న్యూఢిల్లీ : ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్ఓ) గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1.79 కోట్ల మంది హృద్రోగాలతో మరణిస్తుండగా వారిలో ఐదింట ఓ వంతు భారతీయులు కాగా, వారిలో అధికులు యువతే కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. అనారోగ్యకర జీవనశైలి, సమతులాహార లోపం, ఒత్తిడి, పొగతాగడం, మద్యం సేవించడం వంటి జీవనశైలి లోటుపాట్లతో (Health Tips) యువతలో గుండె సమస్యలు తలెత్తుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది.
భారతీయుల్లో గుండె సమస్యలు గత దశాబ్ధంలో రెట్టింపయ్యాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆధునిక సమాజంలో పెరిగిన ఒత్తిళ్లు, అనారోగ్యకర జీవనశైలితోనే హృద్రోగాలు పెరిగిపోతున్నాయని ప్రముఖ కార్డియాలజిస్ట్, మెడిసిటీ గురుగ్రాం కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ ప్రవీణ్ చంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో కెరీర్లో ఎదిగి, జీవితంలో స్ధిరపడాలనే కసి పెరిగి ఒత్తిడితో చిత్తయ్యే పరిస్ధితి వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నదని, మానసిక ఒత్తిడి పెరిగిపోతుండటంతో అది హృద్రోగ ముప్పు పెంచుతున్నదని చెప్పారు.
ఇక ఆధునిక జీవనశైలిలో శారీరక వ్యాయామం లేకపోవడం మరొక కారణం. వారానికి కనీసం నాలుగైదు రోజులు రోజుకు 45 నిమిషాల పాటు నడిచినా ఆరోగ్యకర జీవనశైలి అనుసరించవచ్చని డాక్టర్ ప్రవీణ్ చంద్ర సూచించారు. ఇక మధుమేహం, అధిక రక్తపోటు, హై కొలెస్ట్రాల్ వంటివి సైలెంట్ కిల్లర్స్గా పేరొందగా, హృద్రోగ ముప్పును నివారించేందుకు వీటిని అదుపులో ఉంచుకోవాలని చెప్పారు.
మనం తీసుకునే ఆహారం, పానీయాలపై ఓ కన్నేసి ఉంచడం, రోజూ వ్యాయామం చేయడంతో పాటు స్మోకింగ్, డ్రింకింగ్కు దూరంగా ఉండటం వంటి మెరుగైన జీవన శైలిని అలవరుచుకోవాలి. ఈ ఆరోగ్యకర అలవాట్లతో గుండెపోటును నివారించవచ్చని, వీటితో 90 శాతం హృద్రోగ మరణాలను నివారించవచ్చని డాక్టర్ ప్రవీణ్ చంద్ర తెలిపారు.
Read More :