Chikungunya | చికున్గున్యా వ్యాధి.. ఫ్లావీ వైరస్ కారణంగా సంక్రమిస్తుంది. దీనినే చిక్ వైరస్ అని కూడా పిలుస్తుంటారు. ఈ వ్యాధి సోకిందంటే నరకప్రాయమే. ఈ వ్యాధిని తొలుత ఆఫ్రికాలోని టాంజానియాలో గుర్తించారు. ఎడిస్ ఈజిప్టి అనే దోమ కాటు వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. దోమ కుట్టిన 3-7 రోజుల మధ్య ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ఒకసారి ఈ వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తే చాలు కీళ్లు, కండరాల్లో తీవ్రమైన నొప్పి వస్తుంది. అలాగే జ్వరం కూడా ఉంటుంది. కొద్దిరోజుల్లో జ్వరం తగ్గిపోయినా కొళ్ల నొప్పులు మనల్ని నెలల తరబడి వేధిస్తుంటాయి.
వ్యాధి లక్షణాలు
50 ఏండ్ల వయసు దాటిన వారిలో ప్రత్యేకించి రోగ నిరోధక శక్తి తగ్గిపోయినవారిలోనే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి సోకినవారిలో కాళ్లు, చేతుల కీళ్లు నొప్పిగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కీళ్లలో వాపు కూడా వస్తుంది. ఈ నొప్పులు నాలుగైదు వారాలు మొదలు కొన్ని నెలల వరకు కొనసాగుతాయి. వైరస్ సోకిన మొదటి రోజుల్లో తీవ్రమైన తలనొప్పి కూడా ఉంటుంది. లింఫ్ నోడ్స్ వాపులకు గురవుతుంటాయి. లింఫ్ నోడ్స్ వాపులను ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. తీవ్ర అలసటగా ఉంటుంది. స్కిన్ రాషెస్ కనిపిస్తాయి. ఆకలి తగ్గిపోవడంతోపాటు వాంతి, వికారంగా ఉంటుంది.
చికిత్స
చికున్గన్యాకు ఇప్పటివరకు కచ్చితైమన చికిత్స ఏదీ అందుబాటులో లేదు. వైద్యులు జ్వరం తగ్గేందుకు మందులు ఇస్తున్నారు. ఇంటిపట్టున ఉండి శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండేందుకు ఎక్కువ మొత్తంలో నీరు, కొబ్బరినీరు తాగాలని సెలవిస్తున్నారు. అలాగే, ఇంట్లో వంటలకు వాడే మసాలా ధినుసులతో నొప్పులను తగ్గించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
ఆహారాలు
చికున్గున్యా సోకిన వారు ఎక్కువ మొత్తంలో ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. వేడి వేడి ఆహారాలను తినాలి. పండ్లు ఎక్కువగా తినాలి. పుల్లటి వస్తువులను దూరం పెట్టాలి. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లభించే ఆహారాలను తీసుకోవాలి. పాలకూర, మెంతి వంటి లీఫీ వెజిటెబుల్స్ తినాలి. విటమిన్ సీ ఉండే జామ, కివి, స్ట్రాబెర్రీ, ఆరెంజ్లతో పాటు యాపిల్స్, అరటిపండ్లు తింటూ ఇమ్యూనిటీని పెంచుకోవాలి.
కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు లవంగాల నూనె, వెల్లుల్లి పేస్ట్ను కీళ్లపై మర్ధన చేయాలి. ఎప్సమ్ సాల్ట్ను గోరువెచ్చటి నీటిలో వేసుకుని స్నానం చేయాలి. వేప ఆకులను వేసి మరిగించిన నీటితో కూడా స్నానం చేయడం మంచిది. జ్వరాన్ని తగ్గించి వ్యాధినిరోధకత వ్యవస్థ బలంగా మారడంలో సహాయపడే తులసి ఆకులను నమలడం కూడా ఉత్తమం.
కప్పు పాలు, 8 కప్పుల నీటిని కలిపి బాగా మరిగించి దానికి వెల్లుల్లి గుజ్జును కలిపి చల్లార్చాలి. తర్వాతా పరిగడుపున నిత్యం తాగాలి. అలాగే బొప్పాయి ఆకు రసాన్ని స్పూన్ తేనెతో కలిపి తీసుకోవడం కూడా ఉపశమనం కలుగుతుంది. ఇది వ్యాధినిరోధకతను కూడా పెంపొందిస్తుంది.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.