Meditation | మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ధ్యానం కీలక పాత్ర పోషిస్తుందని ఎన్నో అధ్యయనాలు ఇప్పటికే వెల్లడించాయి. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన మరో పరిశోధన డీప్ మెడిటేషన్పై మరిన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. కేవలం ఏడు రోజుల పాటు లోతైన ధ్యానం చేస్తే మెదడు పనితీరులో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయని ఈ అధ్యయనం చెబుతోంది. ముఖ్యంగా మెదడు నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడటంతోపాటు రక్త సంబంధిత జీవక్రియలపై కూడా దీని ప్రభావం ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్డియాగో నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం, ధ్యానం, మైండ్-బాడీ టెక్నిక్స్ కలిపి చేసిన ఏడు రోజుల ప్రత్యేక కార్యక్రమం మెదడు కార్యకలాపాలు, శరీర జీవక్రియలలో కొలిచే స్థాయిలో మార్పులు తీసుకువచ్చిందని గుర్తించారు. ఈ ఫలితాలను కమ్యూనికేషన్స్ బయాలజీ జర్నల్లో ప్రచురించారు.
పరిశోధనలో పాల్గొన్న వారిలో మెదడు నాడీ వ్యవస్థలో కొత్త మార్పులు కనిపించాయని, దీని ద్వారా న్యూరోప్లాస్టిసిటీ సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంటే మెదడు కొత్త అనుభవాలకు అనుగుణంగా తన పనితీరును మార్చుకునే సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. ఈ అధ్యయనంలో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, ధ్యానం వల్ల శరీర రోగనిరోధక వ్యవస్థ కూడా చురుకుగా మారిందని గుర్తించారు. అలాగే సహజసిద్ధమైన నొప్పి నివారణ రసాయనాల ఉత్పత్తి కూడా పెరిగినట్లు వెల్లడించారు. దీని వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం ఉండే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ధ్యానం కేవలం ఒత్తిడి తగ్గించే ప్రక్రియ మాత్రమే కాదని, అది మెదడు వాస్తవాలను గ్రహించే విధానాన్నే మార్చగలదని పరిశోధకులు తెలిపారు. ఈ మార్పులను మెదడు, రక్త పరీక్షల ద్వారా నేరుగా కొలిచామని శాస్త్రవేత్తలుపేర్కొన్నారు.
ఏడు రోజుల ధ్యాన శిబిరంలో మొత్తం 33 గంటల గైడెడ్ మెడిటేషన్ నిర్వహించారు. ఇందులో గ్రూప్ హీలింగ్ యాక్టివిటీస్, మానసిక ఆరోగ్య పద్ధతులు కూడా భాగంగా ఉండటం వల్ల పాల్గొన్న వారిలో మంచి ఫలితాలు కనిపించాయని పరిశోధకులు వెల్లడించారు. దేశంలో యోగా, ధ్యానంపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ అధ్యయనం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దీర్ఘకాలిక నొప్పులు, మూడ్ డిజార్డర్లు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు దేశంలో వేగంగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో దీర్ఘకాలిక నొప్పుల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. నిత్య జీవితంలో ధ్యానాన్ని భాగం చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతతోపాటు మెదడు పనితీరు కూడా మెరుగుపడే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా డీప్ మెడిటేషన్ చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.