నమస్తే డాక్టర్. నా వయసు ముప్పై. నాకు నాలుగు నెలల బాబు ఉన్నాడు. గత నెలలో విపరీతంగా జ్వరం వచ్చింది. చాలా రోజులు యాంటీబయాటిక్స్ వాడాను. ఆ తర్వాత నుంచి పూర్తిగా పాలు రావడం లేదు. డాక్టర్ సూచనతో బిడ్డకు డబ్బాపాలు పడుతున్నాను. మళ్లీ నాకు పాలుపడే అవకాశం ఉందా? అందుకు ఏం చేయాలి?
మీకు పాలు తగ్గిపోవడం అనేది అనారోగ్యం వల్లనో, మందులు వాడటం వల్లనో జరగలేదు. సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు తల్లుల ఒంట్లో శక్తి సన్నగిల్లుతుంది. ఓపిక లేకపోవడం వల్ల బిడ్డకు పాలు పట్టడం మానేస్తారు. అయితే, బిడ్డ సరిగ్గా తాగకపోతే పాల ఉత్పత్తి తగ్గిపోతుంది.
ఇక పాలు రావు. అందులోనూ డబ్బాపాలు పడుతున్నాం అంటున్నారు. అంటే, నాకు తెలిసి మీరు సీసాతో బిడ్డకు పాలు పట్టిస్తూ ఉంటారు. తల్లి దగ్గర పాలు తాగాలంటే బిడ్డ వాటిని రొమ్ము నుంచి గుంజుకోవాల్సి వస్తుంది. అందుకు కొంత శ్రమ అవసరం. కానీ సీసాలో పాలు సులభంగా నోట్లోకి వస్తాయి. తల్లి పాలతో పోలిస్తే తియ్యగా ఉంటాయి కూడా. బిడ్డ సీసా పాలకు అలవాటు పడినప్పుడు, తల్లి పాలుపట్టే ప్రయత్నం చేసినా తాగకుండా ఏడవడం ప్రారంభిస్తుంది. అయినా ఫర్వాలేదు. రెండు రోజుల పాటు మీ దగ్గరే తాగించే ప్రయత్నం చేయండి. బిడ్డ తాగుతూ ఉంటే పాలు తప్పక పడతాయి. తొలిరోజుల్లో బాబుకు పొట్ట నిండలేదనిపిస్తే కొంచెం డబ్బాపాలు ఉగ్గుగిన్నెతో పట్టండి. సరిపోతుంది.
– డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్