న్యూఢిల్లీ : శరీరాన్ని వ్యాధుల బారినపడకుండా చూడటంతో పాటు ఇన్ఫ్లమేషన్తో పోరాడే గుణాలున్న యాంటీఆక్సిడెంట్స్ కోసం ఎక్కువమంది గ్రీన్ టీని సేవిస్తుంటారు. రోజుకు మూడు కప్పుల గ్రీన్ టీతో మెరుగైన ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చని పలు అధ్యయనాలూ వెల్లడించాయి. అయితే ఐదు పండ్లలో గ్రీన్ టీ కంటే అధికంగా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని డైటీషియన్లు చెబుతున్నారు. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయని మణిపాల్ హాస్పిటల్స్ చీఫ్ డైటీషియన్ ఇంద్రాణి ఘోష్ తెలిపారు.
ఆరంజ్, పసుపు, నీలం, ఎరుపు వంటి ముదురు రంగుల్లో ఉండే పండ్లలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయని ఆమె చెప్పుకొచ్చారు. బెర్రీస్లో యాంటీఆక్సిడెంట్లు గ్రీన్టీలో కంటే 14 రెట్లు అధికంగా ఉంటాయి. ప్రతి కప్పులో 37 మిల్లీగ్రాముల కేటచిన్స్ లభిస్తాయి. దానిమ్మ గింజలు యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియా గుణాలు కలిగిఉన్నాయి. గ్రీన్టీలో కంటే అధికంగా ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్తో ప్రేవుల ఆరోగ్యం మెరుగవడమే కాకుండా డీటాక్సిఫికేషన్కూ దోహదపడుతుంది. ఇక యాపిల్, జామ, ద్రాక్ష పండ్లలోనూ గ్రీన్ టీలో కంటే అధిక మోతాదులో యాంటీఆక్సిడెంట్స్ లభిస్తాయి.