ఆ కుటుంబాలన్నీ మన దేశంలోనే ఉన్నాయి. మన రాష్ట్రంలోనే బతుకుతున్నాయి. కానీ, స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడిచినా వాళ్ల కులాన్ని మాత్రం అధికారికంగా గుర్తించలేదు. దీంతో ఆధార్ రాలేదు. సంక్షేమ పథకాలూ అందలేదు. ఆ సమస్య సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లింది. ఆ కులాన్ని అధికారికంగా గుర్తించి ధృవీకరణ పత్రాలు అందించారు. దీంతో సంక్షేమ పథకాలన్నీ వరుసకట్టాయి.
జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలోని పిట్టలోనిగూడెం కథ ఇది. ఇక్కడ యాభై ఏండ్లుగా ఓ అరవై కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వన్యమృగాల వేట వారి జీవనాధారం. చుట్టుపక్కల మామిడి, దానిమ్మ తోటల్లో కాపర్లుగానూ పనిచేస్తారు. వారి జీవన శైలి, భాష ప్రత్యేకంగా ఉంటాయి. వేషధారణలోనూ వైవిధ్యం కనిపిస్తుంది. దీంతో జనం పిట్టలోళ్లుగా వ్యవహరిస్తారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాజారపు ప్రతాప్ ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే, పిట్టలోళ్ల స్థితిగతులపై అధ్యయనం జరిగింది. ఆ తర్వాతే, వీళ్లను అధికారులు నక్కల కులం (ఎస్టీ)గా గుర్తించారు. దీంతో వాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
‘ఆధార్కార్డు లేకపోవడంతో.. మాకు కేసీఆర్ కిట్టు కూడా వచ్చేది కాదు. ఇప్పుడు.. అధికారులే మా ఇంటికొచ్చి పత్రాలు ఇస్తున్నారు. మా బంధువుల్లో ఒకరికి ఆడపిల్ల పుట్టడంతో పదమూడు వేల రూపాయలు వచ్చాయి’ అని సంతోషంగా చెబుతుంది గుగులోత్ బీరమ్మ. భారతీయ సమాజంలో ఇప్పటికీ కులం ఓ ఉనికి. పిట్టలోని గూడెం ప్రజలకు ఆ ఉనికి లభించడానికి ఇంతకాలం పట్టింది! ఇక్కడితో అయిపోలేదు. పిట్టలోనిగూడెం ఇప్పుడు ఓ పంచాయతీ కూడా!