Amarnath Yatra : హిందూ భక్తులు ఎదురుచూసిన అమర్నాథ్ యాత్ర శుక్రవారం ప్రారంభమైంది. ‘భం భం భోలే’, ‘హర హర మహాదేవ్’ అంటూ భక్తి నినాదాల మధ్య, భారీ భద్రత మధ్య ఘనంగా యాత్ర ప్రారంభమైంది. అమర్నాథ్ గుహలోని మంచు లింగానికి తొలి హారతి నిర్వహించారు. ఈ గుహకు జమ్మూ నుంచి మొదటి భక్తుల బృందాన్ని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. జూలై 3న ప్రారంభమైన ఈ యాత్ర 57 రోజులపాటు సాగుతుంది. రక్షా బంధన్ రోజైన ఆగష్టు 28న యాత్ర పూర్తవుతుంది.
భక్తుల భద్రత దృష్ట్యా, ఉగ్రదాడుల ముప్పు నేపథ్యంలో అధికారులు అమర్నాథ్ యాత్ర కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. యాత్ర సాగే మార్గంలో భారీగా భద్రతా దళాలు మోహరించాయి. సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీస్, ఇండియన్ ఆర్మీతోపాటు వివిధ బలగాలు ఇక్కడ భద్రత కల్పిస్తు్న్నాయి. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతరం భద్రతను పర్యవేక్షిస్తున్నారు. భక్తులు అమితమైన ఉత్సాహం, భక్తి పారవశ్యాల మధ్య మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ముందుకు సాగుతున్నారు. హిందూ విశ్వాసాల ప్రకారం ఆషాఢం, శ్రావణం (జూలై, ఆగష్టు) నెలల్లో అత్యంత భక్తి శ్రద్ధల మధ్య ఈ యాత్ర నిర్వహిస్తారు. ఈ రెండు నెలల కాలంలో వేలాది మంది భక్తులు మంచు లింగాన్ని దర్శించుకుంటారు. యాత్ర ప్రారంభమైన సందర్భంగా ప్రధాని మోదీ భక్తులకు లేఖ రాశారు.
ఇది దేశంలోని అత్యంత పవిత్రమైన యాత్రలలో ఒక్కటి అన్నారు. ఈ యాత్ర భక్తి, ఏకత్వం, శ్రద్ధకు ప్రతీకగా మోదీ పేర్కొన్నారు. ఈ యాత్ర చేసే భక్తులు ఐదు సంకల్పాల్ని పాటించాలన్నారు. అవి. యాత్ర పరిసర మార్గాల్లో పరిశుభ్రతను కాపాడటం, ట్రాఫిక్ రూల్స్, సెక్యూరిటీ రూల్స్ పాటించడం, దేశీయ ఉత్పత్తులనే వాడటం, యాత్ర తర్వాత తల్లి పేరుతో ఒక మొక్క నాటడం, దేశానికే మొదటి ప్రాధాన్యం అనే అంశాన్ని పాటించడం అంటూ మోదీ పేర్కొన్నారు.