న్యూఢిల్లీ : స్వీట్లు, తీపి పదార్దాలను అతిగా తీసుకుంటే ఆరోగ్యానికి (Health Tips) హానికరమని పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. మనం రోజూ తీసుకునే పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు, డైరీ ఉత్పత్తుల్లో సహజమైన చక్కెరలు ఉండగా, అదనంగా తీసుకునే షుగర్ ఊబకాయం, మధుమేహం, హృద్రోగాల వంటి పలు అనారోగ్యాల బారినపడే ముప్పు పెంచుతుంది. అధిక చక్కెరతో కూడిన ఆహారానికి, హృద్రోగ మరణాలకు సంబంధం ఉందని జామా ఇంటర్నల్ మెడిసిన్ 2014 అధ్యయనం వెల్లడించింది.
అధికంగా తీసుకునే చక్కెరలు శరీరంలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ను పెంచడంతో ఎంతోమంది భారతీయులు ప్రీడయాబెటిక్ స్టేజ్కు చేరుకుంటున్నారని గత అధ్యయనాలు వెల్లడించాయి. అందుకే మనం ఎందుకు తీపిపదార్ధాలను ఇష్టపడుతున్నాం..వాటిని ఎలా నియంత్రించాలనే దానిపై దృష్టిసారించాలి. ప్రేవుల్లో ఉండే బ్యాక్టీరియాలో సమతుల్యత లోపించడం వల్లే తీపి పదార్ధాలను తినాలనే కోరిక పెరుగుతుందని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలిజస్ట్ డాక్టర్ సౌరవ్ సేథి ఇన్స్టాగ్రాం పోస్ట్లో రాసుకొచ్చారు.
ఈ పరిస్ధితిని అధిగమించాలంటే ఫైబర్ అధికంగా ఉండే పండ్లు తీసుకోవాలని ఇవి ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చూస్తాయి. క్రమంగా ఈ అలవాటు తీపిపదార్ధాలపై మక్కువను అధిగమించేలా చేస్తుంది. యాపిల్స్, పియర్స్, అరటి, ఆరంజ్, కివీ, స్ట్రాబెర్రీస్, పీచ్, ప్లమ్స్, మామిడి, జామ, పుచ్చకాయ వంటి హై ఫైబర్ పండ్లను అధికంగా తీసుకోవాలని డాక్టర్ సేథీ చెబుతున్నారు. రిఫైన్డ్ షుగర్ను తప్పనిసరిగా తీసుకోవాలనుకుంటే రోజుకు ఆరు టీస్పూన్లు మించకుండా చూసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్ధ సూచిస్తోంది.
Read More :