Covid Risks | కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారు వివిధ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా శ్వాస సంబంధ సమస్యలతో సతమతమవుతున్నారు. దీనికి తోడుగా ఇప్పుడు మానసిక, నాడీ సంబంధ ప్రమాదాలు కూడా ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వైరస్ బారిన పడిన వారు సైకోసిస్, చిత్తవైకల్యం, బ్రెయిన్ ఫాగ్ వంటి మానసిక, నాడీ సంబంధ సమస్యల ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ విషయాన్ని యూకేలోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తేల్చారు. 1.25 లక్షల మందిపై జరిపిన అధ్యయనం నివేదిక ‘ది లాన్సెట్ సైకియాట్రీ జర్నల్’లో ప్రచురితమైంది.
కొవిడ్కు గురైన పెద్దవారిలో ఆందోళన, నిరాశకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నదని గుర్తించారు. అయితే, ఇది కొవిడ్16 ఇన్ఫెక్షన్ వచ్చిన రెండు నెలల్లోనే తగ్గిపోతుందని, రెండేండ్లలో ఇతర శ్వాసకోశ సమస్యల కంటే ఎక్కువ అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఈ వైరస్కు గురైన చిన్నారులు మూర్చ, మానసిక రుగ్మతలతో పాటు మరికొన్నింటితో బాధపడుతున్నారు. అయితే, కొవిడ్-19 తర్వాత రోగ నిర్ధారణ పెద్దవారిలో కంటే తక్కువగా ఉన్నదని వారు తెలిపారు.
వీరి నివేదిక ప్రకారం, ఆల్ఫా వేరియంట్లో డేల్టా వేరియంట్ కంటే ఎక్కువ సమస్యలు బయటపడ్డాయి. అయితే, ఓమిక్రాన్ వేరియంట్ డేల్టా మాదిరిగానే న్యూరోలాజికల్, సైకియాట్రిక్ రిస్క్లతో ముడిపడి ఉన్నది. కొవిడ్ బారిన పడి కోలుకున్న వారిలో మానసిక, నాడీ సంబంధ సమస్యలు రెండేండ్ల వరకు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ పాల్ హారిసన్ తెలిపారు. ఇలాంటి పరిస్థితులు ఎందుకు తలెత్తుతున్నాయని, నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై మరింత పరిశోధన జరగాల్సిన అవసరం ఉన్నదని ఈ అధ్యయనం స్పష్టం చేస్తున్నట్లు పాల్ హారిసన్ పేర్కొన్నారు.