Acidity | ఒకప్పుడు ఏది తిన్నా జీర్ణం చేసుకునే వారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇడ్లీ తిన్నా అబ్బో కడుపు బరువుగా ఉన్నదని బాధపడే రోజులు వచ్చాయి. ఏది తిన్న త్వరగా జీర్ణం కాక పుల్లటి తేన్పులతో తీసుకున్న ఆహారం తిరిగి గొంతులోకి వచ్చినట్లవుతున్నది. ఎందుకిలా జరుగుతున్నది. మనం తినే ఆహారం జీర్ణకాకుండా ఎందుకలా ఎసిడిటీ స్థాయికి చేరుతున్నది అనేది పెద్ద సమస్యగా మారింది. కడుపులో మంట, ఛాతీలో మంటగా ఇబ్బంది పెట్టే ఈ సమస్య ఎందుకు వస్తుందో తెలుసుకుందాం.
జీర్ణాశయంలోని జఠర గ్రంధులు విడుదల చేసే జఠర రసంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది. ఇది జీర్ణాశయంలోని బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ఒక్కోసారి అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీనినే ఎసిడిటీ అని పిలుస్తాం. జిహ్వచాపల్యం ఎక్కువగా ఉండే వారిలో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది. ఎసిడిటీ ఉన్నవారిలో ఛాతీలోనూ, గొంతులోనూ, గుండెలోనూ, జీర్ణాశయంలోనూ మంటగా ఉంటుంది. పుల్లటి తేన్పులు వస్తాయి. ఆహారం నోట్లకి వచ్చినట్లుగా అనిపిస్తుంది. మలబద్దకం, అజీర్ణం సమస్యలు పెరిగి ఆకలి మందగిస్తుంది.
మన జీవన విధానం కారణంగానే ఎసిడిటీ సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఉరుకుల పరుగుల జీవితంలో ఏదో తిని పనులు చేస్తూ ఆలసిపోతున్నాం. ఫలితంగా మనకు తెలియకుండానే మానసిక ఒత్తిడిని పొందుతున్నాం. ఇదే మనలో ఎసిడిటీని కలుగజేస్తుంది. అయితే, మన జీవన విధానంలో మార్పులు చేసుకోవడం ద్వారా ఎసిడిటీని చాలా వరకు దూరం చేసుకోవచ్చు.