హైదరాబాద్ : ఐటీ సంస్థ వర్చుసా కార్పొరేషన్ తన హైదరాబాద్ క్యాంపస్లో కొవిడ్-19 ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించింది. సంస్థ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, వర్చుసా వినియోగదారుల సేవల నిమిత్తం ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. క్రమంగా భారతదేశంలోని తన ప్రధాన కార్యాలయ ప్రాంగణాల్లో ఇలాంటి సౌకర్యాలను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. ఇటీవలే తన సభ్యుల కోసం కొవిడ్ కేర్ పోర్టల్, మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చిన విషయాన్ని గుర్తుచేసింది. క్యాంపస్ ఆవరణలో 30 పడకలతో ఏర్పాటు చేసిన ఈ ఐసోలేషన్ కేంద్రంలో షవర్లు, వాష్రూమ్లు, కొవిడ్ రికవరీ డైట్ వంటి ఇతర సదుపాయాలను కల్పించింది.
వర్చుసా చీఫ్ పీపుల్ ఆఫీసర్ సుందర్ నారాయణన్ మాట్లాడుతూ.. ఈ కరోనా మహమ్మారి నేపథ్యంలో తమ బృంద సభ్యుల కోసం సాధ్యమైనంత ఉత్తమ సంరక్షణ విధానాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. రెనోవా ఆస్పత్రులకు చెందిన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఆధ్వర్యంలో చికిత్స కొనసాగనున్నట్లు తెలిపారు.