న్యూఢిల్లీ : ఓ యువకుడికి అరుదైన ఆటో- కిడ్నీ మార్పిడి సర్జరీని ఢిల్లీ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఎడమ మూత్ర నాళంలో రాయితో పాటు కిడ్నీ, మూత్రాశయాన్ని కలిపే పైపు సంబంధ సమస్యతో బాధపడుతూ పంజాబ్కు చెందిన రోగి (29) గత నెలలో సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు. మూత్ర నాళంలో రాయిని తీసేందుకు పంజాబ్లో వైద్యుడు ప్రయత్నించగా ఆ ప్రక్రియలో రాయితో పాటు 25-26 సెంటీమీటర్ల ఎడమ మూత్ర నాళం బయటకు వచ్చింది.
ఈ కేసులో అసాధారణంగా రోగి ఎడమ కిడ్నీ మూత్రాశయంతో కనెక్షన్ లేకుండా కనిపించడంతో ఆశ్చర్యపోయామని ఆపరేషన్ నిర్వహించిన సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ విపిన్ త్యాగి తెలిపారు. రోగి యువకుడి కావడంతో మూత్రాశయ పునర్నిర్మాణానికి ప్రేగు సరైన ప్రత్యామ్నాయం కాదని భావించామని, దీంతో తాము ఆటో-కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ మేలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఈ ప్రక్రియలో భాగంగా ఈ రోగిలో సాధారణ కిడ్నీని ఎడమ వైపు నుండి బయటకు తీసి, దానిని దగ్గరగా తీసుకురావడం కుడి వైపున మూత్రాశయం ఉదరం నుండి కుడి కాలు వరకు వెళ్ళే రక్త నాళాలతో దానిని కలిపేలా చేశామని తెలిపారు.
దీంతో రెండు కిడ్నీలు కుడి వైపున ఉన్నాయని చెప్పారు. పునర్నిర్మించిన ట్యూబ్ మూత్రాశయానికి కనెక్ట్ చేయడంతో మూత్ర పిండాలకు రక్త ప్రసరణ పునరుద్ధరణ జరిగి ఈ ట్యూబ్ ద్వారా మూత్రం బయటకు వచ్చిందని డాక్టర్ త్యాగి వివరించారు. రోగి కోలుకున్నాడని, అతడి రెండు కిడ్నీలు శరీరానికి కుడి భాగంలో బాగా పనిచేస్తున్నందున ఇటీవల డిశ్చార్జి చేశామని యూరాలజీ విభాగం కో చైర్పర్సన్ డాక్టర్ సుధీర్ చద్దా తెలిపారు.