-ప్రకరణ 243K, ప్రకరణ 243ZA ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం 1994, సెప్టెంబర్లో ఏర్పాటయ్యింది. దీనికి ఒక ఎన్నికల కమిషనర్ ఉంటారు. ఇతని పదవీకాలం ఐదేండ్లు. ఎన్నికల కమిషనర్కు సహాయం చేయడానికి ఇద్దరు సెక్రటరీలు ఉంటారు.
-రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికలను నిర్వహిస్తుంది.
-గ్రామీణం: మెంబర్స్ ఆఫ్ ద జిల్లాపరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయన్సీ (ZPTC), మెంబర్స్ ఆఫ్ ద మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయన్సీ (MPTC), గ్రామపంచాయతీ సర్పంచ్, గ్రామపంచాయతీ వార్డు మెంబర్ల పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తుంది.
-పట్టణం: కౌన్సిల్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్, మెంబర్స్ ఆఫ్ మున్సిపాలిటీ, మెంబర్స్ ఆఫ్ నగర పంచాయతీలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తుంది.
-గ్రామీణం: గ్రామపంచాయతీ ఉపసర్పంచ్.
-పట్టణం: మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్, జిల్లాపరిషత్ల చైర్మన్, వైస్చైర్మన్, మున్సిపాలిటీల చైర్మన్, వైస్చైర్మన్.
-ప్రకరణ 243K(2) ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులను తొలగించడానికి ఎటువంటి కారణాలున్నాయో, ఏ విధంగా తొలగిస్తారో అవే కారణాలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను తొలగించవచ్చు.
-ప్రకరణ 243K(3) ప్రకారం ఓటర్ల జాబితాను తయారుచేయడానికి, ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణకు అవసరమైన ఉద్యోగులను కమిషన్ కోరినవిధంగా సమకూర్చడం గవర్నర్ బాధ్యత.
-ప్రకరణ 243K(4) ప్రకారం రాజ్యాంగ నిబంధనలకు లోబడి, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర శాసనసభ తగిన చట్టాలను చేయవచ్చు.
-ప్రకరణ 243L పంచాయతీలను కేంద్రపాలిత ప్రాంతాలకు అన్వయించడం తెలుపుతుంది. దీనిలోని నిబంధనలు కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా వర్తిస్తాయి. ఆ క్రమంలో రాష్ట్ర గవర్నర్ అనే పదాన్ని ప్రకరణ 239 కింద నియమించిన కేంద్రపాలిత ప్రాంత పరిపాలకుడు అని అన్వయించుకోవాలి. శాసనసభ, రాష్ట్ర శాసనసభ అనే పదాలను కేంద్రపాలిత ప్రాంత శాసనసభ అని అన్వయించుకోవాలి. ఈ విభాగంలో ఏదైనా కేంద్రపాలిత ప్రాంతం లేక ఆ ప్రాంతంలో కొంత భాగానికి వర్తింపజేయడంలో కొన్ని సవరణలను చేస్తూ లేక మినహాయింపునిస్తూ రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీచేయవచ్చు
-ప్రకరణ 243M పంచాయతీల ఏర్పాటు నుంచి కొన్ని ప్రాంతాలకు మినహాయింపు.
-ప్రకరణ 243M (1) ప్రకారం ప్రకరణ 244లో పేర్కొన్న షెడ్యూల్డ్ ప్రాంతాలు, ఆదివాసీ ప్రాంతాలకు ఈ భాగం వర్తించదు.
-ప్రకరణ 243M (2) ప్రకారం నాగాలాండ్, మిజోరం, మేఘాలయ రాష్ర్టాలు, మణిపూర్ రాష్ట్రంలోని కొండప్రాంతాలకు ఈ విభాగం వర్తించదు. ఈ ప్రదేశాలకు ప్రత్యేక జిల్లా కౌన్సిళ్లు ఉన్నాయి.
-ప్రకరణ 243M (3) ప్రకారం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ జిల్లాలోని కొండ ప్రాంతాలకు ఈ భాగంలోని జిల్లా పంచాయతీలకు చెందిన నిబంధనలు వర్తించవు. ఆ ప్రదేశానికి ప్రత్యేక డార్జిలింగ్ గుర్ఖా హిల్ కౌన్సిల్ ఉంది.
-ఈ విభాగంలోని నిబంధనలు డార్జిలింగ్ గూర్ఖా హిల్ కౌన్సిల్ అధికారాలను గాని, విధులను గాని ప్రభావితం చేయవు.
-ప్రకరణ 243M (3A) ప్రకారం షెడ్యూల్డ్ కులాలకు సీట్ల రిజర్వేషన్కు సంబంధించి 243D ప్రకరణలోని నిబంధనలు అరుణాచల్ప్రదేశ్ రాష్ర్టానికి వర్తించవు. ఎందుకంటే అక్కడ ఎస్సీలు లేరు. ఈ 243M (3A) ప్రకరణను 83వ రాజ్యాంగ సవరణ (2000) ద్వారా చేర్చారు.
1) క్లాజ్ (2)లోని సబ్క్లాజ్ (a)లో ఉదహరించిన ఏదైనా రాష్ట్రం ఈ విభాగంలోని నిబంధనలను క్లాజ్ (1)లో ఉదహరించిన ప్రాంతాలను మినహాయించి మిగిలిన రాష్ర్టానికి వర్తింపజేసుకొనవచ్చు. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టడానికి మొత్తం శాసనసభ సభ్యుల్లో మెజారిటీ సభ్యుల ఆమోదం కావాలి. అంతేగాక సభకు హాజరైన సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది ఆ తీర్మానాన్ని ఆమోదించాలి.
2) క్లాజ్ (1)లో ఉదహరించింన షెడ్యూల్డ్ ఏరియాలు, ఆదివాసీ ప్రాంతాలకు కూడా ఈ విభాగాన్ని వర్తింపజేసే అధికారం పార్లమెంట్కు ఉంది. అయితే ఆ క్రమంలో ఈ విభాగానికి అవసరమైన మార్పులు, చేర్పులు చేయవచ్చు. ఇందుకు సంబంధించి పార్లమెంట్ ఆమోదించే శాసనం 368 అధికరణ పరిధిలో రాజ్యాంగ సవరణగా పరిగణించరు.
-ప్రకరణ 243N అప్పటికే ఉన్న పంచాయతీ చట్టాల కొనసాగింపునకు సంబంధించిన విషయాలను తెలుపుతుంది. దీనిలో ఏమి పేర్కొన్నలేనప్పటికీ 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి రాకముందు అమల్లో ఉన్న పంచాయతీలకు సంబంధించిన శాసనాలు ఈ విభాగంలోని నిబంధనలకు విరుద్ధంగా ఉండి ఉండవచ్చు. అయినప్పటికీ ఈ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన ఏడాదివరకు మాత్రం అవి అమల్లో ఉంటాయి. లేదా ఆ శాసనాలను రాష్ట్ర శాసనసభ గాని, లేక మరేదైనా అర్హతగల అథారిటీ గాని సవరించడానికి లేక రద్దు చేసేవరకు అవి కొనసాగుతాయి (ఏడాదిలోపు).
-అయినప్పటికీ 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చేనాటికి పంచాయతీలు ఏర్పడి ఉంటే, వాటి కాలపరిమితి ముగిసేవరకు అవి కొనసాగుతాయి. అయితే ఈ లోపుగానే ఆ రాష్ట్ర శాసనసభ ఆ పంచాయతీలను ఒక తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా రద్దు చేయవచ్చు. శాసనమండలి కూడా రద్దు తీర్మానాన్ని అమోదించాలి.
-ప్రకరణ 243O ప్రకారం పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదు.
1) 243K అధికరణం కింద నియోజకవర్గాల ఏర్పాటు, నియోజకవర్గంలో సీట్ల కేటాయింపునకు సంబంధించిన శాసనాల ఔచిత్యాన్ని న్యాయస్థానాల్లో ప్రశ్నించరాదు.
2) పంచాయతీ ఎన్నికలను ప్రశ్నిస్తూ ఎటువంటి దావాను న్యాయస్థానంలో దాఖలు చేయరాదు. అయితే ఎన్నికల వివాదాల విచారణ నిమిత్తం శాసనసభ ద్వారా ప్రత్యేకంగా ఏర్పాటయ్యే అథారిటీ ముందు పిటిషన్ను దాఖలు చేసుకోవచ్చు.