Vaccine | హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): టీకా.. అనగానే చిన్నపిల్లలకు వేసేది అనుకుంటారు. కానీ.. ఈ మధ్య కాలంలో పెద్దవాళ్లు కూడా వ్యాక్సిన్లు వేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీనినే అడల్ట్ వ్యాక్సినేషన్ (వయోజన టీకా) అంటున్నారు. వృద్ధాప్యంలో అనారోగ్యం, ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడటంలో కొన్ని వ్యాక్సిన్లు కీలకపాత్ర పోషిస్తాయి. ఇతర దేశాల్లో అడల్ట్ వ్యాక్సినేషన్ పెద్దఎత్తున సాగుతున్నది. 50 ఏండ్లు దాటిన వారిలో ఎక్కువమందికి దీనిపై అవగాహన ఉంటున్నది.
భారతదేశంలో మాత్రం ఆ పరిస్థితి లేదు. అడల్ట్ వ్యాక్సినేషన్పై ఇక్కడి ప్రజలకు నేటికీ పెద్దగా అవగాహన లేదు. గిరిజన తండాలు, గూడేల సంగతి పక్కన పెడితే చివరికి దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా వయోజన టీకా గురించి పెద్దగా తెలియదు. దీనిపై ఢిల్లీ, లక్నో, చండీగఢ్, వారణాసి, జైపూర్, భోపాల్, రాయ్గఢ్, ముంబై, అహ్మదాబాద్, సూరత్, కోల్కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విజయవాడ, తిరువనంతపురం నగరాల్లో అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్ ఆఫ్ ఇండియా(ఏపీఐ)-ఐపీఎస్వోఎస్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సర్వేలోని కీలకాంశాలు..
ప్రాణ రక్షణలో వ్యాక్సిన్లది కీలకపాత్ర
అడల్ట్ వ్యాక్సినేషన్ గురించి ఆశించిన స్థాయిలో అవగాహన లేదు. ప్రాణ రక్షణలో ఈ వ్యాక్సిన్లది ఎంతో కీలకపాత్ర. అడల్ట్ వ్యాక్సినేషన్ విషయంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశం ఎంతో వెనకబడిపోయింది. నేటికీ.. కొంతమంది టీటీ(టెటానస్ టాక్సాయిడ్), హెబ్వీ (హెపటైటిస్ ఇన్ఫెక్షన్, కుక్కకాటు, యాంటీ రేబిస్ టీకా) మాత్రమే వేయించుకుంటున్నారు. న్యుమోనియా, ఫ్లూ, హెపటైటిస్ బీ, షింగిల్స్ నివారణకు టీకాలు అవసరమని వృద్ధులు గుర్తించాలి. వైద్యులు వారిలో అవగాహన కల్పించాలి. మధుమేహంతోపాటు ఇతర వ్యాధిగ్రస్థులకు ఇన్ఫెక్షన్ సమయంలో అడల్ట్ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
– డాక్టర్ బిపిన్ కుమార్ సేథి, ఎండోక్రైనాలజీ హెడ్ (కేర్ హాస్పిటల్)