అవయవాల పనితీరు తెలుసుకోవడం అంత తేలికైన విషయం కాదు. కాలేయం, గుండె లాంటివి ఎలా పనిచేస్తున్నాయో గమనించాలంటే.. ఆధునిక యంత్రాలు ఉండాలి. గంటలకొద్దీ ఆసుపత్రిలోనే గడపాలి. ఖర్చు సంగతి సరేసరి. ఇవేం అవసరం లేకుండా… ఒక స్టాంపులాంటిది అతికిస్తే ఎలా ఉంటుంది? అసాధ్యమని అనుకున్న ఈ విషయాన్ని అక్షరాలా నిరూపించారు మసాచుసెట్స్ పరిశోధకులు. పోస్టల్ స్టాంపు ఆకారంలో ఉండే ఈ పరికరాన్ని ఒంటికి అంటిస్తే చాలు. అదే సూక్ష్మమైన శబ్ద తరంగాలను పంపుతుంది. వెనక్కి వచ్చే ప్రతిధ్వనిని దూరంగా ఉన్న పరికరాలు అందుకుని, లోతుగా విశ్లేషించి అవయవాల నిర్మాణాన్ని, పనితీరును నలభై ఎనిమిది గంటల్లో అంచనా వేస్తాయి. కండరాల పటుత్వాన్ని, రక్త ప్రసరణనూ బేరీజు వేయగలదీ పరికరం.
స్మార్ట్ఫోన్ X మైండ్
స్మార్ట్ఫోన్ మీద ఎక్కువగా ఆధార పడటం వల్ల మన ఆలోచన తీరు, జ్ఞాపకశక్తి మందగిస్తున్నాయని చాలామంది చెబుతున్నారు. దీనికి ‘డిజిటల్ డిమెన్షియా’ అని పేరు పెట్టారు. కానీ స్మార్ట్ఫోన్ల వల్ల మరీ అంత ప్రమాదం లేదనీ, పైగా మంచి జరిగే అవకాశమూ లేకపోలేదని అంటున్నారు లండన్ పరిశోధకులు. ఈ విషయాన్ని నిరూపించేందుకు 18 నుంచి 71 సంవత్సరాల వయసు కలిగిన 158 మందిని ఎంచుకున్నారు. వీళ్లకు అంకెలను గుర్తు చేసుకునే పరీక్ష పెట్టారు. వాటిలో కొన్ని జవాబులను గుర్తుంచుకోమనీ, మరి కొన్నిటిని స్మార్ట్ఫోన్లలో నమోదు చేసుకోమనీ సూచించారు. అనూహ్యంగా ఈ రెండు రకాల అంకెలనూ వీరు గుర్తుంచుకోగలిగారు. స్మార్ట్ఫోన్ల వాడకం వల్ల జ్ఞాపకశక్తి తగ్గడం లేదని నిర్ధారించారు.
యాంటీ అలర్జీలు
వైద్యం అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొత్త చికిత్సలు పెరుగుతున్నాయి. దాంతోపాటే భయాలూ పెరుగుతున్నాయి. మరోవైపు రోగ నిరోధక శక్తి తగ్గుతున్నది. మనిషికి తగినన్ని పోషకాలు లభించడం లేదు. ఇదంతా ఎందుకంటే?.. ఇప్పటి పిల్లలకు ఏమాత్రం అనారోగ్యం కలిగినా వెంటనే యాంటీబయాటిక్స్ వాడటం పరిపాటి అయిపోయింది. కానీ వీటి చెడు ప్రభావాలు దీర్ఘకాలం ఉంటాయని అంటున్నారు అమెరికన్ పరిశోధకులు. యాంటీబయాటిక్స్ వల్ల జీర్ణాశయంలో ఉండే మంచి బ్యాక్టీరియా చనిపోతుందని తెలిసిందే. ఫలితంగా భవిష్యత్తులో ఆస్తమా, అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని నిరూపించేందుకు కొన్ని ఎలుకలకు మనం తరచూ వాడే అజిత్రోమైసిన్, అమోక్సిసిలిన్ ఇచ్చారు. తర్వాత వాటిలో అలర్జీ, ఆస్తమా త్వరగా రావడాన్ని గమనించారు. ఈ తీరు గమనించాక… మరీ అవసరమైతే తప్ప యాంటీ బయాటిక్స్ జోలికి పోవద్దని సూచిస్తున్నారు.
పగటి నిద్ర గుండెకు చేటు
పగటి నిద్ర పనికే కాదు, గుండెకు కూడా చేటేనని చెబుతున్నారు పరి శోధకులు. చాలామందికి మధ్యాహ్నం పూట కాసేపు కునుకు తీసే అలవాటు ఉంటుంది. ఇది ఏమంత ప్రమాదకరం కాకపోయినా… రకరకాల ఆరోగ్య సమస్యలను సూచిస్తుందని అనుకునేవారు అప్పట్లో. మద్యం, సిగరెట్, గురకపెట్టడం, నిద్రలేమి లాంటి సమస్యల వల్ల రాత్రి సరిగా నిద్రపట్టక, పగలు పడుకోవాల్సి ఉంటుందని నమ్మేవారు. కానీ పగటి నిద్రవల్ల రక్తపోటు, గుండెజబ్బు సమస్యలు వస్తాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పరిశోధకులు తాజాగా వెల్లడించారు. దాదాపు అయిదు లక్షలమంది జీవనశైలిని, పదకొండేండ్ల పాటు గమనించాక తేల్చిన విషయమిది. పగటి వేళల్లో తరచూ నిద్రపోయేవారిలో అధిక రక్తపోటుకు 12 శాతం ఆస్కారం ఉండగా, గుండెపోటు వచ్చే అవకాశం 24 శాతం మేర ఎక్కువని తేలింది.