మహిళలను వెంటాడుతున్న క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) ఒకటి. మహిళా ప్రపంచాన్ని పీడిస్తున్న క్యాన్సర్లలో ఇది నాలుగోది. ఈ వ్యాధిని తొలి దశలోనే గుర్తించి, సరైన చికిత్సతో నివారించవచ్చు. ఈ రెండిటిలో ఏది ఆలస్యమైనా ప్రాణాంతకంగా పరిణమించవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ ముప్పుని టీకాతో ముందే తప్పించుకునేందుకు సిద్ధం కావొచ్చని సలహా ఇస్తున్నారు. సర్వైకల్ క్యాన్సర్ ఎలా వస్తుంది? ఈ వ్యాధి రాకుండా చేసేందుకు అందుబాటులో ఉన్న టీకాల గురించి నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
శరీర భాగాల్లో కణాలు అసాధారణంగా పెరిగిపోతూ ఇతర భాగాలకు వ్యాపించడాన్ని వైద్య పరిభాషలో ‘క్యాన్సర్’ అంటారు. గర్భాశయ ముఖద్వారంలో కణాలు అసాధారణంగా పెరగడాన్ని ‘సర్వైకల్ క్యాన్సర్’గా పరిగణిస్తారు. గర్భాశయ ముఖద్వారం నుంచి క్యాన్సర్ కణాలు ఇతర భాగాలకూ వ్యాపిస్తాయి. మొదట్లో వ్యాధి లక్షణాలు స్వల్పంగానే ఉంటాయి. కొన్నిసార్లు ఆ కొద్దిపాటి లక్షణాలు కూడా బయటపడకపోవచ్చు. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్, మూత్రంలో దుర్వాసన తదితర అస్పష్టమైన లక్షణాలను గమనించవచ్చు. అదనంగా వెన్నునొప్పి ఉంటుంది. కలయికకు ముందు లేదా తర్వాత రక్తస్రావం ఉంటుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) ఇన్ఫెక్షన్ కారణంగా వస్తుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు 90 శాతం ‘హెచ్పీవీ-16, హెచ్పీవీ-18’ వేరియెంట్ వైరస్ ఇన్ఫెక్షన్లే కారణం. హెచ్పీవీ ఇన్ఫెక్షన్ బారినపడ్డ మహిళలలో సహజంగా ఉండే వ్యాధి నిరోధకత కారణంగా కొన్నిసార్లు క్యాన్సర్ లక్షణాలు వాటంతట అవే తగ్గుతాయి.
గర్భాశయాన్ని స్క్రీనింగ్ చేయడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ ఉన్నదీ లేనిదీ గుర్తించవచ్చు. ఒకవేళ వ్యాధి ఉంటే ఎంతమేరకు విస్తరించిందో కూడా నిర్ధారించవచ్చు. క్యాన్సర్కు ముందస్తు దశ ఎక్కువ కాలంపాటు ఉంటే… సర్వైకల్ క్యాన్సర్ వల్ల తీవ్ర అనారోగ్యం పాలవుతారు. చివరికి మరణం సంభవిస్తుంది. తొలి దశలోనే వ్యాధిని గుర్తిస్తే.. పరిస్థితి విషమించకుండా ప్రాణాలను కాపాడుకోవచ్చు.
సర్వైకల్ క్యాన్సర్ను ‘పాప్ స్మియర్’ పరీక్ష చేసి గుర్తిస్తారు. దీని కోసం గర్భాశయం నుంచి కణజాలాన్ని సేకరిస్తారు. ఈ పరీక్షలో పొరపాట్లకు ఆస్కారముంది. కొన్నిసార్లు తప్పుగా ‘పాజిటివ్’ రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి బయాప్సీ పరీక్ష ద్వారా కచ్చితమైన నిర్ధారణ చేయవచ్చు. ఈ రెండు పరీక్షలే కాకుండా ఎసిటిక్ ఆమ్లం, ల్యూగోల్స్ అయోడిన్ తదితర చవకైన పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్ ఏ మేరకు విస్తరించిందో తెలుసుకోవడానికి మాత్రం హిస్టోపాథలాజికల్ పరీక్ష చేస్తారు. సర్వైకల్ క్యాన్సర్ తొలి దశలో ఉన్నప్పుడు సర్జరీతో నయం చేయవచ్చు. కీమోథెరపీ, రేడియో థెరపీ కూడా అవసరమవుతాయి. తొలి దశలో గుర్తించి, చికిత్స చేస్తే వ్యాధి నివారణ సులువు. చికిత్సకు ఖర్చు కూడా తక్కువే అవుతుంది. వ్యాధి ముదిరేకొద్దీ చికిత్సా కాలం కూడా పెరుగుతుంది. దీర్ఘకాలిక చికిత్స వల్ల వైద్యానికి ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది.

సర్వైకల్ క్యాన్సర్ని 2050 నాటికి నిర్మూలించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఒక వ్యూహం రూపొందించింది. 15 ఏండ్ల వయసు కలిగిన బాలికల్లో 90 శాతం మందికి వ్యాక్సిన్లు వేయడం, 35 ఏండ్ల వయసు దాటిన మహిళల్లో 70 శాతం మందికి సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం ద్వారా సర్వైకల్ ముప్పుని అధిగమించాలని కార్యాచరణ ప్రకటించింది. సర్వైకల్ క్యాన్సర్కు కారణమయ్యే ఇన్ఫెక్షన్లలో ప్రధానమైన రెండు హెచ్పీవీ వేరియెంట్లకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ల వల్ల 90 శాతం రక్షణ లభిస్తుంది. మిగతా పదిశాతం రక్షణ కోసం సురక్షిత లైంగిక విధానాలను పాటించాలి. తరచూ స్క్రీనింగ్ చేయించుకోవాలి. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఖరీదైనది కావడం కూడా ఒక సమస్యగా గుర్తించి, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో కలిసి ‘సర్వివాక్’ పేరుతో దేశీయ టీకాను అభివృద్ధి చేసింది. తొమ్మిది నుంచి పదిహేనేండ్ల బాలికలకు ఈ టీకా ఇస్తే హ్యూమన్ పాపిల్లోమా వైరస్కు 1000 రెట్ల యాంటి బాడీస్ ఉత్పత్తి అవుతాయి. ఆ వైరస్ల బారినపడినప్పుడు వ్యాధి నిరోధక వ్యవస్థ గరిష్ఠ ప్రభావం చూపుతుంది. అందువల్ల హెచ్పీవీ ఇన్ఫెక్షన్ బారినపడరు. కాబట్టి సర్వైకల్ క్యాన్సర్ ప్రమాదం తప్పుతుంది. సురక్షిత శృంగారానికి పరిమితమై, విశృంఖల లైంగిక సంబంధాలకు దూరంగా ఉంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ బారినపడరు. సర్వైకల్ క్యాన్సర్ ముప్పు ఉండదు.
క్యాన్సర్ బాధిత మహిళల మరణాల్లో సర్వైకల్ క్యాన్సర్ది నాలుగో స్థానం. మన దేశంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వేగంగా విస్తరిస్తున్నది. ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక మహిళ ఈ క్యాన్సర్తో మరణిస్తున్నది. ‘గ్లోబోకాన్-2020’ నివేదిక ప్రకారం.. భారత దేశంలో క్యాన్సర్ మృతుల్లో 18.3 శాతం మంది సర్వైకల్ క్యాన్సరే కారణం. క్యాన్సర్ బాధిత మహిళల్లో 6.29 శాతం మంది సర్వైకల్ క్యాన్సర్ పీడితులున్నారు. ప్రతి లక్ష మందిలో 18 మంది ఈ వ్యాధితో మరణిస్తున్నారు. అన్ని వయసులలోనూ పరిగణనలోకి తీసుకుంటే లక్ష మందిలో 422.82 మంది సర్వైకల్ క్యాన్సర్తో మరణిస్తున్నారు. అయితే, 60 శాతం మందిలో సర్వైకల్ క్యాన్సర్లని చివరి దశలో గుర్తిస్తున్నారు.