న్యూఢిల్లీ : మండు వేసవి నుంచి వర్షాకాలంలోకి వచ్చే క్రమంలో సీజనల్ వ్యాధుల బారినపడకుండా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం ముఖ్యం. మెరుగైన ఇమ్యూనిటీని సొంతం చేసుకుని ఆరోగ్యంగా ఉండేందుకు మెరుగైన ఆహారం కీలకమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
వర్షాకాలంలో ఫ్లూ, జలుబు, అలర్జీలు వెంటాడే క్రమంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో పోషకాహారానికి దేశీ మొక్కజొన్నకు మించింది లేదని నిపుణులు చెబుతున్నారు. మొక్కజొన్న వర్షాకాలంలో సూపర్ ఫుడ్ వంటిదని సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుత దివాకర్ పేర్కొన్నారు.
ఈ సీజన్లో దేశీ మొక్కజొన్నతో పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. మొక్కజొన్నలో విటమిన్ బి, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండటంతో జుట్టుఉ ఒత్తుగా పెరుగుతుందని, దీనిలో ఉండే ఫైబర్తో మలబద్ధకం సమస్యలు తొలగిపోతాయని అన్నారు. దేశీ కార్న్తో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ను మెరుగ్గా నియంత్రించవచ్చని చెప్పారు. అమెరికన్ కార్న్, పాప్కార్న్ కంటే దేశీ కార్న్లోనే ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు దాగున్నాయని అన్నారు.