Eating nuts | మనం ఆరోగ్యంగా ఉండేందుకు ఏవో కసరత్తులు చేస్తుంటాం. అంతగా కష్టపడటానికి ఇష్టం లేని వారు జీవనశైలిలో మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఉదయాన్నే కొన్ని గింజలను తీసుకోవడం ద్వారా ఎన్నో ప్రోటీన్లు, పోషకాలను పొందవచ్చునంటున్నారు పోషకాహార నిపుణులు. బాదం, జీడిపప్పు, హాజల్నట్స్, వాల్నట్స్, పిస్తా, ఆప్రికాట్స్, పైన్ గింజలు, కెకాన్లు, మకాడమియా, బ్రెజిల్ గింజలు వంటివన్నీ నట్స్ కిందకే వస్తాయి. ఒక్కో నట్కి ఒక్కో ప్రత్యేకత ఉననది. రుచితో పాటు వీటిలో మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి.
మన రోజును ఆరోగ్యకరంగా ప్రారంభించాలంటే నిత్యం నట్స్ తినడం అలవాటు చేసుకోవాలి. ఉదయాన్నే అన్నం తినాలనే కోరిక లేని వారు, సమయం లేకపోవడం వల్ల అన్నం తినలేని వారు.. గింజలను అల్పాహారంగా తీసుకోవచ్చు. వీటి ద్వారా బహుళ ప్రయోజనాలు అందుతాయి. వీటిని తినడం వల్ల శరీరం మొత్తం అభివృద్ధి చెందుతుంది.
బరువు తగ్గొచ్చు..
శరీరం బరువును తగ్గించుకోవాలని చూసేవారు ఉదయాన్నే గింజలను తినడం అలవాటు చేసుకోవాలి. నట్స్లో ప్రోటీన్ ఫైబర్ పుష్కలంగా ఉండి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. మన కడుపు నిండుగా ఉండేలా చూస్తాయి. ఫలితంగా ఎక్కువ ఆహారం తీసుకోం. దాంతో శరీరం శక్తిని కోల్పోకుండానే బరువు తగ్గుతుంది.
గుండెకు మంచిది..
ఉదయాన్నే గింజలు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. స్ట్రోక్, గుండెపోటు వంటి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అలాగే, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్, కొవ్వును కూడా తగ్గిస్తాయి.
శక్తిని పెంచుతాయి..
ఉదయం పూట గింజలను తీసుకోవడం వల్ల శక్తి పెరుగుతుంది. అలాగే రోజంతా ఉత్సాహంగా పనిచేయడంలో సహాయపడతాయి. వీటిలో విటమిన్లు, మినరల్స్, కాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఇతర పోషకాలు ఉండటమే దీనికి కారణం. అల్పాహారానికి సమయం లేనప్పుడు కొన్ని గింజలను తీసుకోవడం చాలా ఉత్తమం.
మెదడుకు ఎంతో ఉపయోగం..
నట్స్ తినడం వల్ల మెదడు ఆరోగ్యం బాగుంటుంది. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా వాల్ నట్స్లోని ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ ఎముకలు, పళ్లను బలంగా మారుస్తాయి. అలాగే, ఒమేగా త్రి ఫ్యాటీ యాసిడ్స్ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వాల్నట్స్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.
జీర్ణక్రియను పెంచుతాయి..
నట్స్లో ముఖ్యంగా వాల్నట్స్లో లభించే యాంటీ యాక్సిడెంట్లు జీవక్రియను పెంచుతాయి. కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. ఆరోగ్యకరమైన చర్మం కోసం నిత్యం వాల్నట్స్ తినడం అలవాటు చేసుకోవాలి. ఉదయాన్నే నానబెట్టిన బాదం పప్పును తినడం వల్ల జీర్ణశక్తి, జ్ఞాపకశక్తిని పెరుగుతాయి. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడం వంటి అనేక ప్రయోజనాలను కూడా పొందవచ్చు. పచ్చి బాదంతో పోలిస్తే నానబెట్టిన బాదం జీర్ణక్రియలో మెరుగ్గా ఉంటుంది. సులభంగా జీర్ణమవుతాయి. శరీరంలో ఉండే పోషకాలను సమర్థంగా గ్రహిస్తాయి. మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి.