కరోనా పుణ్యమా అని ఇప్పుడు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెరిగిపోయింది. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు పౌష్టికాహారం తినడంతో పాటు కొంతమంది అయితే మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లను కూడా తీసుకుంటున్నారు. నిజానికి పోషకాహారం తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సినన్ని విటమిన్లు, ఖనిజాలు దొరుకుతాయి. కానీ ఈ కొవిడ్ సమయంలో ఆహారం ద్వారానే కాకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో మల్టీ విటమిన్లను పొందాలని కొంతమంది చూస్తున్నారు. పెద్దల వరకు అయితే ఫర్లేదు కానీ.. పిల్లలకు కూడా మల్టీ విటమిన్లను ట్యాబ్లెట్ల రూపంలో ఇవ్వాల్సిన అవసరం ఉందా? అలా ఇవ్వడం ఆరోగ్యానికి మంచిదేనా? ఒకసారి తెలుసుకుందాం..
పిల్లలకు కావాల్సిన పోషకాలు అన్నీ వాళ్లు తినే ఆహారం నుంచే అందుతుంది. అంతేతప్ప ఆరోగ్యంగా ఉన్న పిల్లలకు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు లేదా సిరప్ అందించడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పోషకాలు అందకపోతే.. పోషకాలు ఉండే ఆహారం పెట్టాలి. దీనికోసం మీ పిల్లలు క్రమం తప్పకుండా తింటున్నారా? వయసుకు తగ్గ బరువు పెరుగుతున్నాడా లేదా అనే విషయాలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.
ఒకవేళ రెగ్యులర్గా తింటున్నా కూడా.. తినే ఆహారంలో కావాల్సినన్ని పోషకాలు అందుతున్నాయా లేదా అనే విషయాలను కూడా నిర్ధరించుకోవాలి. సరైన పోషకాలు అందకపోతే.. పోషకాలు ఉండే ఆహారాన్ని పెడితే సరిపోతుంది. మరి అవసరమైతే డాక్టర్ సలహాతో మల్టీ విటమిన్లు , పోషకాల సప్లిమెంట్లను అందించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా పిల్లలకు సప్లిమెంట్లు ఇస్తే.. అవి విషపూరితమయ్యే అవకాశం ఉంది.
కేవలం పెరుగుదలలో ఆలస్యం, ఆహార అలర్జీ లేదా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారికి మాత్రమే వైద్యులు మల్టీ విటమిన్లు సిఫారసు చేస్తారు. కాబట్టి మీ పిల్లలకు పోషకాలన్నింటినీ ఆహారం ద్వారానే అందేలా చూసుకోవాలి. పిల్లల్లో సరైన పెరుగుదల, అభివృద్ధికి ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తోడ్పడుతుంది. జీర్ణవ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.