న్యూఢిల్లీ : భారత్లో సరికొత్త కొవిడ్ స్ట్రెయిన్ జేఎన్.1 సబ్ వేరియంట్ బయటపడటంతో కరోనా కేసులు మళ్లీ ప్రబలుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి ముందస్తు జాగ్రత్తలతో వైరస్ బారినపడకుండా చూసుకోవడం ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ మెరుగుపరుచుకోవాలని జీవనశైలి నిపుణులు డాక్టర్ అక్షత్ చద్దా చెబుతున్నారు. వైరస్, ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఊపిరితిత్తుల ఆరోగ్యం బలోపేతం కోసం ప్రభావవంతమైన ఏబీసీడీ ఫుడ్స్ (ABCD Foods) తీసుకోవాలని ఇన్స్టా వేదికగా ఆయన వెల్లడించారు.
ఏ – యాపిల్, ఆమ్లా
ఊపిరితిత్తుల ఆరోగ్యానికి యాపిల్స్ అద్భుతంగా పనిచేస్తాయని జాన్స్ హాప్కిన్స్ బ్లూంబర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చేపట్టిన అధ్యయనం వెల్లడించింది. యాపిల్స్, టమాటాలు, పండ్లలో ఉండే ప్రత్యేక పదార్ధం పదేండ్ల కాలంలో లంగ్స్ పనితీరు సహజంగా తగ్గడాన్ని నెమ్మదింపచేసిందని పరిశోధకులు గుర్తించారు. ఇక టానిన్స్, పాలోపెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్, విటమిన్ సీ అధికంగా ఉండే ఉసిరి ఆరోగ్యానికి, ఊపరితిత్తుల ఆరోగ్యానికి మెరుగైనదని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
బీ- బీట్రూట్, బ్రకోలి
ఊపిరితిత్తులకు మేలు చేసే మరో ఆరోగ్యకరమైన కూరగాయగా బీట్రూట్, బ్రకోలి ముందువరసలో నిలుస్తాయి. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడే వారిలో బీట్రూట్ జ్యూస్ సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా వారి ఫిట్నెస్ మెరుగుపడిందని యూరోపియన్ రెస్పిరేటరీ జర్నల్లో ప్రచురితమైన తాజా అధ్యయనం పేర్కొంది.
సీ- క్యారెట్, క్యాబేజీ
క్యారెట్, క్యాబేజీ ఊపరితిత్తుల సామర్ధ్యాన్ని పెంచుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. వారానికి ఒకసారి క్యారెట్ తీసుకునే వారికి లంగ్ క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉంటుందని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎపిడెమాలజీలో ప్రచురితమైన అధ్యయనం తెలిపింది.
డీ- డార్క్ గ్రీన్ ఆకు కూరలు
హృద్రోగ, ఊపిరితిత్తుల వ్యాధుల బారినపడే ముప్పు తగ్గించుకునేందుకు పాలకూర, తోటకూర, మెంతికూర వంటి తాజా ఆకుకూరలను అధికంగా తీసుకోవాలి. ఈ పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగంగా తీసుకోవడంతో పాటు రోజూ ఉదయాన్నే గోరు వెచ్చని నీటిని తాగాలని డాక్టర్ చద్దా చెబుతున్నారు.