కలలో కూడా తలంపునకు రాకూడదని కోరుకున్నది కండ్ల ముందటికొచ్చింది. పొలం గట్టున కరువు ముచ్చట్లు, ఊరి అరుగులపై కన్నీళ్ల పలవరింతలూ తిరగబెట్టాయి. ‘ఊరిడిసి నే బోదునా.. ఉరివేసుకొని నే సద్దునా’… అని ఆనాటి గాయాల తెలంగాణ గానమై, గుండెల్ని మెలేసిన దినాలు పల్లెలకు తిరిగి తారసపడుతున్నాయి. చేతికొచ్చిన పంటకు తలకొరివి పెట్టలేక, తరుముతున్న బాధ్యతలను తప్పించుకోలేక రైతన్నలు రాలిపోతున్నారు. పొలమే ఇలవేల్పైన ప్రభుత్వం దూరమై, హలమే ఎరుగని సర్కార్తో సమస్యల గంప నెత్తికెత్తుకుంది మన తెలంగాణ.
పదేండ్ల పాటు పారిన కాలువలు ఎండి ఎక్కిరిస్తుంటే, మత్తడి దుంకిన చెరువులు తడి కనపడని ఎండమావులైపోతుంటే, వరిమడులెండి, మట్టిని పిసికిన గుండెలు మండిపోతుంటే మళ్లీ సేతానమేడుందిరా.. తెలంగాణ చేల్లన్నీ బీళ్లాయెరా అనే శోక గీతంలా ఊర్లన్నీ మారిపోయాయి. పాత దినాలను, పల్లేర్ల కాలాన్ని గ్రామాలిప్పుడు అనుభవంలో తడుముతున్నాయి. ఢిల్లీ తప్ప గల్లీ కానలేని పాలకులకు పల్లెకొచ్చిన ఈ ముప్పు నెత్తికెక్కడమేలేదు. ‘పాడిందే పాడరా పాసుపండ్ల సోదరా’ అన్న సామెతలా పాత ప్రభుత్వంపై పండ్లు కొరుకుడే సర్కార్ పనితనంగా మారిపోయింది.
నీటి ట్యాంకర్లతో పొలాల్లో కల్లాపి జల్లుకునే కష్టాల పాలయ్యారు రైతులు. బొట్టుబొట్టు కోసం బావుల్లో దేవులాడే బొక్కెనలా మారి తండ్లాడుతున్నారు. దశాబ్దకాలం రాజులా బతికిన రైతు, రోదనతో రోడ్డు పాలయ్యాడు. రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయిస్తూ తన్మయత్వంలో మునిగిన రోమన్ చక్రవర్తిలా రేవంత్రెడ్డి సర్కార్ రాజకీయోన్మాదంలో ఒళ్లు మరిచిపోయి విహరిస్తున్నది. నదికి నిప్పెట్టాలనే విపరీత ధోరణితో, నిందలను నిజంగా చూపే కుయుక్తులకే కాలం వెచ్చిస్తున్నది. విత్తుకూ పొలానికీ పొత్తు కలిపి, పంటను ఇంటికి చేర్చడం కోసం కేసీఆర్ ప్రభుత్వం పడ్డ కష్టం విలువెంతో అన్నదాతలు ఇప్పడు చర్చించుకుంటున్నారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు, చెరువులు అంటూ నిత్యం పంటల విప్లవం కోసం చెమటోడ్చింది గులాబీ సర్కార్. నలుచెరుగులా నీటి సిరులు పారించేందుకు వ్యవస్థలన్నీ ఒళ్లొంచి శ్రమించేలా చేశారు నాటి సీఎం కేసీఆర్. పంట ఎండడమంటే, భ్రూణ హత్యకు మించిన పాపమని నమ్మే పాలనలో తెలంగాణ పదేండ్లు పంటల మాగాణమై వర్ధిల్లింది.
కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ, నీటి, విద్యుత్తు రంగాల్లో సమూల మార్పులు చేసింది. తద్వారా తెలంగాణలో సాగు విస్తీర్ణం, ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగాయి. అన్నమో రామచంద్ర అని అలమటించిన మన తెలంగాణ.. స్వయం పాలనలో నిండైన బువ్వ గిన్నెగా వర్ధిల్లింది. నీళ్లు, కరెంటు, పెట్టుబడి సహాయం, ఎరువులు.. ఇలా ఎన్నో విధాల రైతన్నలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరాగా నిలబడటం వల్ల కోల్పోయిన బతుకును తెలంగాణ మళ్లీ గెలుచుకుంది. ప్రజల జీవితాల్లో ప్రభవించే మార్పులో కనపడే ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీది. కానీ, కలువనంత దూరం కాను, చేరుకోలేనంత దుర్భేద్యం కానని గప్పాలు కొట్టుకునే రేవంత్ సర్కార్.. ఢిల్లీకి అందుబాటులో, పల్లెకు అందని ఎత్తులో స్వల్పకాలంలోనే వికారమైన శిఖరంలా ఎదిగింది. రాహుల్కు చేరువగా, రైతులకు దూరంగా రేవంత్రెడ్డి ప్రభుత్వం విహరిస్తున్నది. సోనియాగాంధీని మభ్యపెడుతూ, మోదీని ప్రాధేయపడుతూ జనాన్ని యాతనపెడుతున్నది. ఎదురొస్తున్న వేసవి ఇక్కట్లపై అవగాహన కొరవడి, రాజకీయ కుట్రల కోసం కాళేశ్వరాన్ని ఎండబెట్టడం ఎంత అవివేకం? ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద పంటపొలాలు ఎండిపోతున్నా, మొద్దునిద్రలో జోగడం ఎంత మహా నేరం? విలవిల్లాడుతూ రైతులు చివరికి ఒక్కొక్కరుగా ఒరిగిపోతున్నా మీనమేషాలు లెక్కబెడుతున్న రేవంత్ సర్కార్ది రాకాసి నైజం కాదా? నీళ్లు పారిన తెలంగాణలో కన్నీళ్లు వరద అవుతుంటే గ్రామాల గుండెలు పగులుతున్నాయి. రైతులు, కౌలు రైతులకు రూ.15 వేల భరోసా హమీ ఇచ్చిన ధర్మాత్ములు.. ఆ నూకలూ కొండెక్కించి చివరికి సాగునూ పాడెక్కిస్తున్నారు. మాయమై పాత గుర్తులైన ట్యాంకర్లు, జనరేటర్లు, లాంతర్లను మళ్లీ జనం చేతికిచ్చి పాత రోజుల్లోకే తిరిగి పంపిస్తున్నారు.
ఈ ఇందిరమ్మ రాజ్యంలో రైతులే కాదు, అన్ని వర్గాల ప్రజలు వేదనకు గురవుతున్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల పరీక్షల ఫీజులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన హస్తం పార్టీ.. నేడు టెట్తో సహా వివిధ పరీక్షా ఫీజులను భారీగా పెంచి వసూలు చేస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి, 99 శాతం భర్తీ ప్రక్రియ పూర్తి చేసిన ఉద్యోగాలకు నియామక పత్రాలు అందిస్తూ అబద్ధాల పారాయణం పఠిస్తున్నది. వంద రోజులు దాటినా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ కోసం ఒక్క అడుగూ ముందుకేసిందే లేదు.
ఎన్నికలకు మునుపు టీఎస్పీఎస్సీ గత సభ్యుల నియామకంపై రాజకీయ నిరుద్యోగుల ఆరోపణ చేసి, నిరుద్యోగుల్లో అనుమానాలు పెంచింది కాంగ్రెస్ పార్టీ. కానీ, కొత్త కమిషన్లో పక్క రాష్ట్ర వాసినే కాదు, రాజకీయ నిరుద్యోగినీ నియమించి నోటితో చెప్పి నొసటితో యువతరాన్ని వెక్కిరించింది రేవంత్ సర్కార్. అంబేద్కర్ ఆవహించినట్లుగా సామాజిక న్యాయంపై ఊరూరా ఊదరగొట్టిన కాంగ్రెస్ నేతలు ఏలుబడిలోకొచ్చాక ఏం చేస్తున్నారో యావత్తు తెలంగాణ సమాజం చూస్తున్నది. మంత్రి మండలిలో, నామినేటెడ్ పదవుల భర్తీలో సామాజిక న్యాయాన్ని సమాధి చేసి.. సబ్బండ వర్గాలకూ పట్టపగలే చుక్కలు చూపెడుతున్నది. ఇంకా ఆవేదన కలిగించే దుర్మార్గం ఏంటంటే.. గురుకుల వసతి గృహాలలో విద్యార్థుల ఆత్మహత్యలు, హత్యలు జరుగుతున్నా చర్యలే కాదు, కనీసం పర్యవేక్షణే లేదు. వందరోజుల్లోనే 70 ఏండ్ల కాంగ్రెస్ బ్రాండ్
పరిపాలనను రుచి చూపించారు. రాజకీయాల్లోనూ ఫిరాయింపులు, విలువలు వల్లించిన ఉత్త ఉత్తమోత్తములు నేడు ఊసరవెల్లులూ బెదిరిపోయేలా బరితెగిస్తున్నారు. ప్రతిపక్షంలో పొంకనాల పోషయ్యల్లా ప్రవర్తించి, అధికార పీఠమెక్కగానే ఉత్త చేతుల భిక్షపతిలా ప్రజలకు భారంగా మారిపోయారు. సమస్యల పరిష్కారానికి, విధానాల అమలుకు జరగాల్సిన మంత్రిత్వ శాఖల సమీక్షలను.. అధికారులు, కాంట్రాక్టర్లను బ్లాక్మెయిల్ చేయడానికి వేదికగా చేసుకుంటున్నారు. దీన్ని ప్రజా ప్రభుత్వమని అనాలా లేక పీడించే ప్రభుత్వమని పిలువాలో ప్రజలే నిర్ణయించాలి.
తల్లీ.. ఏవీ నిరుడు కురిసిన ఆ సిరులన్నట్లుగా గత పదేండ్ల సాగును తలుచుకొని, నేటి సంక్షోభానికి దుఃఖం దిగమింగాల్సిన దుస్థితి దాపురించింది. దేశంలో తెలంగాణను తలెత్తుకునేలా చేసిన కారణజన్ముడు కేసీఆరే.. మళ్లీ తల్లడిల్లుతున్న తెలంగాణకు తోడుగా నిలబడాల్సిన పరిస్థితి రావడం ఎంత ఆవేదన భరితమో కదా! క్యూబాకు విముక్తి కల్పించి, ఉత్తర అమెరికా దేశాల దాస్యాన్ని దూరం చేయడానికి కదిలిన చేగువేరాలా తెలంగాణ నుంచి దేశ రాజకీయాల గుణాత్మక మార్పునకు మరో సమరానికి నేతృత్వం వహించాల్సిన నేత.. మళ్లీ తెలంగాణకు తిరగబెట్టిన గాయాలను నయం చేయడానికే నడుం కట్టాల్సి రావడం బుద్ధి జీవులను కలతపరుస్తున్నది. ఈ స్థితి తెలంగాణ సమాజానికి మరో నూతన అనుభవం.
బహుశా ఏదో మిగిలిపోయిన, ఈ నేలకు అవసరమైన మహా మార్పునకు కేసీఆర్ అవసరమని ప్రకృతి నిర్ణయమేమో? కేసీఆర్ లాంటి నాయకుడు దేశం వైపు బైలెల్లిపొతే తెలంగాణ పునాదిలో పొడవాల్సిన కొత్త పొద్దుకు మంటలు రాజేసే మహా నాయకుడు మళ్లీ ఎక్కడి నుంచి రావాలి? ఈ పరిణామం కూడా మన తెలంగాణకు మంచికోసమేనేమో? కాకపోతే అవినీతి అభాండాలు, అర్థం లేని నిందలతో గత ప్రభుత్వ చారిత్రక పనులపై బురదజల్లి.. కేసీఆర్ కార్యాచరణను నిలువరించాలని రేవంత్ సర్కార్ కలలు కంటున్నది. నెహ్రూ నుంచి కరుణానిధి దాకా, ఇందిరాగాంధీ నుంచి కనిమొళి వరకు ఆరోపణలను ఎదుర్కోక తప్పలేదు. ఆ మాటకొస్తే స్వాతంత్య్ర సమరంలో మహాత్మాగాంధీకి సమకూరిన నిధులపై కూడా నిందలు మోపారు. అంబేద్కర్ను బ్రిటిష్ పాలకుల బంటు అని తూలనాడారు. కానీ, నిందలన్నీ నిజమైపోవు, అధికారం మోపే ఆరోపణలన్నీ అంటుకోవు. చరిత్ర అధ్యయనం చేసిన ఏ పాలకుడూ కక్షతో వ్యవస్థలను విపక్షాలపై ఉసిగొల్పలేడు. తండ్లాటల్లోకి తెలంగాణను నెట్టి, తగవులాటలతో దృష్టి మళ్లించాలనే హస్తం సర్కార్ చర్యలు అభాసుపాలైపోతాయి. కేసీఆర్ మాత్రం తల్లడిల్లుతున్న తెలంగాణకు తోడుగా నిలబడితీరుతారు. ఆ చారిత్రక పాత్రను మళ్లీ భుజానికెత్తుకొనే.. నిన్న పొలాల్లో కలియతిరిగి, రైతుల కన్నీరును తుడిచి, బతుకుపై భరోసా కల్పించారు. అలాగే గులాబీ బలగం కూడా మళ్లీ తెలంగాణకు మంచి రోజులొచ్చేదాకా పోరు దారిని విడువదు.
(వ్యాసకర్త: తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్)
– డాక్టర్ ఆంజనేయగౌడ్
98853 52242