డయాబెటీస్తో బాధపడుతున్నవారు రాత్రి వేళలో తీసుకునే ఆహారాలు వారి జీవితకాలంపై ప్రభావం చూపుతాయి. ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా జీవించాలని కోరుకునే వారు కొన్ని రకాల ఆహారాలను రాత్రి వేళ దూరం పెట్టడం మంచిదంటున్నారు చైనా పరిశోధకులు. వీరి అధ్యయన ఫలితాలు ‘ది జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం’ అనే పత్రికలో ప్రచురితమైంది. నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే నుంచి మధుమేహం ఉన్న 4,642 మంది డాటాను వీరు విశ్లేషించారు. వారిలో గుండె జబ్బుతో మరణించే ప్రమాదాన్ని కూడా పరిశోధకులు గుర్తించారు.
వీరి అధ్యయనం ప్రకారం.. ఆహారం తీసుకునే సమయాలు మన శరీర జీవ గడియారానికి అనుగుణంగా ఉండాలి. ఇది సహజసిద్ధమైన అంతర్గత ప్రక్రియ. ఈ ప్రక్రియ మన నిద్రపోయే, మేల్కొని ఉండే చక్రాన్ని నియంత్రిస్తుంది. ప్రతి 24 గంటలకు ఒకసారి ఈ సైకిల్ పునరావృతమవుతుంది. కొన్ని రకాల ఆహారాలను రోజులో వేర్వేరు సమయాల్లో తీసుకోవడం వల్ల మధుమేహుల్లో ఆరోగ్య ఫలితాలు మెరుగుపడతాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం బంగాళదుంపలు లేదా పిండి కూరగాయలు, మధ్యాహ్నం తృణధాన్యాలు, సాయంత్రం ఆకుకూరలు, బ్రోకలీ, పాలు వంటివాటితోపాటు ముదురు రంగుల్లో ఉండే కూరగాయలు తినడం వల్ల గుండె జబ్బులతో మరణించే అవకాశం తక్కువగా ఉంటుందని వారు గుర్తించారు. సాయంత్రం వేళల్లో ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తిన్న వారు గుండె జబ్బులతో మరణించే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పోషకాహార మార్గదర్శకాలతో పాటు సరైన ఆహార సమయాలను అలవర్చుకోవడం కూడా చాలా ముఖ్యమే అని పరిశోధన నిర్వహించిన చైనాలోని హర్బిన్ మెడికల్ యూనివర్శిటీకి చెందిన వైద్యుడు కింగ్రావో సాంగ్ పేర్కొన్నారు.