ఏడున్నర దశాబ్దాల క్రితం.. దేశం కోసం పోరాడాం. లక్ష్యాన్ని సాధించాం. భారతమాత దాస్య శృంఖలాలను తెంచేశాం.
ఇప్పుడిక..
దేహం కోసం పోరాడుదాం. శరీరం నుంచి రోగాలను తరిమేద్దాం. ఆలోచనల నుంచి వ్యసనాలను తుడిచేద్దాం. వ్యవస్థలోని అనారోగ్యకర జాడ్యాలను దూరం చేద్దాం. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో సిపాయిల్లా.. అపసవ్య జీవనశైలిపై తిరుగుబాటు చేద్దాం.
మనకిప్పుడు..
మరో ‘ఉప్పు’ సత్యాగ్రహం కావాలి. అధిక రక్తపోటును అధిగమించాలి. వెంటనే దండి యాత్ర మొదలుపెట్టాలి. రోజూ ఓ గంటసేపైనా నడవాలి. స్వదేశీ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి. సంప్రదాయ సిరిధాన్యాలు ఆరగించాలి. పిజ్జా, బర్గర్, సాఫ్ట్డ్రింక్స్.. క్విట్ ఇండియా! ఎందుకైనా మంచిది, మనకంటూ ఓ ఆరోగ్య రాజ్యాంగమూ రాసుకుందాం. రోగాలు లేని శరీరం, ఒత్తిడి లేని మనసు.. ఆ పీఠికలో కీలక పదాలు కావాలి. స్వేచ్ఛ భిక్ష కాదు. ఎవరో ఇస్తే తీసుకోడానికి. ఆరోగ్యమూ అంతే. అయాచితంగా రాదు. కష్టపడి సాధించుకోవాలి. ఇష్టపడి నిలబెట్టుకోవాలి.
అలవాట్లతో.. ఆరోగ్య స్వేచ్ఛ
ఈ మధ్య బీపీ, షుగర్ బాధితులు పెరిగిపోతున్నారు. ఈ రెండు జాడ్యాలూ ఇతర రోగాలకు కారణం అవుతున్నాయి. వీటిని సకాలంలో గుర్తించి, నియంత్రించకపోతే కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. గుండెపోటు వచ్చే ఆస్కారం ఉంది. బ్రెయిన్ స్ట్రోక్ దాడి చేసినా చేస్తుంది. నిజానికి, అనేకానేక రుగ్మతలకు మూలం బీపీ, షుగర్. ఈ జాడ్యాలు మనల్ని బాధించకుండా ఉండాలంటే.. జీవన విధానాన్ని, ఆహారపు అలవాట్లను నియంత్రణలో ఉంచుకోవాలి. శారీరక శ్రమ తప్పనిసరి.
ఆధునిక సాంకేతికత కారణంగా ప్రతి
పనీ మనం కంప్యూటర్ సాయంతో చేయాల్సి వస్తున్నది. వాహనం లేకుండా గడప దాటలేని పరిస్థితి. మూడు దశాబ్దాల క్రితం ఎక్కడికైనా సైకిల్ పైనే వెళ్లేవారు. లేదంటే నడిచేవారు. ప్రజా రవాణా వ్యవస్థ ఎక్కువగా వినియోగించేవారు. వీటన్నిటివల్ల తెలియకుండానే శారీరక శ్రమ జరిగేది. ఒంటికి వ్యాయామం లభించేది. క్యాలరీలు కరిగేవి. ఇప్పుడా పరిస్థితులు లేవు. అందుకని, రోజూ కచ్చితంగా 30 నుంచి 40 నిమిషాలు వాకింగ్ చేయాలి. సాధ్యమైనంత వరకు పాలు, కూరగాయలు వంటి వాటి కోసం.. బైక్ తీయడం మానేయాలి. నడకను ఎంచుకుంటే మంచిది. ఆఫీసులో గంటలకొద్దీ ఒకే చోట కూర్చోకుండా అరగంటకు ఒకసారైనా అటూ ఇటూ తిరగాలి. దీనివల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అంతేకాదు, ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. సాధ్యమైనంత వరకు ఆ ఊబిలోంచి బయపడాలి.
.. ఈ నియమాలను పాటిస్తే బీపీ, షుగర్ బారినుంచి బయటపడవచ్చు. ఒకవేళ వచ్చినా నియంత్రణలో పెట్టుకోవచ్చు. దుష్ప్రభావాలను తప్పించుకోవచ్చు.
– డా. రాజారావు సూపరింటెండెంట్, గాంధీ హాస్పిటల్
క్విట్.. దురలవాట్లు
ఈ మధ్య కాలంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ తరువాతి స్థానంలో కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలే ఉంటున్నాయి. మద్యం, ధూమపానం, జంక్ఫుడ్, కొవ్వు పదార్థాలు, నిల్వ ఉంచిన ఆహారం.. మితిమీరి తీసుకోవడం వల్ల కాలేయంతో పాటు పెద్దపేగు, చిన్నపేగు సమస్యలు వస్తున్నాయి. మద్యం దెబ్బకు ఫ్యాటీ లివర్ రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంది. జీవన విధానం, ఆహార నియమాలతో కాలేయ సంబంధ రుగ్మతల నుంచి బయట పడవచ్చు.
– డా. నగరి బీరప్ప, డైరెక్టర్, నిమ్స్
రేపటి భారతం కోసం..
తల్లి పాలు బిడ్డకు అమృతం. ఆ ప్రభావంతో.. రాబోయే రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. బిడ్డ పుట్టిన గంటలోపు ముర్రుపాలు పట్టాలి. ఈ పాలలో అత్యధిక పోషకాలతో పాటు వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. బిడ్డకు మూడేండ్లు వచ్చేవరకు తల్లిపాలు ఇవ్వడమే మంచిది. దీనివల్ల బిడ్డకు జీవితాంతం ఆరోగ్య సంరక్షణ లభిస్తుంది. వ్యాక్సినేషన్ కూడా ముఖ్యమే. క్రమం తప్పక అన్ని టీకాలూ ఇప్పించాలి. ప్రేమ పంచాలి. సంరక్షణ ఇవ్వాలి. దీనివల్ల శారీరక, మానసిక వికాసం వేగవంతం అవుతుంది.
– డా. ఉషారాణి, సూపరింటెండెంట్, నిలోఫర్ హాస్పిటల్
భారతమాతకు జేజేలు!
మహిళల్లో కనిపించే అతి సాధారణమైన, అత్యంత తీవ్రమైన సమస్య.. రక్తహీనత. దేశ జనాభాలో సగానికి సగం మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. బాలికలు, యువతుల్లో సైతం ఈ ధోరణి కనిపిస్తున్నది. ఇక గర్భిణుల్లో అయితే దాదాపు 70 శాతం మంది దుస్థితి ఇది. సాధారణంగా మహిళలకు ప్రతి డెసీ లీటర్ రక్తంలో 12 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. కానీ కొంతమందిలో 2-3గ్రాములకు కూడా మించడం లేదు. ఆరోగ్య సంరక్షణలో భాగంగా మహిళలు ఎనీమియాపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. పౌష్టికాహారం తినాలి. పాలు, గుడ్లు, చేపలు, మాంసాహారం తీసుకోవాలి. ఐరన్ లోపం వల్ల ఎనీమియా సమస్య ఏర్పడుతుంది. అందుకని, ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహారం ఉత్తమం. శాకాహారులైతే.. బెల్లం పట్టీలు, పల్లీపట్ట్టీలు, ఖర్జూరం, బెల్లం వంటివి తీసుకోవాలి. కొందరికి నెలసరిలో రక్తస్రావం అధికంగా జరుగుతుంది. దీనివల్ల కూడా
రక్తహీనత ఏర్పడుతుంది. ఇలాంటి సమస్యలు ఉంటే వెంటనే గైనకాలజిస్టును సంప్రదించాలి. తగిన చికిత్స, ఆహార విధానం ద్వారా బయటపడవచ్చు. పుట్టబోయే బిడ్డల్లో జన్యు సమస్యలు లేకుండా ‘రుబెల్లా’ టీకా వేయించడమూ తప్పనిసరి.
– డా. మాలతి, సూపరింటెండెంట్ పేట్లబుర్జు ప్రసూతి దవాఖాన
తెల్లవారిని తరిమినట్టు..
మత్తు పదార్థాలు మనపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వాటికి ఎంత దూరం ఉంటే మన నాడీ వ్యవస్థ అంత సురక్షితంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో యువత వ్యసనాల బారిన పడుతున్నది. మాదక ద్రవ్యాల మత్తుకు అలవాటు పడుతున్నది. దీనివల్ల చిన్నతనంలోనే మల్టిపుల్ స్లెరోసిస్ అనే కండరాల వ్యాధికి గురవుతున్నారు చాలా మంది.
ఈ వ్యాధి ప్రత్యేకించి.. మెదడు, వెన్ను
పాముకు సంబంధించినది. నాడీ వ్యవస్థపైనా పనిచేసి రోగ నిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. ఫలితంగా వ్యాధులను తట్టుకునే సత్తువ తగ్గిపోతుంది. పలురకాల వ్యాధులు చుట్టుముడతాయి. ఇటీవలి కాలంలో మల్టిపుల్ స్లెరోసిస్ మరింత పెరిగిపోతున్నది. దీని ప్రభావం మెదడు, వెన్నెముకతో పాటు శరీరంలోని అన్ని ప్రధాన అవయవాలపైనా పడుతుంది. అందుకని, స్వాతంత్య్ర పోరాటంలో తెల్లవారిని తరిమినట్టు.. మత్తు పదార్థాలనూ సమాజం నుంచి తరిమేద్దాం.
– డా. శ్రీధరాల శ్రీనివాస్ న్యూరో సర్జన్, ప్రొఫెసర్ అండ్ హెచ్వోడీ, ఉస్మానియా దవాఖాన
జై జవాన్.. జై వ్యాక్సిన్
సరిహద్దు సైనికుల లాంటివి వ్యాక్సిన్లు. కంచె అవతలి నుంచి చొచ్చుకు రావడానికి ప్రయత్నించే చొరబాటుదారులను జవాన్లు సమర్థంగా అడ్డుకున్నట్టు.. అనారోగ్యాన్ని మోసుకొచ్చే క్రిమికీటకాల నుంచి వ్యాక్సిన్లు రక్షిస్తాయి. వానకాలం సీజనల్ వ్యాధులు సహజం. ఇందులో దోమల వల్ల డెంగీ, మలేరియా; కలుషిత నీరు, ఆహారం వల్ల డయేరియా, టైఫాయిడ్, కామెర్లు తదితర వ్యాధులు చుట్టుముడతాయి. వాతావరణ మార్పులు మొదలైన కారణాలతో ఇన్ఫ్లూయెంజా తదితర వైరల్ ఫీవర్లు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వాన కాలంలో దోమల నుంచి రక్షణ పొందగలిగితే డెంగీ, మలేరియా నుంచి విముక్తి పొందవచ్చు. కలుషిత నీరు, ఆహారానికి దూరంగా ఉంటే.. డయేరియా, కామెర్లు వంటి వాటి నుంచి తప్పించుకోవచ్చు. వాతావరణ మార్పుల వల్ల విస్తరించే వైరల్ ఫీవర్లు మన వరకూ రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ఉందిలే మంచి కాలం..
కొన్నిరకాల క్యాన్సర్లకు నిర్దిష్టమైన కారణాన్ని చెప్పలేం. కానీ 60 శాతానికి పైగా క్యాన్సర్ వ్యాధులు.. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కొని తెచ్చుకునేవే.. ముఖ్యంగా నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటివి. సిగరెట్, బీడీ, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తుల వల్ల నోటి క్యాన్సర్లు దాపురిస్తాయి. యువతలో దురలవాట్ల కారణంగానే ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు అధికంగా నమోదు అవుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే క్యాన్సర్ బాధితులు ఎక్కువ. తగిన జాగ్రత్తలతో.. మహిళల్లో అధికంగా కనిపించే గర్భాశయ క్యాన్సర్ నుంచి విముక్తి పొందవచ్చు. పది నుంచి నలభై ఏండ్ల వయసువారు తప్పక గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోవాలి. వివాహానికి ముందే తీసుకోవడం ఇంకా ఉత్తమం. తొలి డోసు తర్వాత ఆరు నెలలకు రెండో డోసు తీసుకోవాలి. దీనివల్ల సాధారణ జీవితం గడపొచ్చు. పరిపూర్ణ ఆరోగ్య స్వాతంత్య్రాన్ని ఆస్వాదించవచ్చు. ప్రజల చైతన్యం, ప్రభుత్వాల చొరవతో మనం క్యాన్సర్ రహిత సమాజాన్ని నిర్మించుకోగలమనే నమ్మకం ఉంది.
– డా. జయలత, డైరెక్టర్, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్
…?మహేశ్వర్రావు బండారి