ఎర్రగడ్డ, మే 25: నగరంలో చాలా కుటుంబాలు చిన్నచిన్న అద్దె గదుల్లో నివాసం ఉంటాయి.. ఈ కుటుంబాల్లో ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే.. ఆ కుటుంబ సభ్యులతో కాంటాక్ట్ కాకుండా విడిగా హోం క్వారంటైన్లో ఉండటం కష్టం.. అలాగే పేదలు కూడా హోం క్వారంటైన్లో ఉండాలంటే సాధ్యపడదు.. ఇలాంటి వారికి ఉచితంగా ఐసొలేషన్ వసతి కల్పించడానికి నాట్కో ట్రస్టు ముందుకు వచ్చింది. సీఐఐతో కలిసి నాట్కో ట్రస్టు 40 పడకల ఐసొలేషన్ కేంద్రాన్ని బోరబండలో ఏర్పాటు చేసింది. బోరబండ డివిజన్, పెద్దమ్మనగర్లోని నాట్కో ప్రభుత్వ పాఠశాల ప్రైమరీ విభాగం భవనంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మాజీ డిప్యూటీ మేయర్.. ప్రస్తుత కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్తో కలిసి ప్రారంభించారు. బల్దియా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షణలో ఈ ఐసొలేషన్ కేంద్రం పని చేస్తుంది. ఈ సందర్భంగా మాగంటి గోపీనాథ్, బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ.. కొవిడ్ రోగులకు సేవలను అందించడానికి ముందుకు వచ్చిన నాట్కో సంస్థకు ఇక్కడి ప్రజలు రుణపడి ఉంటారన్నారు. కొవిడ్ రోగులకు సేవలను అందించడానికి సిద్ధమైన వైద్యులు, నర్సులు, వలంటీర్లకు సెల్యూట్ అని అన్నారు. కార్యక్రమంలో బల్దియా డిప్యూటీ కమిషనర్ రమేశ్, నాట్కో ట్రస్టు మేనేజర్ రాంబాబు, సీఐఐ ప్రతినిధి సుభ్జిత్, డాక్టర్ జువేరియాబేగం, డాక్టర్ సుమయ్య, టీఆర్ఎస్ నేతలు కృష్ణమోహన్, విజయ్కుమార్, లక్ష్మణ్గౌడ్, ఏడీ మధు, రమేశ్నాయక్ తదితరులు పాల్గొన్నారు.