న్యూఢిల్లీ : ఆధునిక జీవితంలో దాదాపు ప్రతి ఒక్కరూ గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలతో బాధపడుతున్నారు. అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం, అస్తవ్యస్త జీవనశైలితో అజీర్తి, ఛాతీలో మంట వంటి వ్యాధులు వెంటాడుతున్నాయి. కడుపు నిండినట్టుగా ఉండటం, కడుపు ఉబ్బరం , త్రేన్పులు వంటి లక్షణాలు పలువురిలో కనిపిస్తున్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ దిక్స భవసర్ సవలియ చెబుతున్నారు.
మూడు సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చని ఆమె సూచిస్తున్నారు. నాణ్యత లేని ఆహారం ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్తి, కడుపుబ్బరం సమస్యలు వేధిస్తాయని, టీనేజర్ల నుంచి పెద్దవారి వరకూ ఈ సమస్య ఉంటుందని చెప్పుకొచ్చారు. ఒత్తిడి, శారీరక వ్యాయామం కొరవడటంతో ఇవి వెంటాడతాయని ఆమె రాసుకొచ్చారు.
ఉదయాన్నేధనియాల టీ తాగడం ద్వారా అజీర్తి, కడుపుబ్బరం, గ్యాస్ సమస్యల నుంచి బయటపడవచ్చని అన్నారు. ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ ధనియాలు, కొద్దిగా పుదీనా ఆకులు, కరివేపాకు కలిపి 5 నిమిషాల పాటు మరిగించి ఆపై తాగాలి. ఇక భోజనానంతరం ఒక స్పూన్ సోంపు తీసుకోవాలి. రాత్రి భోజనం తర్వాత రోజ్ వాటర్ తీసుకోవాలి. ఒక కప్పు నీటిని మూడు నిమిషాల పాటు మరిగించి కొన్ని గులాబీ రేకులను వేసి ఐదు నిమిషాల తర్వాత నిద్రించేందుకు అరగంట ముందు రోజ్ టీ తీసుకోవాలి.