న్యూఢిల్లీ : దీపావళితో మరికొద్ది రోజుల్లో పండగ సీజన్ ముమ్మరమవుతుండటంతో కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో మనం ఎండెమిక్ దశకు చేరుకున్నామని భావించడం తగదని స్పష్టం చేశారు. జనాభాలో అత్యధిక మంది వైరస్కు వ్యతిరేకంగా రోగ నిరోధక శక్తి సమకూర్చుకుంటేనే ఏ వ్యాధి అయినా ఎండెమిక్ దశకు చేరినట్టని చెప్పారు.
రోగనిరోధక శక్తిని దాటుకుని వ్యాప్తి చెందే కొత్త వేరియంట్ పుట్టుకొస్తేనే భారత్లో సెకండ్ వేవ్ తరహా వేవ్ ముంచెత్తుతుందని వారు పేర్కొన్నారు. అయితే కేసుల తగ్గుదల వ్యాధి గ్రాఫ్లో ఓ భాగం మాత్రమేనని బ్రిటన్ వంటి దేశాల్లో వైరస్ తిరిగి వ్యాప్తి చెందడం వంటి పరిణామాలను ఉటంకిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మనం ఎండెమిక్ దిశగా పయనిస్తున్నా ఇంకా ఆ దశకు చేరలేదని ప్రముఖ వైరాలజిస్ట్ షాహిద్ జమీల్ చెప్పుకొచ్చారు.