లండన్: ఒకే భూమి, ఒకే ఆరోగ్యం.. ఇదీ ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త నినాదం. ప్రస్తుతం బ్రిటన్లో జరుగుతున్న జీ7 సదస్సును ఉద్దేశించి వర్చువల్గా మాట్లాడిన మోదీ.. ఈ నినాదాన్ని వినిపించారు. భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారులను నివారించడానికి ప్రజాస్వామిక, పారదర్శక సమాజాలు ప్రత్యేక బాధ్యతను తీసుకోవాలని ఈ సందర్భంగా మోదీ స్పష్టం చేశారు. ఆ దిశగా అంతర్జాతీయ ఐక్యత, నాయకత్వం, సంఘీభావం ఉండాలని కోరారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో భారత్కు అండగా నిలిచిన జీ7 సభ్య దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు.
అంతర్జాతీయ ఆరోగ్య పాలనను మెరుగుపరిచేందుకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని మోదీ తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి తిరిగి పూర్వ దశకు చేరుకోవడం, భవిష్యత్ మహమ్మారులను నివారించే లక్ష్యంతో బిల్డింగ్ బ్యాక్ స్ట్రాంగర్-హెల్త్ అనే టైటిల్తో మోదీ ప్రసంగం సాగింది. కరోనాను ఎదుర్కోవడంలో భాగంగా ఇండియా విజయవంతంగా ఉపయోగించిన డిజిటల్ సాధనాల గురించి కూడా మోదీ వివరించినట్లు పీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది.
ఇక కరోనా వ్యాక్సిన్లపై పేటెంట్ను ఎత్తేయడానికి మద్దతివ్వాలని కూడా ఈ సందర్భంగా జీ7 దేశాలను మోదీ కోరారు. గతేడాది ఇండియా, సౌతాఫ్రికా దేశాలు ఈ ప్రతిపాదనను డబ్ల్యూటీవో ముందు పెట్టగా.. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియాలాంటి దేశాలు దీనికి మద్దతు ప్రకటించాయి. ఈ సమావేశం వన్ ఎర్త్, వన్ హెల్త్ అనే సందేశాన్ని ప్రపంచం మొత్తానికీ ఇవ్వాలని మోదీ ఆకాంక్షించారు. ఆదివారం కూడా వర్చువల్గా జీ7 సదస్సులో పాల్గొనే మోదీ.. రెండు సెషన్లలో మాట్లాడనున్నారు.