Health | ఇది సీతాఫలాల సీజన్. చాలా మందికి ఈ పండ్లంటే ఇష్టం. అలాంటివారు నచ్చినన్ని తినొచ్చా? వీటివల్ల గుండెల్లో శ్లేష్మంచేరుతుందంటారు నిజమేనా?ఈ పండులో పోషక విలువలు ఉన్నాయా? సీతాఫలం తినాలనిపిస్తే షుగర్ పేషెంట్లు ఏం చేయాలి?
– ఓ పాఠకురాలు
సీజనల్గా దొరికే ఏ పండు అయినా మంచిదే. ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేనివాళ్లు రోజూ ఒకటి రెండు సీతాఫలాలు చక్కగా తినొచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. ఇవి శరీరాన్ని యవ్వనంగా ఉంచేందుకు, రోగ నిరోధక శక్తిని బల పరిచేందుకు తోడ్పడతాయి. ఇందులోని అమైనో ఆమ్లాలు చర్మాన్ని తాజాగా, కాంతిమంతంగా ఉంచేందుకు సాయపడతాయి. విటమిన్-ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది. పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తాయి. ఈ పండులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మలేరియా, డెంగ్యూలాంటి జ్వరాలను దూరం పెడతాయి. ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది. గర్భాశయ ఆరోగ్యానికి సీతాఫలం ఎంతో మేలు చేస్తుంది.
గర్భిణులు క్రమం తప్పకుండా తీసుకుంటే కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది. ఫ్యాటీ లివర్లాంటి సమస్యలు ఉన్నవారికి సీతాఫలం మరీ మంచిది. ఇందులో క్యాన్సర్ను తగ్గించే గుణాలూ ఉన్నాయి. కడుపుబ్బరం, పులితేన్పుల లాంటి సమస్యల్ని అరికట్టి జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పార్కిన్సన్ వ్యాధి చికిత్సలోనూ పనికొస్తుందని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. ఇందులోని పోషకాలు పిల్లల ఎదుగుదలకు ఎంతగానో సహకరిస్తాయి.
షుగర్ పేషెంట్లు కూడా తప్పకుండా తీసుకోవచ్చు. కాలానుగుణంగా వచ్చే ఈ పండ్లలోని పోషక విలువలను పొందవచ్చు. అయితే మిగతా ఫలాలతో పోలిస్తే ఇందులో సహజ చక్కెరల శాతం కాస్త ఎక్కువ కాబట్టి, సీతాఫలం తినే రోజు మిగతా ఆహారాన్ని సరిచూసుకుంటే చాలు. వారానికి ఒక పండు వరకూ ఫర్వాలేదు. డైటీషియన్ను సంప్రదిస్తే మన ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈ పండును ఎలా, ఎంత తీసుకోవచ్చో చెబుతారు. ఇక, బరువు తగ్గాలనుకునేవారు మిగతా ఆహారంలో కేలరీలు తగ్గించుకున్నాకే తినాలి.
ఎందుకంటే ఇందులో ఎక్కువ మొత్తంలో కేలరీలు, కొంచెం కొవ్వులు ఉంటాయి. సీతాఫలం తింటే శ్లేష్మం చేరుతుందన్నది కేవలం అపోహే. అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు… ఏదైనా శ్రుతి మించకపోతే మంచిదే!
మయూరి ఆవుల
న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@gmail.com