SmartPhone | కంప్యూటర్, స్మార్ట్ఫోన్ తెరను అదేపనిగా చూడటం వల్ల కంటి సమస్యలు తలెత్తుతాయి. స్మార్ట్ఫోన్ విజన్ సిండ్రోమ్ (ఎస్వీఎస్), కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ (సీవీఎస్) పగబట్టినట్టు దాడి చేస్తాయి. కాబట్టి, జాగ్రత్తలు అవసరం.
స్మార్ట్ఫోన్ను కండ్ల కిందుగా ఉంచుకుని చూడటం చాలామందికి అలవాటు. ఇది సరైన విధానం కాదు. స్క్రీన్ను కంటి నుంచి.. 15-20 డిగ్రీల కోణంలో కానీ, కంటికి సమానంగా కానీ ఉంచుకోవడం సురక్షితం.
స్మార్ట్ఫోన్ స్క్రీన్ మీద నేరుగా కాంతి పడకుండా చూసుకోవాలి. కిటికీలను పలుచటి తెరలతో కప్పేయాలి. డెస్క్ కోసం తక్కువ కాంతి కలిగిన బల్బులనే ఎంచుకోవాలి.
కాంతి తక్కువగా పడే అవకాశం లేనప్పుడు యాంటీ గ్లేర్ కండ్లద్దాలు వాడటం ఉత్తమం. ఇవి స్మార్ట్ఫోన్ స్క్రీన్ మీదపడిన కాంతి కంటికి చేరుకునే తీవ్రతను తగ్గిస్తాయి.
ప్రతి రెండుగంటలకు ఓసారి పదిహేను నిమిషాలపాటు కండ్లు మూసి ఉంచాలి. అలానే ప్రతి 20 నిమిషాల తర్వాత 20 సెకన్లపాటు కొంత దూరంలో ఉన్న వస్తువులను చూడాలి. అలా కండ్లను మళ్లీ స్క్రీన్ చూడటానికి అనువుగా మార్చుకోవాలి.
స్మార్ట్ఫోన్, కంప్యూటర్తో పనిచేస్తున్నప్పుడు కండ్లు పొడిబారకుండా ఉండటానికి తరచూ మూస్తూ తెరుస్తూ ఉండాలి. ఇలా చేస్తే కంటి ముందుభాగం తేమగా ఉంటుంది.
స్మార్ట్ఫోన్లను కంటికి మరీ దగ్గరగా పెట్టుకుని చూడటం వల్ల స్మార్ట్ఫోన్ విజన్ సిండ్రోమ్ (ఎస్వీఎస్) వృద్ధి చెందవచ్చు. కండ్లద్దాలు పెట్టుకునే వాళ్లు దీని బారినపడే ఆస్కారం తక్కువే. దగ్గరగా ఉన్న వస్తువులు మసకగా కనిపించడం, తలనొప్పి, కండ్లమీద ఒత్తిడి.. ఈ వ్యాధుల లక్షణాలు.