Dengue | సెప్టెంబర్ మధ్య నుంచి శీతాకాలం మొదలుకానున్నది. ఈ కాలంలో అనేక వ్యాధులు సోకే ప్రమాదం గణనీయంగా పెరిగే ప్రమాదం ఉంటుంది. ఈ సీజన్లో దోమల ద్వారా వ్యాధులు సంక్రమించే ప్రమాదం సాధారణమే అయినా.. డెంగీ, చికున్ గున్యాతో అప్రమత్తంగా ఉండాలి. వీటి బారినపడి ఏడాది ఎంతో మంత్రి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో డెంగీ పెరుగుతున్నట్లుగా గుర్తించారు. ఢిల్లీ, బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్లో వేలాది మంది డెంగీ బారినపడగా.. చాలా మంది ఆసుపత్రిల్లో చేరి చికిత్స తీసుకున్నారు.
పశ్చిమ బెంగాల్లో గత శుక్రవారం 500కుపైగా డెంగీ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. దీంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 584 మందికి బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం, ఆగస్టు 31 వరకు దేశంలో 30వేలకుపైగా డెంగీ కేసులు రికార్డయ్యాయి. ఏటా శీతాకాలంలో డెంగీ వైద్య, ఆరోగ్యశాఖకు పెను సవాల్ విసురుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. దోమల బెడదను నివారిస్తే.. డెంగీ ప్రమాదాన్ని చాలా వరకు నియంత్రించవచ్చని తెలిపారు.
ఏడిస్ దోమలు కుట్టడంతో డెంగీ జ్వరం వస్తుంది. ఈ దోమలు పగటి పూట ఎక్కువగా కుడుతాయి. దోమకాటు తర్వాత లక్షణాలు కనిపించడానికి 5-7 రోజులు పడుతుంది. డెంగీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వ్యక్తులు వివిధ రకాల ఇతర ఆరోగ్య సమస్యలతో పాటు 105 డిగ్రీలకు వరకు జ్వరం ఉంటుంది. డెంగీ లక్షణాలు ఇతర ఇతర అంటువ్యాధుల మాదిరిగానే ఉంటాయి.
డెంగీ సోకితే కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఈ మూడు ప్రధాన లక్షల ఆధారంగా డెంగీ బారినపడ్డామా? లేదా తెలుసుకోవచ్చు. డెంగీ సోకితే 104 ఫారెన్హీట్ వరకు జ్వరంతో పాటు తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనుక, కండరాలు, కీళ్లలో నొప్పి ఉంటుంది. కొంతమందికి వాంతులు, చర్మంపై దద్దుర్లు వస్తాయి. ఇన్ఫెక్షన్ పెరిగే కొద్దీ శ్వాస ఆడకపోవడం, చిగుళ్లు, ముక్కు నుంచి రక్తం కారడం, మలంలో రక్తం పడుతుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి సకాలంలో చికిత్స తీసుకోవాలి.
డెంగీ తీవ్రమైన సందర్భాల్లో లేదంటే.. సకాలంలో చికిత్స అందకపోయినా డెంగీ బాధితుడి రక్త ప్లేట్లెట్స్ కౌంట్ వేగంగా తగ్గతూ ఉంటుంది. ఒక సాధారణ వ్యక్తిలో మైక్రోలీటర్ రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య 1.50లక్షల నుంచి 2.50లక్షల మధ్య ఉంటుంది. దాదాపు 80 నుంచి 90శాతం మంది డెంగీ రోగుల్లో లక్ష, అంతకంటే తక్కువగా ఉంటుంది. 10 నుంచి 20 శాతం మంది రోగుల్లో 20వేల కంటే తక్కువగానూ ఉంటుంది. తీవ్రమైన పరిస్థితుల్లో రోగికి ప్లేట్లెట్స్ అవసరం అవుతాయి.
పెరుగుతున్న డెంగీ బారినపడకుండా రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ దోమల నుంచి తమను తాము రక్షించుకోవడం చాలా ముఖ్యం. దోమల నుంచి రక్షించుకోవడానికి శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. ఎక్కువగా దోమలు ఉండే ప్రాంతాలకు వెళ్లకపోవడం మంచిది. రాత్రి పడుకునే సమయంలో తప్పనిసరిగా దోమతెరలను వినియోగిస్తే మంచిది. ఎవరికైనా 3-4 రోజులు అధిక జ్వరం సమస్య ఉంటే.. వైద్యుడిని సంప్రదించి.. సలహా మేరకు రక్త పరీక్ష చేసుకుంటే సకాలంలో గుర్తించి, నివారణ చర్యలు తీసుకుంటే ప్రమాదం నుంచి బయటపడవచ్చు.