రత తగ్గించడానికి మాత్రం మందులు అవసరం. ముక్కు మూసుకుపోయి శ్వాస పీల్చడం కష్టంగా ఉన్నప్పుడు, వత్తిలా చేసిన దూదితో రోజుకు నాలుగుసార్లు ముక్కును శుభ్రం చేయాలి. అయినా శ్వాస తీసుకోవడం కష్టమైతే ముక్కులో ‘స్లైన్’ చుక్కలు వేయాలి. ఇదీ పని చేయనప్పుడు వైద్యుల సలహాపై జైలో మెటాజోలిన్, ఆక్సీ మెటాజోలిన్ చుక్కలు వాడాలి. ఈ మందు ఎక్కువ రోజులు వాడి ఒక్కసారిగా ఆపేస్తే, వ్యాధి లక్షణాలు తీవ్రస్థాయిలో తిరగబెడతాయి. దీన్ని ‘రీబౌండ్ ఎఫెక్ట్’ అంటారు. జ్వరం వస్తే పారసిటమల్ సరైన మోతాదులో వాడాలి. ముక్కు కారడం తీవ్రంగా ఉంటే, డాక్టరు సలహాపై నోటి మందు వాడాలి.
నివారణ
సాధ్యమైనంత వరకు బడి వయసు వచ్చేవరకు పిల్లలను ఇంటి దగ్గరే ఉంచుకుని సంరక్షించాలి. బిడ్డలను ముట్టుకొనే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. పిల్లల చేతులను తరచూ కడుగుతూ ఉండాలి. తల్లికి జలుబు, దగ్గు ఉన్నప్పుడు, నోటికి అడ్డంగా గుడ్డ కట్టుకొని పాలు తాగించాలి. నోట్లోంచి సూక్ష్మజీవులు వ్యాపించకుండా తరచూ వేడినీటి ఆవిరిని పీల్చి, గోరువెచ్చని ఉప్పునీటితో పుక్కిలించాలి. ముక్కు, కండ్లను చేతులతో ముట్టుకోరాదు.
-డాక్టర్ కర్రా రమేశ్రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు