శస్త్ర చికిత్సలు, ప్రమాదాల సమయంలో రక్తం ఎక్కువగా పోతుంది. అలాంటి సందర్భాల్లో వేగంగా కోలుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? మాంసాహారులు ఏం తినాలి, శాకాహారులకు ఏవి మంచివి?
ప్రతి 120 రోజులకు ఒకసారి మన శరీరంలో రక్తకణాలు పుడుతూ ఉంటాయి. సాధారణంగా శరీర వ్యవస్థకు అవసరమైన రక్తాన్ని దేహమే తయారు చేసుకుంటుంది. కానీ పెద్ద పెద్ద శస్త్ర చికిత్సలు, ప్రమాదాల సమయంలో రక్తం ఎక్కువగా పోతుంది. రోగి రక్తహీనతకు గురవుతాడు. ఈ సమయంలో పోషకాహారం ద్వారా వేగంగా కోలుకోవచ్చు. ఇందుకు ఐరన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఇనుమును శరీరం శోషించుకోవాలంటే విటమిన్-సి అవసరం. అలాగే ప్రొటీన్స్ కూడా హిమోగ్లోబిన్ తయారీకి ఎంతగానో ఉపయోగపడుతాయి.
గాయాలు త్వరగా మానేందుకూ సహకరిస్తాయి. అందుకే బెల్లం, ఎండుద్రాక్ష, ఎండు ఖర్జూర, దానిమ్మలాంటి వాటితో పాటు వివిధ పండ్లను తీసుకోవడం ద్వారా ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. విటమిన్-సి కోసం బత్తాయి, దానిమ్మ, నిమ్మరసంలాంటివి తీసుకోవాలి. మాంసాహారులైతే చికెన్, మటన్, లివర్లలో ప్రొటీన్ బాగా దొరుకుతుంది. శాకాహారులు ప్రొటీన్ కోసం మొలకెత్తిన గింజలు, పప్పులు, సోయా, పనీర్ తీసుకోవచ్చు. గాయాలుఉన్నప్పుడు పప్పులు తింటే చీము వస్తుందన్నది అపోహ మాత్రమే. పైగా వీటిలోని ప్రొటీన్లు గాయాల్ని త్వరగా మాన్పేందుకు తోడ్పడతాయి.
– మయూరి ఆవుల న్యూట్రిషనిస్ట్ Mayuri.trudiet@gmail.com