వాతావరణంలో మార్పుల కారణంగా పాత వైరస్లు తిరగబడుతున్నాయి. రూపాంతరమూ చెందుతున్నాయి. దీనివల్ల రోగిలో కనిపించే లక్షణాలు, వ్యాధి తీవ్రతలో స్వల్ప తేడాలు ఉంటాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోనే కాదు.. ఇతర ప్రాంతాల్లోనూ ఫ్లూ సంబంధ వ్యాధులు విజృంభిస్తున్నాయి. మరికొన్ని చోట్ల డెంగీ, స్వైన్ఫ్లూ, టైఫాయిడ్ కేసులు నమోదు అవుతున్నాయి. బాధితులలో జలుబు, జ్వరం, ఒంటినొప్పులు, విరేచనాలు తదితర లక్షణాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం విజృంభిస్తున్న జబ్బులన్నీ పాతవే. కరోనా సమయంలో చాలామంది మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడటం, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం.. తదితర ఆరోగ్య నియమాలు కచ్చితంగా అనుసరించారు. దీనివల్ల ఆ రెండేండ్లలో సీజనల్ వైరస్లు దరిచేరలేదు. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో పాత నియమాలను పూర్తిగా మరిచిపోయారు జనం. అందులోనూ వానకాలం కావడంతో.. వాతావరణంలో మార్పులు, గాలిలో తేమ శాతం పెరగడం వల్ల వైరస్లు పుట్టుకొచ్చాయి. తేమ కారణంగా వైరస్లు వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్నాయి. అదనంగా దోమల వృద్ధి జరుగుతున్నది. దోమల వల్ల డెంగీ, చికున్ గున్యా, మలేరియా వంటి జ్వరాలు ప్రబలుతున్నాయి. ఇవి కాకుండా.. సాధారణంగా వానకాలంలో నీరు కలుషితమవుతుంది. దీనివల్ల గ్యాస్ట్రో వ్యాధులు, టైఫాయిడ్ జ్వరాల వంటివి నమోదు అవుతున్నాయి. ప్రస్తుత సీజన్లో వస్తున్న వ్యాధుల వల్ల పెద్దలకంటే పిల్లలే కొంత ఎక్కువ ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి.
ఇవీ వ్యాధులు
రెస్పిరేటరీ సిన్సిటల్ వైరస్ (ఆర్ఎస్వీ), ఇన్ఫ్లుయెంజా, ఇన్ఫ్లుయెంజా-ఏ (స్వైన్ ఫ్లూ), డెంగీ, చికున్ గున్యా, టైఫాయిడ్, మలేరియా, గ్యాస్ట్రోఎంటరైటిస్ రుగ్మతలు.
ఇన్ఫ్లుయెంజా లక్షణాలు
ముక్కు కారడం, జలుబు, ఒంటినొప్పులు.
డెంగీ లక్షణాలు
తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు, ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోవడం, నీరసం, పిల్లల శరీరంపై ఎర్రటి దద్దుర్లు.
గ్యాస్ట్రో, టైఫాయిడ్ లక్షణాలు
జ్వరం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి.
ఇదే ప్రధాన కారణం..
వాతావరణం తేమగా ఉన్నప్పుడు వైరస్ వ్యాప్తి ఎక్కువ. ప్రభావిత రోగి తుమ్మినప్పుడు కానీ, దగ్గినప్పుడు కానీ అతని నోటి తుంపర్ల నుంచి వచ్చే వైరస్ ఎక్కువ దూరం వ్యాప్తి చెందుతుంది. దీంతో వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. కాబట్టే, ఒక ఇంట్లో వైరల్ ఫీవర్ వస్తే.. ఆ ఇంట్లోవారితో పాటు పొరుగిళ్ల వారికీ గండమే.
చికిత్స
ఆర్ఎస్వీ, స్వైన్ఫ్లూ, డెంగీ వంటి వాటికి ప్రత్యేకమైన చికిత్స అంటూ లేదు. వ్యాధి లక్షణాల ఆధారంగా వైద్యం ఇస్తారు. కాకపోతే ఆయా వ్యాధులను సకాలంలో గుర్తించి, సరైన చికిత్స అందించాలి. ముఖ్యంగా రోగి రక్తపోటు పడిపోకుండా చూడాలి, తరచూ ద్రవపదార్థాలు అందించాలి.
జాగ్రత్తలు
ఆయుర్వేదంలో
సంప్రదాయ ఆయుర్వేద వైద్యంలోనూ విష జ్వరాలకు తగిన మందులు అందుబాటులో ఉన్నాయి.
ఆయుష్-64
ఆయుర్వేదంలోని ఆయుష్-64 అనే మాత్రలు విష జ్వరాలను సమర్థంగా అడ్డుకుంటాయి. వీటిని 4 రకాల
మూలికలతో తయారు చేస్తారు. ఈ మాత్రలు మలేరియా, డెంగీ, ఫ్లూ వంటి అన్ని రకాల విషజ్వరాలకు సంజీవని.
మహా సుదర్శన చూర్ణం
ఈ చూర్ణాన్ని ఉదయం, సాయంత్రం చొప్పున రోజు రెండు పూటలా గోరు వెచ్చని నీటితో తీసుకోవాలి. దీనివల్ల జ్వరం, జలుబు, దగ్గు తగ్గుతాయి.
టి.శ్రీనివాస్
ఆయుర్వేద వైద్యనిపుణులు, నిమ్స్ ఆయుష్ వెల్నెస్ సెంటర్
– డాక్టర్ శంకర్ సూపరింటెండెంట్ ఫీవర్ హాస్పిటల్ హైదరాబాద్