పరిగి, ఏప్రిల్ 5 : ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి మార్కెటింగ్ సదుపాయాలు, మహిళల అభిరుచికి అనుగుణంగా వారికి చేయూత అందించేందుకు సర్కారు నిర్ణయించింది. ఈ సంవత్సరం కొత్త పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇందులోభాగంగా వికారాబాద్ జిల్లా పరిధిలో 1900 మంది మహిళలకు ఈ కార్యక్రమం ద్వారా సర్కారు చేయూత అందించనుంది. ఇందుకు సంబంధించి ప్రతి గ్రామం నుంచి స్వయం సహాయక సంఘాల మహిళల ఎంపిక కార్యక్రమం కొనసాగుతున్నది. ఎంపిక అనంతరం మహిళల అభిరుచికి తోడు ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేయబోయే యూనిట్లు పూర్తిస్థాయిలో నడిచే అవకాశమున్నదా అని సర్వే నిర్వహించి.. బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించడం ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదుగడానికి సర్కారు తోడ్పాటు అందిస్తుంది. ఆయా గ్రామాల పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాటు చేయబోయే యూనిట్ల నిర్వహణకు అవసరమైన అవగాహన కోసం ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తారు.
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు సర్కారు తీసుకువస్తున్న సరికొత్త పథకంలో భాగంగా వికారాబాద్ జిల్లా పరిధిలో 1800 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు తోడ్పాటు అందించనున్నారు. జిల్లాలో 11,500 స్వయం సహాయక సంఘాలుండగా లక్షా10వేల మంది సభ్యులున్నారు. జిల్లాలో 647 గ్రామ సంఘాలున్నాయి. ప్రతి గ్రామ సంఘం నుంచి ముగ్గురు మహిళలను ఈ పథకానికి ఎంపిక చేస్తున్నారు. అధిక సంఖ్యలో మహిళలు ముందుకు వస్తే 5 మంది వరకు ఎంపిక చేయనున్నారు. మరింత ఎక్కువ మంది పోటీపడితే ఆయా గ్రామ సంఘాలు 3 నుంచి 5 మందిని ఎంపిక చేస్తాయి. తద్వారా జిల్లాలో 1900 నుంచి సుమారు 2వేల మంది మహిళలకు అవకాశం కల్పించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. మహిళల ఎంపిక కార్యక్రమం ప్రతి గ్రామంలో కొనసాగుతున్నది. అక్కడున్న మార్కెటింగ్ సదుపాయానికి అనుగుణంగా వారి ఎంపిక జరుగుతుంది.
శిక్షణతోపాటు రుణ సదుపాయం..
జిల్లాలోని ప్రతి గ్రామ సంఘం నుంచి ముగ్గురు లేదా ఐదుగురు మహిళలను ఎంపిక చేసిన తర్వాత వారు ఎంచుకున్న వ్యాపార రంగంలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ప్రధానంగా ఆయా గ్రామాల జనాభా, మార్కెటింగ్ సదుపాయం, వ్యాపార లావాదేవీలపై పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించి, ఏ వ్యాపారం నిర్వహిస్తే సదరు గ్రామంలో గిరాకీ ఉంటుందనేది తేల్చనున్నారు. ఏ వ్యాపారం బాగుంటుందనే అంశంతోపాటు ఎంపిక చేసిన మహిళల అర్హత, అభిరుచికనుగుణంగా వ్యాపార యూనిట్ల ఎంపిక జరుగుతుంది. కూరగాయలు, కిరాణం, చెప్పుల దుకాణం, ఫ్లోర్మిల్, స్టేషనరీ, ఇతర అనేక రకాలైన వ్యాపారాలపై ప్రత్యేక సర్వే జరిపి ఆయా గ్రామాల పరిస్థితులకనుగుణంగా యూనిట్ల ఏర్పాటు నిర్ణయిస్తారు. తద్వారా ఏర్పాటు చేయబోయే ప్రతి యూనిట్ ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదుగాలన్నది సర్కారు ప్రధాన ఉద్దేశం. ఎంపిక పూర్తయిన తర్వాత ప్రతి 25 మంది మహిళలకు ఒక జట్టుగా ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తారు.
నిఫ్ట్ ఆధ్వర్యంలో శిక్షణా తరగతుల నిర్వహణకు సర్కారు ఏర్పాట్లు చేస్తున్నది. తద్వారా వారికి వ్యాపారంపై పూర్తిస్థాయిలో అవగాహన కలుగుతుంది. ఏర్పాటు చేయబోయే యూనిట్కు సంబంధించి డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్(డీపీఆర్) తయారుచేస్తారు. దీంతో ఏర్పాటు చేయబోయే యూనిట్కు ఎంత ఖర్చవుతుంది అంచనా వేస్తారు. అనంతరం ఆయా మండలాల్లోని బ్యాంకుల ద్వారా మహిళలకు నేరుగా రుణాలు ఇప్పించేందుకు సెర్ప్ అధికారులు కృషి చేస్తారు. వ్యాపార నైపుణ్యాలు అభివృద్ధి చెందడానికి శిక్షణ ఇవ్వడం వల్ల మహిళలు ఏర్పాటు చేసే యూనిట్లు విజయవంతంగా నడిచేందుకు అవకాశం కలుగుతుంది. ఈ కొత్త పథకం ద్వారా రాబోయే రెండు సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో మహిళలు ఆర్థికంగా ఎదుగడానికి సర్కారు చర్యలు తీసుకుంది. సాధ్యమైనంత త్వరగా ఎంపిక కార్యక్రమం పూర్తిచేసి మిగతా శిక్షణ, రుణ సదుపాయం కల్పించే దిశగా అధికారులు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నారు.
1900 మంది మహిళల ఎంపిక
ఇవీ కూడా చదవండి…
టీఆర్ఎస్ నేతను పరామర్శించిన మంత్రి కొప్పుల
రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలి