లండన్ : రక్తాన్ని పలుచబరిచే బ్లడ్ థిన్నర్స్ను వాడే కొవిడ్-19 రోగుల్లో మరణాల ముప్పు 50 శాతం, దవాఖానల బారినపడే అవకాశం 43 శాతం తక్కువగా ఉంటుందని లాన్సెట్ ఈక్లినికల్ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం స్పష్టం చేసింది. అమెరికాలోని 12 దవాఖానలు, 60 క్లినిక్స్లో గత ఏడాది మార్చి 4 నుంచి ఆగస్ట్ 27 మధ్య కరోనా సోకిన 6,195 మందిపై నిర్వహించిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. దవాఖానలో చేరిన రోగుల్లో బ్లడ్ క్లాట్స్ నిరోధించడానికి వాడే యాంటీకోగ్యులేషన్ చికిత్సకు మరణాల ముప్పునకు మధ్య ఉండే సంబంధాన్ని పరిశోధకులు అంచనా వేశారు.
కొవిడ్-19 సోకక ముందు బ్లడ్ థిన్నర్స్ వాడే రోగుల్లో వయసు, ఇతర అనారోగ్యాలు వెంటాడినా కరోనా కారణంగా దవాఖానలో చేరే ముప్పు ఇతరులతో పోలిస్తే 43 శాతం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ముందునుంచి బ్లడ్ థిన్నర్స్ వాడే వారితో పాటు వైరస్ చికిత్స కోసం దవాఖానలో చేరిన తర్వాత వీటిని వాడిన వారిలో మరణాలు సగానికి తగ్గాయని పరిశోధకులు వెల్లడించారు. దవాఖానలో చేరిన కొవిడ్-19 రోగులకు బ్లడ్ థిన్నర్స్ వాడటం ద్వారా మెరుగైన ప్రయోజనాలు దక్కాయని పరిశోధకులు పేర్కొన్నారు.
కొవిడ్-19 బారినపడిన వారిలో పలువురిలో వాపు కారణంగా అసాధారణ బ్లడ్ క్లాట్స్ ఏర్పడ్డయని దీంతో తీవ్ర అనారోగ్యం పాలవడం, మరణాలకు దారితీసిందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసొట అసిస్టెంట్ ప్రొఫెసర్, అధ్యయన రచయిత సమే హొజయెన్ పేర్కొన్నారు.