Anemia | ప్రపంచవ్యాప్తంగా అనీమియా పెద్ద సమస్యగా మారింది. ప్రత్యేకంగా భారతీయ మహిళల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తోంది. నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే (NFHS-5) 2019–21 నివేదిక ప్రకారం.. 15-49 ఏళ్ల వయస్సున్న భారతీయ మహిళలలో సుమారు 57 శాతం అనీమియాతో బాధపడుతున్నారని తెలుస్తోంది. అంటే ప్రతి 10 మహిళల్లో 6 మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. గర్భిణుల్లో ఈ సంఖ్య సుమారు 52 శాతంగా ఉంది. అదేవిధంగా 15-19 ఏళ్ల యువతిలోనూ సగటున సగానికిపైగానే ఈ సమస్యతో బాధపడుతున్నట్లుగా గణాంకాలు పేర్కొంటున్నాయి.
అనీమియా అంటే రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం. హిమోగ్లోబిన్ మన శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్ను పంపే ముఖ్యమైన ప్రోటీన్. హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే శరీరం అలసటగా, బలహీనంగా మారుతుంది. పనిలో ఆసక్తి తగ్గిపోతుంది. గర్భిణుల్లో అయితే ఇది గర్భస్రావం, తొందరపుట్టే ప్రమాదం పెరుగుతుంది. ఆరోగ్య నిపుణులు భారతీయ మహిళలలో అనీమియా చాలా సాధారణమై ఉందని, ఇది రోజురోజుకు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఐరన్ లోపమేనని పేర్కొంటున్నారు. జీవనశైలిలో వస్తున్న మార్పులు, దురాలవాట్లు, సామాజిక కారణాలు కూడా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. సరైన ఆహారం తీసుకోవడం, వైద్యుల సూచనల మేరకు సప్లిమెంట్స్ తీసుకోవడం, అనీమియా గురించి సరైన అవగాహన ఉంటే సమస్యకు అడ్డుకట్ట వేయొచ్చని చెబుతున్నారు.
అనీమియాపై ఉన్న అపోహలను తొలగించాలని వైద్యులు పేర్కొంటున్నారు. చాలామంది అనీమియా ఐరన్ కొరత వల్లే కలుగుతుందని అపోహ ఉన్నది. అయితే, అనీమియా అంటే ఐరన్ శరీరంలో ఐరన్ లెవల్స్ తగ్గిపోవడమేనని చాలామంది అనుకుంటారు. కానీ, ఇది పూర్తిగా నిజం కాదు. అనీమియా అంటే రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం. ఐరన్ కొరత అనేది ప్రధాన కారణాల్లో ఒకటి. ఫోలిక్ ఆసిడ్, విటమిన్ B12 లాంటి పోషకాల కొరత కూడా కారణం అవుతుంది. అదేవిధంగా మలేరియా, తలసేమియా వంటి వ్యాధులూ సైతం అనీమియాకు దారి తీస్తాయి. ఐరన్ కొరత వల్ల ఏర్పడే అనీమియా మొత్తం కేసుల్లో సుమారు 50 శాతమే అని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
మాంసహారులు కాకపోవడం వల్ల అనీమియా వచ్చే ప్రమాదం ఉంటుందనే అపోహ కూడా ఉంది. మాంసాహారంలో ఐరన్ ఎక్కువగా ఉండడంతో, మాంసాహారం తినని వారంతా తప్పనిసరిగా అనీమియా బారినపడుతుంటారని చాలామందిలో అభిప్రాయం ఉంది. ఇది పూర్తిగా నిజం కాదు. మాంసహారం తింటే ఐరన్ లభిస్తుంది. మాంసం, చేపలు తినని వారిలో లోపం ఖచ్చితంగా ఉంటుందని తరచుగా నమ్ముతారు. ఇందులో సగం మాత్రమే నిజం ఉంది. మాంసాహారం తినడం వల్ల అవసరాలు తీరుతాయి. కానీ శాకాహారులకు రక్తహీనత ఖచ్చితంగా వస్తుందని కాదు. శాకాహారంతోనూ రక్తహీనతను తగ్గించొచ్చు, బజ్రా, రాగి, పప్పులు, సోయా, పచ్చి కూరగాయలు, బెల్లం, నువ్వులు, డ్రై ఫ్రూట్స్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.
అలాగే, రక్తంలో హెమోగ్లోబిన్ తక్కువగా ఉండడం వల్లే అనీమియా వస్తుందని మరో అపోహ సైతం ఉంది. ఇదేం పెద్ద సమస్య కాదని భావిస్తుంటారు. దాంతో అనీమియాను చాలా తక్కువగా అంచనా వేస్తుంటారు. కానీ, ఇలాంటి ఆలోచనలు పూర్తిగా తప్పని నిపుణులు పేర్కొంటున్నారు. అనీమియా శరీరంలో అలసట, తలనొప్పి, దృష్టి సమస్య, పనితీరు తగ్గడం తదితర సమస్యలకు కారణమవుతుంది. గర్భిణుల్లో దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. బిడ్డ తక్కువ బరువుతో పుట్టే ప్రమాదం.. ముందస్తుగానే పిల్లలు జన్మించడం, ఇతర సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. అందుకే ఏదైనా స్థాయిలో అనీమియా ఉన్నట్లయితే వెంటనే గుర్తించి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అనీమియా పెరుగుతున్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని, సమాజంలో ఉన్న అపోహలను తొలగించి సరైన ఆహారం, వైద్య సహాయం తీసుకోవడంతో పాటు అవగాహన పెంచుకోవడం వల్ల సమస్య నుంచి బయటపడే అవకాశాలుంటాయని పేర్కొంటున్నారు.