మిర్యాలగూడ, అక్టోబరు 31 : ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులను మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్నారు. ఓ వైపు పెట్టుబడులు పెరగడంతో పాటు, దోమపోటు, తాటాకు తెగులు రోగాల నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పంట పండిస్తే మిల్లర్లు మద్దతు ధర అందించకుండా రైతులను దోచుకుంటున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.1960 కాగా రైతుల నుంచి సన్న రకం ధాన్యాన్ని రూ.1650నుంచి 1850వరకే కొనుగోలు చేస్తున్నారు. అదనంగా గుమస్తా, హమాలీ మామూలు, తరుగు, హమాలీ చార్జి పేరుతో అదనపు దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వం వ్యవసాయ పెట్టుబడుల కోసం రైతుబంధు సాయం అందించి ఆదుకుంటుంటే వ్యాపారులు మాత్రం నాణ్యత పేరుతో దోచుకుంటున్నారు.
3.80లక్షల ఎకరాల్లో వరి సేద్యం
ఉమ్మడి జిల్లా పరిధిలో రైతులు 3.80లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 11లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. సమయానికి వర్షాలు కురిసి సాగర్ ప్రాజెక్టులోకి నీరు చేరడంతో ఎడమ కాల్వకు నీరు పుష్కలంగా విడుదల చేశారు. రైతులు ఎక్కువ మొత్తంలో సన్నరకమైన హెచ్ఎంటీ, పూజ, అంకూర్ పూజను సాగు చేశారు. ఆయకట్టు ప్రాంతంలో రైతులు ముందస్తుగా వరి నాట్లు వేయడంతో 10రోజులుగా వరి కోతలు కోస్తున్నారు. మార్కెట్లో నూతన వరి వంగడాలు అయిన సన్న రకం ధాన్యం కొనుగోలు లేకపోవడంతో రైతులు ధాన్యాన్ని మిల్లుల వద్దకు తీసుకెళ్లి వారు అడిగిన ధరకు విక్రయిస్తున్నారు. మిర్యాలగూడ పరిసర ప్రాంతాల మిల్లులకు ప్రతిరోజూ 2వేల ట్రాక్టర్ల ధాన్యం విక్రయానికి వస్తోంది. సన్నరకం ధాన్యం తేమ(25 శాతం) ఉన్న దశలోనే మిషన్తో కోసి మిల్లులకు తరలిస్తే గతంలో క్వింటాకు రూ.2వేలకు పైగా ధర చెల్లించేవారు. ఈ ఏడాది పంటలు అధికంగా వేయడం, ప్రతిరోజూ 2వేల ట్రాక్టర్లకు పైగా ధాన్యం వస్తుండడంతో మిల్లర్లు మద్దతు ధర కన్నా తక్కువకే కొనుగోలు చేస్తున్నారు. మద్దతు ధర రూ.1960 కాగా రైతుల నుంచి రూ.1650 నుంచి రూ.1850 వరకే కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం సన్నరకం బియ్యానికి మంచి ధర ఉన్నా ధాన్యానికి మాత్రం నాణ్యత పేరుతో భారీగా కోత కోస్తున్నారు. ధాన్యం కొనుగోలు క్రమంలో రైతులకు సంబంధం లేని గుమస్తా మామూలు, హమాలీ చార్జి, తరుగు, హమాలీ మామూళ్లు వంటి వాటిపేరు చెప్పి రైతుల నుంచి వసూలు చేస్తున్నారు.
ఎమ్మెల్యే చొరవతో దారికొచ్చిన మిల్లర్లు
మిల్లర్లు ధాన్యం తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నట్లు రైతులు, టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే భాస్కర్రావుకు ఫిర్యాదు చేయగా.. ఆయన ఇటీవల మిల్లర్లు, రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ధాన్యం నాణ్యతను బట్టి రూ.1800 నుంచి 1900 వరకు చెల్లించి కొనుగోలు చేయాలని మిల్లర్లకు సూచించారు. రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యం కొంటే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బాధ్యత వహించాలన్నారు.
ఒక ట్రాక్టరుకు అదనపు వసూళ్లు
గుమస్తా మామూలు రూ. 160
హమాలీ కూలీ రూ.640
హమాలీ మామూలు రూ.100
తరుగు 30 కిలోలు రూ.588
వేబ్రిడ్జి రూ.90