Chia Seeds | నేటి తరుణంలో ఆరోగ్యం మీద అవగాహన రావడంతో చాలా మంది విత్తనాలను ఆహారంగా తీసుకుంటున్నారు. విత్తనాలు చాలా మందికి ఇప్పుడు ఆరోగ్యకరమైన ఆహారంలో ముఖ్యమైన భాగంగా మారిపోయాయని చెప్పవచ్చు. చియా సీడ్స్ నుంచి గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ వరకు చాలామంది రోజూ తీసుకుంటున్నారు. వీటిలో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో శరీరానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. అయితే వీటిని సరైన సమయంలో, సరైన విధంగా తీసుకోకపోతే పూర్తి పోషకాలు శరీరానికి అందకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. చిన్న చిన్న మార్పులతోనే వీటి ప్రయోజనాలను మరింతగా పొందవచ్చని సూచిస్తున్నారు. ఏయే విత్తనాలను ఎలా, ఎప్పుడు తీసుకోవాలో వారు వివరిస్తున్నారు.
చియా సీడ్స్ ప్రస్తుతం ఎక్కువగా ఉపయోగిస్తున్న విత్తనాలలో ఒకటి. ఇవి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. ఇందులో ఉండే సొల్యూబుల్ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే రోజంతా రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇది శరీరంలో శక్తి సమతుల్యతకు, కొవ్వు తగ్గించుకోవడానికి తోడ్పడుతుంది. అలాగే చియా సీడ్స్ను నేరుగా తినడం కంటే ముందుగా నీటిలో నానబెట్టడం మంచిదని సూచిస్తున్నారు. ఒక గ్లాస్ నీటిలో వేసి కొంతసేపు ఉంచితే అవి విస్తరించి జెల్లా మారతాయి. ఆ తరువాత అదే నీటితో కలిసి తీసుకుంటే శరీరం పోషకాలను సులభంగా గ్రహిస్తుంది.
సన్ఫ్లవర్, గుమ్మడి విత్తనాలను చాలామంది ఎప్పుడైనా స్నాక్లా తింటుంటారు. అయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. మధ్యాహ్న భోజనంలో ఉండే మంచి కొవ్వులు ఈ విత్తనాల్లోని జింక్, మెగ్నీషియం వంటి ఖనిజాలను శరీరం బాగా గ్రహించేందుకు సహాయపడతాయి. ఈ విత్తనాలను తేలికగా డ్రై రోస్ట్ చేసి తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాటి పోషకాలు నిల్వ ఉండటమే కాకుండా జీర్ణం కావడం కూడా సులభమవుతుంది. అదే విధంగా బేసిల్ సీడ్స్ వేసవిలో ఎక్కువగా ఉపయోగపడే విత్తనాలుగా భావిస్తారు. ఇవి శరీరానికి చల్లదనాన్ని అందించడంలో సహాయపడతాయి. మధ్యాహ్న భోజనం ముందు, అంటే మిడ్ మార్నింగ్ సమయంలో తీసుకుంటే శరీరం పోషకాలను బాగా గ్రహిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడంలో కూడా బేసిల్ సీడ్స్ కూడా ఉపయోగపడతాయి. ఈ సీడ్స్ను కూడా ముందుగా నీటిలో నానబెట్టాలి. అవి విస్తరించిన తర్వాత తీసుకుంటే చల్లదనంతో పాటు హైడ్రేషన్ ప్రయోజనాలు మరింతగా అందుతాయి. విత్తనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినా, వాటిని ఎలా తీసుకుంటున్నామన్నది కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. సరైన సమయంలో తీసుకోవడం, కొన్ని విత్తనాలను నానబెట్టి తీసుకోవడం వల్ల ఫైబర్, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి మెరుగ్గా అందుతాయి. కాబట్టి ఇకపై విత్తనాలను తీసుకునేటప్పుడు సమయం, విధానం రెండింటినీ గమనిస్తే ఆరోగ్య ప్రయోజనాలు మరింతగా పొందవచ్చని వారు సూచిస్తున్నారు.